భారత్ లో ఆటో మొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో ఎస్ యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్) కార్ల జోరు నడుస్తోంది. చాలామంది ఎస్ యూవీ కార్లను కొనడానికి మొగ్గు చూపుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎస్ యూవీ కార్ల అమ్మకాలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దాంతో 3.9 మిలియన్ ఎస్ యూవీ కార్ల అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ నిర్వాహకులు చెప్తోన్న మాట.
కానీ, ఇదే సమయంలో ఎంట్రీ లెవెల్ కార్ల వాటా కేవలం 6.5 శాతానికి పరిమితమైంది. 2022–23లో 2.52 లక్షల ఎంట్రీ లెవెల్ కార్లు అమ్ముడయ్యాయి. 2016–17లో మొత్తం పాసింజర్ కార్ల అమ్మకాలలో చూస్తే ఎంట్రీ లెవల్ కార్ల వాటా 57 శాతంగా ఉండేది. దీనికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
సొంత కారు సమకూర్చుకునే ఆదాయ స్థాయిని ఎక్కువ మంది పొందలేకపోతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు చిప్ షార్టేజ్ వల్ల కార్ల తయారీదారులు కూడా ఎక్కువ మార్జిన్లు ఉండే ఎస్యూవీల తయారీకి పెద్ద పీట వేస్తున్నారు. అంటే ఎంట్రీ లెవెల్ కార్ల తయారీని పెద్దగా పట్టించుకోవడం లేదన్నమాట. ఫలితంగా ఎంట్రీ లెవెల్ కార్ల వాటా తగ్గుతోంది.