
- యూఎస్ ఓపెన్కు సానియా దూరం
- గాయంతో విత్డ్రా అయిన హైదరాబాదీ
- రిటైర్మెంట్ ప్లాన్స్ మార్చుకుంటున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇండియా టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ నుంచి విత్డ్రా అయింది. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు సానియా మంగళవారం ప్రకటించింది. దాంతో, తన రిటైర్మెంట్ ప్లాన్స్ మార్చుకుంటానని తెలిపింది. ఈ సీజన్ తర్వాత ఆట నుంచి రిటైర్ అవుతానని 35 ఏళ్ల సానియా జనవరిలోనే ప్రకటించింది. యూఎస్ ఓపెన్తో ఆమె వీడ్కోలు పలికే అవకాశం కనిపించింది. కానీ, ఇప్పుడు ఆ టోర్నీలో తను ఆడటం లేదు.
‘రెండు వారాల కిందట కెనడాలో ఆడుతున్నప్పుడు నా మోచేయికి దెబ్బతగిలింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు అది పెద్ద గాయం అని తెలియలేదు. మోచేయి స్నాయువులో చిన్న చీలిక వచ్చిందని తేలింది. కొన్ని వారాలు విశ్రాంతి అవసరం కాబట్టి యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నా. ఈ టైమ్లో ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ గాయం నా రిటైర్మెంట్ ప్లాన్స్ను మార్చింది’ అని సానియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తదుపరి ప్లాన్స్ గురించి చెబుతానని వెల్లడించింది. యూఎస్ ఓపెన్ ఈ నెల 29న మొదలవుతుంది.