న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్కు టీమిండియా స్టార్ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ నేషనల్సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ సమర్థించాడు. ఒకవేళ తన కోటా ఓవర్లు వేయలేకపోతే షార్ట్ ఫార్మాట్లోనూ హార్దిక్ చోటు కోల్పోతాడని చెప్పాడు. 2019లో బ్యాక్ సర్జరీ చేయించుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేయడం లేదు. దాంతో యూకే టూర్కు వెళ్లిన టెస్టు టీమ్లో అతనికి ప్లేస్ దక్కలేదు. ‘టెస్టు టీమ్ నుంచి హార్దిక్ను తప్పించాలన్న సెలెక్టర్ల నిర్ణయం సమంజసమే. సర్జరీ తర్వాత అతను రెగ్యులర్గా బౌలింగ్ చేయడం లేదు. వన్డేల్లో పది ఓవర్లు, టీ20ల్లో నాలుగు ఓవర్లు వేయలేకపోతే షార్ట్ ఫార్మాట్స్ ఫైనల్ ఎలెవన్లో కూడా తనకు చోటు ఉండదని నేను భావిస్తున్నా. ఓ బ్యాట్స్మన్గా మాత్రమే పాండ్యా అవసరం లేదు. తను బౌలింగ్ చేయలేకపోతే టీమ్ బ్యాలెన్స్ దారుణంగా దెబ్బతింటుంది. ఎక్స్ట్రా బౌలర్ను తీసుకోవాల్సి వస్తే సూర్యకుమార్ లాంటి బ్యాట్స్మన్ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. మనం కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడితే ఫలితం ఉండదని ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ల్లో చూశాం. అయితే మన దగ్గర ఇతర ఆల్రౌండర్లు చాలా మందే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్తో పాటు జడేజా కూడా తిరిగొచ్చాడు. తాను ఆల్రౌండర్గా కూడా పని కొస్తానని శార్దుల్ ఠాకూర్ చూపెట్టాడు. ఒకవేళ హార్దిక్ బౌలింగ్ చేయలేకపోతే వీళ్లతో అతని ప్లేస్ను భర్తీ చేయొచ్చు’ అని శరణ్ దీప్ చెప్పుకొచ్చాడు.
