కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటు

గాంధీ వారసులను సావర్కర్, గాడ్సేల వారసులు  ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గాంధీ భవన్ లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈడీ బీజేపీ అనుబంధ సంస్థ లాగే పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులపైనే ఈడీ కన్ను అని..దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల కళ్ళు మూసుకుందని మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్ళు ఇండియాని దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారన్న సీతక్క..ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 మోడీది నీచ చరిత్ర

మోడీది నీచ చరిత్ర అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటన్న ఆయన.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమతో కలుపుకొని ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాహుల్, సోనియాలపై ఈడీ విచారణ కుట్ర పూరితమన్నారు. మోడీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు. మోడీ నీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయిందంటూ  నిలదీశారు. 

ప్రజాస్వామిక వాదులు అండగా ఉండాలె

కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికే..సోనియా, రాహుల్ పై ఈడీ దర్యాప్తు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మల్లురవి మండిపడ్డారు. సోనియా, రాహుల్ కి ప్రజాస్వామిక వాదులు అండగా ఉండాలన్నారు. తప్పుడు కేసులతో కాంగ్రెస్ నేతలను అవమానపరిస్తున్నారని..ఎంతకాలం తమ నాయకులను వేధిస్తారో  అంతకాలం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని చెప్పారు.