- కొత్తగా ఆరు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నయ్
- ఇప్పటికే 2 వ్యాక్సిన్లు.. వాటికి జత కలిసిన స్పుత్నిక్
- వచ్చే నెలలో మార్కెట్లోకి డీఆర్డీవో 2డీజీ డ్రగ్
హైదరాబాద్, వెలుగు / న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై వ్యాక్సిన్ వజ్రాయుధంలా పనిచేస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు మాస్క్ కూడా పెట్టుకోనక్కర్లేదని అమెరికా ప్రకటించింది. వ్యాక్సినేషన్లో మూడో ప్లేస్లో ఉన్న మనదేశంలో కూడా జోరుగా టీకాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు మరిన్ని వ్యాక్సిన్లు స్పీడ్గా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్లను జనానికి వేస్తుండగా.. వాటికి ఇప్పుడు స్పుత్నిక్ వీ తోడైంది. వాటితో పాటు కొత్తగా మరో ఆరు టీకాలూ రాబోతున్నాయి. ఇంకో ఆరు నెలల్లోపే ఇవి అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది. ఆ టీకాలొస్తే ఇప్పటిదాకా స్లోగా సాగుతున్న వ్యాక్సినేషన్ జోరందుకోనుంది.
స్పుత్నిక్ టీకా వచ్చేసింది
శుక్రవారం హైదరాబాద్లో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ఫస్ట్ డోస్ను వేశారు. దాని ధరను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఖరారు చేసింది. ఒక్కో డోసు ధరను రూ. 995గా నిర్ణయించింది. అయితే, కేవలం దిగుమతి చేసుకున్న టీకాలకే ఈ రేటును ఫిక్స్ చేసింది. అందులో టీకా అసలు ధర రూ.948 కాగా, దానికి 5 శాతం జీఎస్టీనీ యాడ్ చేసి ధరను ఫైనల్ చేసింది. డాక్టర్ రెడ్డీస్కే చెందిన ఉన్నతాధికారికి తొలి టీకా ఇచ్చారు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కలిసి గమాలియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ తయారు చేసిన వ్యాక్సిన్ను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న రష్యా నుంచి వ్యాక్సిన్లు వచ్చాయి. దిగుమతి చేసుకున్న వాటితో పోలిస్తే మన దేశంలో తయారయ్యే స్పుత్నిక్ డోసులకు మాత్రం తక్కువ ధరే ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. మే 1న ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్లు వచ్చాయని, గురువారం వాటి వాడకానికి కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ అనుమతిచ్చిందని పేర్కొంది. ఏడాదిలో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించేందుకు టార్గెట్ పెట్టుకున్నామని చెప్పింది.
త్వరలో మరో 3.6 కోట్ల డోసులు రష్యా నుంచి వస్తాయని, మే నెల చివరి నాటికి వాటిని పంపించాల్సిందిగా ఆర్డీఐఎఫ్ను కోరామని వెల్లడించింది. దేశంలో వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. దేశంలో స్పుత్నిక్ టీకాల ప్రొడక్షన్కు ఆరు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. హెటిరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, విర్కో బయోటెక్, ప్యానాసియా బయోటెక్, శిల్ప మెడికేర్, స్టెలిస్ బయోఫార్మాలూ స్పుత్నిక్ను తయారు చేస్తున్నాయంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను తగ్గించాలంటే వ్యాక్సినేషనే మేలైన ఆయుధమని కంపెనీ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్రెడ్డి చెప్పారు. అందులో భాగంగా తొందర్లోనే వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. కాగా, ఆర్ఏడీ 26, ఆర్ఏడీ5 అనే రెండు డోసుల కాంబోలో తయారైన స్పుత్నిక్ టీకా పనితీరు 91.6 శాతంగా ఉందని ట్రయల్స్లో వెల్లడైంది. ఫస్ట్ డోస్ కింద ఆర్ఏడీ26, రెండో డోస్ కింద ఆర్ఏడీ 5ను ఇస్తారు.
మరో లోకల్ వ్యాక్సిన్ రెడీ
కరోనా వ్యాక్సిన్లలో మరో లోకల్ టీకా వచ్చేస్తోంది. అహ్మదాబాద్ కంపెనీ జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకొవ్– డీ వచ్చే నెలలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఏడాదికి 24 కోట్ల డోసులను తయారు చేసేందుకు కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. ఈ నెలాఖరుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించిన డేటాను అందించనుంది. ‘‘ప్లాస్మిడ్ డీఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసిన మా వ్యాక్సిన్ పనితీరు చాలా బాగుంది. మే చివరి నాటికి ట్రయల్స్ డేటాను ప్రభుత్వానికి అందజేస్తాం. జూన్లో వ్యాక్సిన్ సరఫరాకు అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తాం’’ అని కంపెనీ ఎండీ డాక్టర్ శర్విల్ పటేల్ చెప్పారు. మొదట నెలకు కోటి డోసులను తయారు చేస్తామన్నారు. ఆ తర్వాత దానిని రెట్టింపు చేస్తామని వివరించారు. 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపైనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేశామన్నారు.
మిగతా వాటితో పోలిస్తే కొత్తగా..
