లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు  ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు చేస్తూ.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. వారంలోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. గతేడాది అక్టోబరులో లఖింపురి ఖేరిలో ఆందోళ చేస్తున్న రైతుల పైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు మరణించగా.. తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు చనిపోయారు.  

ఈ కేసులో అశిష్ మిశ్రాకు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది అలహాబాద్ హైకోర్ట్. అయితే ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ న్యాయవాదులు శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడు బెయిల్పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెంటనే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సిట్ కేసును బలంగా ప్రెజెంట్ చేయనందునే అలహాబాద్ కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిందని అడ్వొకేట్ శివ కుమార్ ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు దర్జాగా బయట తిరుగుతుండగా.. బాధిత కుటుంబాలు భయంతో బతుకుతున్నాయని అన్నారు.