- ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్.. అధికారులతో రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
- ఎంజీబీఎస్, ఎల్బీనగర్ నుంచి కనెక్ట్ చేయాలె
- పాత టెండర్లను హోల్డ్ లో పెట్టాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను జీవో 111 ఏరియా గుండా ఎలా పొడిగిస్తారని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఓఆర్ఆర్ రూపంలో మంచి ట్రాన్స్పోర్ట్ఫెసిలిటీ ఉన్నప్పుడు, అక్కడి నుంచి మెట్రో ఎందుకని ప్రశ్నించారు. పైగా ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా పరిమితమేనని, అలాంటప్పుడు ఈ మెట్రో లైన్ఎలా సాధ్యమని అన్నారు. బుధవారం సెక్రటేరియెట్లో మెట్రో విస్తరణపై అధికారులతో రేవంత్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
వాస్తవానికి ఓల్డ్ సిటీలోని సెంట్రల్, ఈస్టర్న్ సిటీల్లోనే జనాభా ఎక్కువుందని.. అలాంటప్పుడు వారి ట్రాన్స్పోర్టేషన్కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ‘‘ఎయిర్పోర్ట్కు మెట్రో కనెక్టివిటీని ఓల్డ్సిటీ మీదుగా తీసుకెళ్లాలి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా మెట్రో లైన్ను పొడిగించాలి. ఎల్బీ నగర్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీని పెంచాలి. తద్వారా పెద్ద సంఖ్యలో సామాన్యులకు మెట్రో అందుబాటులోకి వస్తుంది” అని చెప్పారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్అలైన్మెంట్కోసం పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టాలని ఆదేశించారు. వెంటనే ఎంజీబీఎస్నుంచి ఫలక్నుమా మీదుగా, ఎల్బీ నగర్నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రోను పొడిగించే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఖర్చు తక్కువయ్యే మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పీ7 రోడ్లో ఓ సెక్షన్ .. బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్మీదుగా వెళ్లే మరో సెక్షన్పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
సిటీ అంతటా సమాన అభివృద్ధి..
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా సమాన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. ఓఆర్ఆర్చుట్టూ శాటిలైట్టౌన్షిప్స్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కందుకూరులో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్షిప్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మెగాటౌన్షిప్కు కూడా ఎయిర్పోర్ట్ఏరియా నుంచి తుక్కుగూడ, శ్రీశైలం రోడ్మీదుగా మెట్రో కనెక్టివిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
ఎల్ అండ్టీకి లబ్ధి చేకూర్చడంపై అసంతృప్తి..
ఓల్డ్సిటీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ను పూర్తి చేయనప్పటికీ ఎల్ అండ్టీ సంస్థకు లబ్ధి చేకూర్చడంపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ తతంగంపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. సంక్షేమ పథకాలను అందిస్తూనే సిటీ అభివృద్ధికి దోహదపడేలా సిటీ మాస్టర్ప్లాన్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మూసీ నది తీరాల్లో నాగోల్నుంచి గండిపేట వరకు రోడ్కమ్మెట్రో రైల్కనెక్టివిటీని ఏర్పాటు చేసే విషయంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, సీఎస్ పాల్గొన్నారు