ఇప్పుడున్న వ్యాక్సిన్లను కేవలం రెండు డోసులు వేస్తున్నారు. కానీ, జైకొవ్– డీని మూడు డోసులుగా ఇస్తారు. డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్లో వాడే బ్యాక్టీరియాలోని క్రోమోజోమల్ డీఎన్ఏకి కరోనా వైరస్ జీన్ను కలిపి వ్యాక్సిన్ను తయారు చేశారు. దీనిని శరీరంలోకి పంపించినా వైరస్ మరింతగా రెప్లికేట్ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. దాని ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీజెన్లను గుర్తించి ఇమ్యూన్ సిస్టమ్ యాంటీ బాడీలను తయారు చేస్తుందని అంటున్నారు.
ఐఐఎస్సీ వ్యాక్సిన్
కరోనా నివారణకు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) కూడా ఒక వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే దీనిని రూం టెంపరేచర్ 30 డిగ్రీల వద్ద కూడా స్టోర్ చేసుకోవచ్చని, వాటితో పోలిస్తే కరోనా నుంచి మెరుగైన రక్షణనిస్తుందని ఐఐఎస్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్.. కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజేశారు. త్వరలోనే వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలుపెట్టేందుకు ఐఐఎస్సీ రెడీ అవుతోంది. ట్రయల్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోనుంది. అయితే, ఆ వ్యాక్సిన్ ఏంటి? ఎలా తయారు చేశారు? అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు వెల్లడించలేదు.
తక్కువ ధరకే బయోలాజికల్ ఈ వ్యాక్సిన్
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ఈ కంపెనీ ఓ ప్రత్యేకమైన వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. మొత్తం వైరస్ను కాకుండా.. వైరస్లోని భాగాలను తీసుకుని (వైరల్ సబ్ యూనిట్స్) ‘బీఈకొవ్2ఏ’ అనే వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్రం ఓకే చెప్పేసింది. ఈ టెక్నిక్ ద్వారా తయారు చేసే వ్యాక్సిన్ల ధరలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన టెక్సస్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసిన యాంటీజెన్లతో బీఈకొవ్2ఏని సిద్ధం చేసింది. త్వరలోనే ఫేజ్3 ట్రయల్స్ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి 7.5 కోట్ల నుంచి 8 కోట్ల దాకా వ్యాక్సిన్ డోసుల తయారీకి సిద్ధమవుతోంది. మొత్తంగా ఏటా 30 కోట్ల డోసులను తయారు చేస్తామని ఈమధ్యే సంస్థ ప్రకటించింది. ఇప్పుడున్న వ్యాక్సిన్ల కన్నా తక్కువ ధరకే వ్యాక్సిన్ ఇస్తామని కంపెనీ ఎండీ మహిమా దాట్ల ఇటీవల చెప్పారు. అంతేగాకుండా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్నూ ప్రొడ్యూస్ చేయడానికి బయోలాజికల్ ఈ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. క్వాడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఏర్పడిన యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.. కంపెనీకి ఆర్థిక సాయం చేస్తామనీ ప్రకటించింది. 2022 నాటికి వంద కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా ఈ నిధులను ఇవ్వనుంది.
ఫస్ట్ లోకల్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్
దేశంలోని ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను జెన్నోవా బయోఫార్మాస్యుటికల్స్ తయారు చేస్తోంది. కరోనా స్పైక్ ప్రొటీన్ను శరీరంలో తయారు చేసి దానిని మన ఇమ్యూన్సిస్టమ్ గుర్తించేలా చేస్తుంది కరోనా జెనెటిక్ సీక్వెన్స్ ఉండే ఈ ఎంఆర్ఎన్ఏ. పూణెకు చెందిన జెన్నోవా.. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై ట్రయల్స్ చేస్తోంది. ఎమర్జెన్సీ వాడకానికి కేంద్రం అనుమతులిచ్చింది. డిసెంబర్ నాటికి 6 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి.
సీరమ్ కొవోవ్యాక్స్కూ ఓకే
అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను మన దేశంలో ‘కొవోవ్యాక్స్’ పేరిట సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయనుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ఫేజ్3 ట్రయల్స్ నడుస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కూడా వైరస్ సబ్ యూనిట్ ఆధారంగా తయారవుతున్నదే. డిసెంబర్ నాటికి 20 కోట్ల డోసులను ఇచ్చేందుకు కంపెనీ చకచకా అడుగులు వేస్తోంది. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాజల్ వ్యాక్సిన్పైనా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇవేగాకుండా, మరిన్ని విదేశీ టీకాలనూ తెప్పించుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే రెండు మూడ్రోజుల్లోనే అనుమతులిచ్చేస్తామని పేర్కొంది.
28 వేల మందిపై ట్రయల్స్
28 వేల మందిపై జైకొవ్– డీ వ్యాక్సిన్ ఫేజ్3 ట్రయల్స్ చేశామని, ఇప్పటిదాకా దేశంలో జరిగిన అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఇవేనని ఆయన చెప్పారు. అన్ని వేరియంట్లపైనా వ్యాక్సిన్ మంచి ప్రభావాన్ని చూపించిందని చెప్పారు. ఇతర టీకాలతో పోలిస్తే మంచి ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచేందుకు రెండు, మూడు లోకల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, తక్కువ టైంలో వీలైనన్ని ఎక్కువ డోసులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
వచ్చే నెలలో 2డీజీ
కరోనా ట్రీట్మెంట్ కోసం డీఆర్డీవోతో కలిసి తయారు చేసిన 2డీజీ మందును వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రకటించింది. ఈ మందు ధరను ఇంకా నిర్ణయించలేదని, సామాన్య జనాలకూ అందేలాగానే మందు ధరను నిర్ణయిస్తామని పేర్కొంది.