- జడేజా రీఎంట్రీకి లైన్ క్లియర్
నాగ్పూర్: స్వదేశంలో వరుసగా షార్ట్ ఫార్మాట్ సిరీస్లు నెగ్గి జోష్మీదున్న టీమిండియా.. టెస్ట్ ఫార్మాట్లో అసలు సమరానికి రెడీ అవుతోంది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (బోర్డర్–గావస్కర్ ట్రోఫీ) కోసం ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ మెగా సిరీస్ కోసం బీసీసీఐ.. ఐదు రోజుల క్యాంప్ను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఓల్డ్ వాకా స్టేడియంలో ఇండోర్, ఔట్డోర్లో రెండు నెట్ నెషన్స్ లో ప్రాక్టీస్ చేసింది. గ్రౌండ్లోని నెట్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్ తీవ్రంగా చెమటోడ్చారు. ఈ సిరీస్ నెగ్గితే అటు వరల్డ్చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్తో పాటు లాంగ్ ఫార్మాట్లో నంబర్వన్ ర్యాంక్ దక్కే అవకాశం ఉండటంతో.. ఇండియా ఏ చాన్స్ను వదులుకోవడం లేదు. గాయంతో శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టుకు దూరం అవ్వగా.. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాతో పాటు, తెలుగు వికెట్ కీపర్ కేఎస్ భరత్ నెట్స్లో శ్రమించారు. జడేజా తొలుత ఇండోర్ సెషన్లో బౌలింగ్, బ్యాటింగ్ చేశాడు. తర్వాత బయట నెట్స్లోనూ బ్యాటింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. మార్నింగ్ సెషన్లో రెండున్నర గంటల పాటు ఓ బ్యాచ్ ట్రెయినింగ్లో పాల్గొనగా.. మధ్యాహ్నం మరో బ్యాచ్ చెమటోడ్చింది. ఇక, టీమిండియా నెట్ ప్రాక్టీస్ కోసం బీసీసీఐ కేవలం స్పిన్నర్లనే కేటాయించింది. వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్ ఇందులో ఉన్నారు. ఎక్స్ట్రా పేసర్ల గురించి టీమిండియా ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇక మెయిన్ టీమ్లో అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా ఉన్నారు. మరో రెండు రోజుల ప్రాక్టీస్ తర్వాత.. ఆసీస్ బలాన్ని లెక్కలోకి తీసుకుని టీమిండియా ఫైనల్ ఎలెవన్పై ఓ అంచనాకు రావొచ్చు.
అశ్విన్ ‘డూప్లికేట్’తో ఆసీస్ ప్రాక్టీస్
స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లపై ఇండియాను దీటుగా ఎదుర్కొనేందుకు ఆసీస్ కూడా అంతే పకడ్బందీగా ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఆలూర్లోని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూలు... ఈ సిరీస్లో తమకు అత్యంత ప్రమాదకరంగా మారే ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్పై ఎక్కువగా దృష్టి సారించారు. ఇందుకోసం అచ్చం అశ్విన్లాగా స్పిన్వేసే మహేశ్ పిథియా బౌలింగ్లో గురువారం ప్రాక్టీస్ చేశారు. రోజంతా బౌలింగ్ వేసిన పిథియా.. స్మిత్, లబుషేన్, ట్రావిస్ హెడ్ను బాగా ఇబ్బందిపెట్టాడు. జునాగఢ్కు చెందిన 21 ఏళ్ల పిథియా ఇంట్లో టీవీ లేకపోవడంతో 11 ఏళ్ల వయసు వచ్చే వరకు కనీసం అశ్విన్ బౌలింగ్ను కూడా చూడలేదు. అయితే 2013 విండీస్ టూర్ సందర్భంగా పిథియా... అశ్విన్ బౌలింగ్ను చూసి ఇంప్రెస్ అయ్యాడు. అప్పట్నించి అశ్విన్ను ఆరాధించడం మొదలుపెట్టాడు. మొన్న డిసెంబర్లో బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ చేసిన పిథియా బౌలింగ్ ఫుటేజ్ను సోషల్ మీడియాలో చూసి ఆసీస్ తమ ప్రాక్టీస్ శిబిరంలో చేర్చుకుంది. త్రో డౌన్ స్పెషలిస్ట్ ప్రీతేష్ జోషి.. పిథియా విషయాన్ని ఆసీస్ అసిస్టెంట్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ దృష్టికి తీసుకెళ్లాడు. హైదరాబాద్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడిన శశాంక్ మల్హోత్రా కూడా ఆసీస్ నెట్ బౌలర్గా వ్యవహరిస్తున్నాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ ఖలీల్ షరీఫ్ బౌలింగ్లో కూడా ఆసీస్ బ్యాటర్లు తమ నైపుణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.
