గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ తన ఆస్తులను ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తూనే ఉంది. ఇప్పటికే గోదావరిఖనిలో నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సింగరేణి సంస్థ రూ.500 కోట్లు కేటాయించింది. సింగరేణి క్వార్టర్లను కార్మికులకు కాకుండా గవర్నమెంట్ రెవెన్యూ, మున్సిపాలిటీతో పాటు పోలీసు శాఖలో పనిచేస్తున్నవారికి, ఎమ్మెల్యే, ఎంపీ సిఫారసు లేఖలపై ఇతరులకు కేటాయిస్తున్నారు. పోలీస్ శాఖ ఆఫీసులకు సైతం క్వార్టర్లను ఇస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కు కోసం గోదావరిఖని నడిబొడ్డున గల సింగరేణి బి‒గెస్ట్హౌస్ను కేటాయించేందుకు మేనేజ్మెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఇలా సింగరేణి ఆస్తులను ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తుండడం వల్ల ఆఫీసర్లు, ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారు.
కీలకంగా గెస్ట్హౌస్ సేవలు
కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీసు తర్వాత మినీ కార్పొరేట్గా గోదావరిఖనికి పేరుంది. సింగరేణి రామగుండం రీజియన్, బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లు, ఇతర ఆఫీస్ అవసరాల కోసం నిత్యం హైదరాబాద్ హెడ్ ఆఫీస్, కొత్తగూడెం కార్పొరేట్ నుంచి ముఖ్యమైన ఆఫీసర్లు సెంటర్పాయింట్ అయిన గోదావరిఖనికి వస్తుంటారు. స్థానికంగా ఇల్లందు గెస్ట్హౌస్ ఉన్నప్పటికీ ఇందులోని రూమ్లకు కేవలం సింగరేణి డైరెక్టర్లు, ఇతర కీలక పోస్ట్లలో ఉన్న ఆఫీసర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. కింది స్థాయిలో ఉండే వివిధ డిజిగ్నేషన్ల ఆఫీసర్లు, కార్మిక సంఘాల ముఖ్య లీడర్లకు గోదావరిఖని నడిబొడ్డున, జీఎం ఆఫీస్ పక్కన గల గోదావరి (బి) గెస్ట్హౌస్లోని రూమ్లను కేటాయిస్తారు. మొత్తం 17 రూమ్లు ఉండగా అందులో ఎనిమిది సూట్స్ ఉన్నాయి.
ఐటీ పార్క్కు ఇస్తే.. ఎక్కడుండాలె?
అందరికి అందుబాటులో ఉండే సింగరేణి గోదావరి (బి) గెస్ట్హౌస్ను తెలంగాణ సర్కార్ తరపున పెట్టబోతున్న ఐటీ పార్క్కోసం కేటాయిస్తే దూర ప్రాంతాల నుంచి సింగరేణి పనుల కోసం వచ్చే ఆఫీసర్లు ఎక్కడుండాలనే ప్రశ్న తలెత్తుతోంది. కొద్దిరోజుల కోసం ఆఫీసర్లు ఉండేందుకు గోదావరి గెస్ట్హౌస్ మినహా మరో అవకాశం గోదావరిఖనిలో లేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో సింగరేణి ఆఫీసర్లు, యూనియన్ లీడర్లు ఉన్నారు. నివాస వసతితో పాటు టీ, టిఫిన్లు, భోజన సౌకర్యం కలిగిన గోదావరి గెస్ట్హౌస్ను ప్రభుత్వ ఐటీ పార్క్ కోసం కేటాయించడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యామ్నాయం చూసుకోవాలి
సింగరేణి మైన్లు, ఓసీపీలలో పనుల పరిశీలన, తనిఖీల కోసం వచ్చే ముఖ్యమైన ఆఫీసర్లు, విజిలెన్స్ఆఫీసర్ల కోసం పనిచేస్తున్న గోదావరి (బి) గెస్ట్హౌస్ను ప్రభుత్వ ఐటీ పార్క్కోసం కేటాయించడం సరైంది కాదు. ఇప్పటికే చాలా క్వార్టర్లు ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లకు కేటాయించి కార్మికులు, ఆఫీసర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఐటీ పార్క్నిర్మాణం కోసం మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఎకరానికి పైగా స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
–పి.మల్లికార్జున్, బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్కన్వీనర్
కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం
సింగరేణి గోదావరి గెస్ట్హౌస్ను ఐటీ పార్క్ కోసం కేటాయిస్తే అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడతారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్టు కార్మికులు గెస్ట్హౌస్ నిర్వహణ, క్యాంటీన్లో పనిచేస్తున్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి అనేక భవనాలను కేటాయించింది. గెస్ట్హౌస్ను ఐటీ పార్క్కోసం కేటాయించే నిర్ణయంపై మేనేజ్మెంట్ పునరాలోచించాలి. గెస్ట్ హౌస్ను యాజమాన్యమే కొనసాగించాలి.
–తోకల రమేశ్, ఇప్టూ వర్కింగ్ ప్రెసిడెంట్
