
- సిట్ ముందుకు జనార్దన్ రెడ్డి
- టీఎస్పీఎస్సీ చైర్మన్పై 3 గంటలపాటు ప్రశ్నల వర్షం
- కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గురించి వివరాల సేకరణ
- నోటిఫికేషన్స్ నుంచి రిజల్ట్స్ వరకు ప్రాసెస్పై ఆరా
- స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నలుగురు సభ్యుల టీమ్
హైదరాబాద్, వెలుగు : పేపర్ల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డిని సిట్ విచారించింది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల టీమ్ సోమవారం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ హెడ్ ఆఫీస్లోని జనార్దన్రెడ్డి చాంబర్లోనే 3 గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఆయన నుంచి వివరాలు సేకరించింది. ప్రధానంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వివరాల గురించి ప్రశ్నించింది. సెక్రటరీ అనితా రామచంద్రన్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేసింది. ముగ్గురు చెప్పిన వివరాలను పరిశీలించింది.
శంకరలక్ష్మి సిస్టమ్లోనే సాఫ్ట్ కాపీ
గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో ఈసారి కూడా పరీక్షలు సజావుగా సాగుతాయని భావించామని, కానీ ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి అంతా నాశనం చేశారని సిట్ విచారణ సందర్భంగా జనార్దన్రెడ్డి చెప్పారు. అత్యంత రహస్యంగా రూపొందించే పరీక్ష పేపర్లు లీక్ కావడం షాక్కు గురిచేసిందన్నారు. కస్టోడియన్ సెక్షన్లో పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఉందని వివరించారు. శంకరలక్ష్మిపై నమ్మకం ఉందని, గతంలో జరిగిన అనేక పరీక్షల ప్రశ్నపత్రాలను ఆమె జాగ్రత్తగా భద్రపరించిందని తెలిపారు.
ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చిన పేపర్స్ శంకరలక్ష్మి కస్టోడియన్లో ఉంటాయని, ఆమె సిస్టమ్లోకి యాక్సెస్ కావడం తనకు కూడా సాధ్యం కాదని తెలిపారు. పరీక్షకు 12 రోజుల ముందు శంకరలక్ష్మి సిస్టమ్లో సాఫ్ట్ కాపీలు ఉంటాయని, కలెక్టర్స్ నుంచి సేకరించే అభ్యర్థుల సమాచారం ఆధారంగా సెంటర్స్ ఏర్పాట్లు, కావాల్సిన పేపర్స్ ప్రింటింగ్ చేస్తామని చెప్పినట్లు తెలిసింది. చైర్మన్ ఫైనల్ చేసిన కాపీ మాత్రమే కలెక్టర్లకు చేరుతుందని వివరించినట్లు సమాచారం.
సీల్ చేసిన సీడీల రూపంలో..
ఈ క్రమంలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల గురించి ఆరా తీశారు. ప్రవీణ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్కు సంబంధించిన వివరాలను సేకరించారు. కస్టోడియన్ సెక్షన్ గురించి పూర్తి వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత ఎన్ని స్టేజీల్లో ప్రొసీజర్స్ ఉంటాయనే వివరాలు సేకరించారు. పేపర్స్ను ఆన్లైన్లో కాకుండా సీల్ చేసిన సీడీల రూపంలో పంపించేవారని గుర్తించారు. జనార్దన్రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ను సీల్డ్ కవర్లో భద్రపరిచి సిట్ ఆఫీస్కు తరలించారు.