ఆర్టీసీ బస్సు, వాటర్​ ట్యాంకర్​ ఢీ.. ‘రాజధాని’ బస్సు డ్రైవర్​ మృతి

ఆర్టీసీ బస్సు, వాటర్​ ట్యాంకర్​ ఢీ.. ‘రాజధాని’ బస్సు డ్రైవర్​ మృతి
  • 12 మందికి గాయాలు  
  • నిలిపి ఉన్న వాటర్​ట్యాంకర్​ను ఢీకొట్టడంతో ప్రమాదం
  • జనగామ శివారు క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్​ కాలేజీ సమీపంలో ఘటన

జనగామ, వెలుగు : ఆగి ఉన్న వాటర్ ​ట్యాంకర్​ను ఆర్టీసీ రాజధాని బస్సు ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్​ అక్కడికక్కడే చనిపోగా, 12 మంది గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​ క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్​ కాలేజీ సమీపంలోని నేషనల్​ హైవే పై శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వరంగల్​వన్​డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ ​వెళ్తుండగా డివైడర్ ​పక్కన నిలిపి ఉన్న వాటర్​ట్యాంకర్​ను ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్​ బి.యాదగిరి(49) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా12 మంది గాయపడ్డారు.

వీరిలో ఏడుగురిని జనగామ జిల్లా హాస్పిటల్​కు తరలించి ఫస్ట్​ఎయిడ్​ చేశారు. తర్వాత హైదరాబాద్​ గాంధీ, వరంగల్​ ఎంజీఎం హాస్పిటల్స్​కు పంపించారు. స్వరూప అనే ప్రయాణికురాలి రెండు కాళ్లు విరిగిపోగా వరంగల్​కు రెఫర్​ చేశారు. వాటర్​ట్యాంకర్​వద్ద ఉన్న ట్రాక్టర్​ డ్రైవర్​ డివైడర్​ పైన నిలబడి చెట్లకు నీళ్లు పడుతున్న క్రమంలో బస్సు అతివేగాన్ని గమనించిన ఆయన దూరం జరగడంతో ముప్పు తప్పింది. జనగామ టౌన్​సీఐ ఎలబోయిన శ్రీనివాస్​ సంఘటనా స్థలానికి వచ్చి గాయపడ్డవారిని వెంట వెంటనే హాస్పిటల్​ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.