స్కూల్​ టు డిగ్రీ ..నేషనల్ స్కాలర్ షిప్స్ ఎగ్జామ్

స్కూల్​ టు డిగ్రీ ..నేషనల్ స్కాలర్ షిప్స్ ఎగ్జామ్

ఎంత చదివామన్నది కాదు. ఎంత గ్రహించాం అన్నది ముఖ్యం. చదివిందంతా మైండ్​లో ఎక్కిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇతరులతో పోటీకి మనం సిద్ధమో కాదో ఎవరు చెబుతారు? అని ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నలకు సమాధానమే నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెరీర్​ ఎడ్యుకేషన్ (ఎన్​ఐసీఈ–నైస్​) ఫౌండేషన్ నిర్వహించే నేషనల్​ స్కాలర్​షిప్స్​ ఎగ్జామ్​​. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల లెర్నింగ్​ కెపబిలిటీ, సెల్ఫ్​ అసెస్‌‌మెంట్ చేయడంతో పాటు ర్యాంకర్లకు క్యాష్ ప్రైజ్​లూ అందిస్తోంది నైస్​ ఫౌండేషన్​.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలంటే విద్యార్థులు సరికొత్త లెర్నింగ్ విధానాలు అనుసరించాలని నైస్ ఫౌండేషన్​ చెబుతోంది. ఇందుకుగాను ఎన్​ఎస్​ఈ పేరిట ప్రత్యేక టాలెంట్​ టెస్ట్​ నిర్వహిస్తూ, ​స్కాలర్​షిప్స్ ఇవ్వడమే కాక​, ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు ఎంతవరకు సన్నద్ధులుగా ఉన్నారో అసెస్​ చేస్తుంది. ఐదోతరగతి నుంచే విద్యార్థులు తమను తాము అంచనా వేసుకొని సరైన లెర్నింగ్​ కెపబిలిటీస్ బిల్డ్​ చేసుకునేలా ఈ స్కాలర్​షిప్​ ఎగ్జామ్​ ను నైస్​ ఏటా నిర్వహిస్తోంది.

అర్హతలివే

దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలు/బోర్డులు, కాలేజీలు, యూనివర్శిటీల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్​/12వ తరగతి మరియు ఎనీ డిగ్రీ, డిప్లొమా (ఆల్​ ఇయర్స్​) చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేయండిలా

విద్యార్థులు ఆఫ్​లైన్/ఆన్​లైన్​ లో వ్యక్తిగతంగా లేదా ఆయా ఇన్​స్టిట్యూట్​ల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో చేసేవారు వెబ్​సైట్​ నుంచి అప్లికేషన్​ డౌన్​లోడ్​ చేసుకొని పూర్తి వివరాలు నింపి పాస్​పోర్ట్​ సైజ్​ ఫోటోగ్రాఫ్​ అతికించాలి. నిర్దేశిత ఫీజు రూ.400 డిమాండ్​ డ్రాఫ్ట్​ రూపంలో చెల్లించాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌‌కు ఆధార్​ కార్డు, స్కూల్​/కాలేజ్​ ఐడీ, డిమాండ్​ డ్రాఫ్ట్​ను​ జతచేసి స్పీడ్/రిజిస్టర్డ్​ పోస్ట్ లేదా కొరియర్​ ద్వారా గడువు తేదీలోగా హెడ్​ ఆఫీస్​ లేదా బ్రాంచ్​ ఆఫీస్‌‌కు చేరేలా పంపాలి. లేదా స్వయంగా అందజేయవచ్చు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసేవారు వెబ్​సైట్​లో Apply Online NSE – 2019 మీద క్లిక్​ చేసి అకౌంట్​ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం వచ్చే ఫాంలో పూర్తి వివరాలు నింపి ఆన్​లైన్​లోనే పేమెంట్​ చేయాలి. వీరు ప్రింటవుట్​ పంపాల్సిన అవసరం లేదు.

