GHMCలో మెయింటెనెన్స్ పనులెన్నీ .. ఇచ్చిన నిధులెన్నీ ?

GHMCలో మెయింటెనెన్స్ పనులెన్నీ .. ఇచ్చిన నిధులెన్నీ ?
  • బల్దియా సీఆర్ఎంపీ రోడ్లపై రాష్ట్ర సర్కార్ ఫోకస్
  • ప్రతి ఏటా రూ.400 కోట్ల నిధులు చెల్లింపు 
  • అగ్రిమెంట్ మేరకు పనులు చేయని ఏజెన్సీలు
  • మెయింటినెన్స్ సరిగా చేయడంలేదనే ఆరోపణలు
  • పూర్తి వివరాలు ఇవ్వాలని జీహెచ్ ఎంసీకి సర్కార్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: బల్దియా పరిధిలోని కాంప్రహెన్సీవ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం(-సీఆర్ఎంపీ) పనులపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. సిటీలోని మెయిన్ రోడ్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 811.9 కిలో మీటర్ల మేర గత ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పింది. వాటి నిర్వహణ కు ప్రతి ఏటా రూ.400 కోట్ల చొప్పున్న 5 ఏండ్ల పాటు అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తంగా రూ. 2 వేల కోట్ల వరకు ఏజెన్సీలకు చెల్లించేందుకు నిర్ణయించింది. ఒక కిలోమీటరుకు ఏడాదికి రూ.50 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. ఇప్పటికే 4 ఏండ్లకు సంబంధించిన డబ్బులను ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లించింది. మరో ఏడాదిలో అగ్రిమెంట్ ముగియనుంది. 

అగ్రిమెంట్ మేరకు పనులు చేయలేదనే..

 రోడ్ల నిర్వహణలో లోపాలు జరిగాయని, పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, మెయింటెన్స్ కూడా సరిగా చేయలేదనేదానిపై ప్రస్తుత సర్కార్ ఫోకస్ చేసింది. ఐదేండ్లలో సీఆర్ఎంపీలో జరిగిన పనులు, ఏజెన్సీలకు చెల్లించిన నిధులపై విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో 6 జోన్లలో మొత్తంగా 5 ఏజెన్సీలకు పనులను గత సర్కార్ అప్పగించింది. చాలా ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ అగ్రిమెంట్ మేరకు  పనులు జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీలకు అప్పగించిన తర్వాత  ఏయే పనులు చేశారనే దానిపై ప్రస్తుతం ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై సర్కార్ వివరాలు సేకరిస్తుంది. 

 కమిషనర్ ను తప్పుదోవ పట్టించేలా..

సీఆర్ఎంపీ రోడ్లకు సంబంధించి అసలు అగ్రిమెంట్ లో ఏముంది, ఏజెన్సీలు చేపట్టాల్సిన  పనులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను వివరాలు కోరారు. అయితే.. ఓ అధికారి కమిషనర్ ని తప్పుదోవ పట్టించేలా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. సీఆర్ఎంపీ రోడ్లపై ఒక పక్కన మాత్రమే ఏజెన్సీలు క్లీన్ చేయాల్సి ఉందని ఆ అధికారి కమిషనర్ కు వివరించారు.  

చివరకు అగ్రిమెంట్ కాపీలో ఏముందనేది కమిషనర్ తెలుసుకొని షాక్ అయినట్లు సమాచారం.  ఏజెన్సీలతో పని చేయించాల్సిన బాధ్యతగల అధికారులే తమకేమి తెలియనట్లుగా వ్యవహరిస్తే ఏజెన్సీలకే మేలు జరగనుందని పేర్కొన్నట్టు తెలిసింది. గత ప్రభుత్వం ఏజెన్సీలపై ఫోకస్ పెట్టకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అన్నింటిని బయటకు తవ్వే ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో భాగంగానే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.  రోడ్లుపై ఎక్కడైనా డ్యామెజ్ అయినా.. వేరే ఏదైనా సమస్యలుంటే కాల్ చేసేందుకు ఫోన్ నెంబర్లతో పాటు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా ఆ నెంబర్లకి కాల్ చేసినా రెస్పాన్స్ ఉండటంలేదు. కొన్నిచోట్ల ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంలేదు.  లేవనే అంశంపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

 వివరాలు కోరిన ప్రభుత్వం 

మెయింటెనెన్స్ కు కేటాయించిన అన్ని రోడ్లలో ఫుట్ పాత్ ల ఏర్పాటు, సెంటర్ మీడియన్లలో గ్రీనరీ డెవలప్ మెంట్ , రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి పనులు చేయాల్సి ఉంది. ప్రధాన రోడ్లలో కూడా ఫుట్ పాత్ ల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో జనాలు రోడ్లపై నుంచే నడుస్తున్నారు. ఇక గ్రీనరీ సరిగా కనిపించడం లేదు. ప్రధాన రోడ్లపై స్వీపింగ్ మిషన్ల ద్వారా రోడ్లను ఊడ్చాల్సి ఉంది. అధికారులు పట్టించుకోకుండా కార్మికులతోనే క్లీన్ చేయిస్తున్నా రు.   కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా  సీఆర్ఎంపీ లక్ష్యా లకు అనుగుణంగా రోడ్లు ఎందుకు లేవనే అంశంపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.