బెస్ట్​ స్కూల్​, టీచర్​ అవార్డులు

ఈ స్కాలర్​షిప్​లలో విద్యార్థులతో పాటు స్కూల్స్​, కాలేజీలకు బెస్ట్​ స్కూల్​, బెస్ట్​ టీచర్​, బెస్ట్​ ప్రిన్సిపల్​ అవార్డులు కూడా ఇస్తారు. ఇందుకుగాను ప్రిన్సిపల్స్​, టీచర్లు వారి స్కూళ్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసి మెరిట్​/ర్యాంక్​ సాధించేలా చూడాలి. బెస్ట్​ స్కూల్​కు రూ.10 వేలు, బెస్ట్​ ప్రిన్సిపల్​కు రూ.5 వేలు, బెస్ట్​ టీచర్​కు రూ.3000 అవార్డు లభిస్తుంది.

ఎన్​ఐసీఈ

నైస్​ ఫౌండేషన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్రస్ట్​ యాక్ట్​ 1882 కింద రిజిస్టరయిన సంస్థ​. ఇది ఎడ్యుకేషన్​, కమర్షియల్​ ట్రైనింగ్​ ఇస్తూ స్కాలర్​షిప్స్​, ఇతర పోటీ పరీక్షల్లో విద్యార్థుల లెర్నింగ్​ కెపబిలిటీస్ పెంచేందుకు కృషి చేస్తుంది. మహారాష్ర్టలోని నాసిక్​లో ప్రతిభా ఎడ్యుకేషనల్​ సొసైటీగా ప్రారంభమైన ఎన్​ఐసీఈ గత ఐదేళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. జీఆర్​ఈ, జీమ్యాట్​, ఎంపీఎస్ఈ, యూపీఎస్​ఈ, నీట్​, ఐఐటీ–జేఈఈ వంటి ఎంట్రన్స్​ టెస్ట్​లు, బ్యాంకింగ్​, ఇతర ప్రభుత్వ పరీక్షలకూ ట్రైనింగ్​ ఇస్తోంది. అలాగే 8వ తరగతి, టెన్త్​ ఇంటర్​ పాసైన వారికి దాదాపు 30 వొకేషనల్​కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్​ కోర్సులను ఆఫర్​ చేస్తోంది. దీంతో పాటు ప్రజల డిజిటల్ స్కిల్స్​ అంచనా వేయడానికి నేషనల్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఎగ్జామ్​ (ఎన్​ఐటీఈ) పేరిట మరో పరీక్షా నిర్వహిస్తోంది.

‌‌‌‌– వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​

అవార్డులు

ప్రతి క్లాస్​లో టాప్​ ర్యాంక్​లు సాధించిన మొదటి 5 మందికి క్యాష్​ ప్రైజ్​లు ఇస్తారు. ఐదోతరగతిలో ఫస్ట్​ ర్యాంకర్​కు రూ.9 వేలు 5వ ర్యాంకర్​ కు రూ.5 వేల క్యాష్​ ప్రైజ్ ఇస్తుండగా డిగ్రీలో మొదటి ర్యాంకర్​కు రూ.35,000, ఐదవ ర్యాంకర్​ కు రూ.15000 అందిస్తోంది. అన్ని తరగతుల్లో 6 నుంచి 100 ర్యాంక్​లలోపు నిలిచిన వారికి కన్సోలేషన్​ ప్రైజెస్​ ఉంటాయి. పరీక్ష రాసిన వారందరికీ పార్టిసిపేషన్​ సర్టిఫికెట్​, పర్​ఫార్మెన్స్​ అనాలసిస్ రిపోర్టు ఇస్తారు. దీని ద్వారా విద్యార్థి లెర్నింగ్​ అండ్ కాంపిటీటివ్​ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు ఫ్రీ కెరీర్​ గైడెన్స్​, ప్లేస్​మెంట్ సపోర్ట్​ తో పాటు సంస్థకు చెందిన బ్రాంచ్​ల్లో ఉచితంగా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. డిప్లొమా, డిగ్రీలో అన్ని సంవత్సరాల అభ్యర్థులందరినీ ఒక క్లాస్‌‌గానే పరిగణిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

ఆబ్జెక్టివ్​ విధానంలో ఆన్​లైన్​లో నిర్వహించే ఈ పరీక్షలో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు వంద ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్​, ఆయా రాష్ర్టాల ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. సమయం 90 నిమిషాలు. నెగెటివ్​ మార్కులు లేవు. అభ్యర్థులు చదువుతున్న స్కూల్​/కాలేజీకి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రంను కేటాయిస్తారు.