
- రూ.50 వేల వరకు లోన్లకు 100% సబ్సిడీ.. ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్ గైడ్లైన్స్ రిలీజ్
- లక్ష వరకు 90%, 2 లక్షల వరకు 80 %, 4 లక్షల వరకు 70%..
- అమరుల, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి ఫ్యామిలీస్కు ప్రాధాన్యం
- 5 లక్షల యూనిట్లలో 25 శాతం ఉమెన్స్కు.. అందులో ఒంటరి, వితంతు మహిళలకు ప్రయారిటీ
హైదరాబాద్, వెలుగు : ‘రాజీవ్యువ వికాసం’ స్కీమ్ కింద రూ.50 వేల వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు సర్కారు 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. రూ. లక్ష వరకు 90%, రూ. 2 లక్షల వరకు 80%, రూ. 4 లక్షల వరకు 70% సబ్సిడీపై లోన్లు అందజేయనున్నది. ‘రాజీవ్ యువ వికాసం’ స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రూ. 50 వేల వరకు లోన్లు పొందిన లబ్ధిదారులు బ్యాంకులకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ మొత్తాన్ని సర్కారే తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన యూనిట్లకు సంబంధించి లక్ష రూపాయల వరకు 10%, 2 లక్షల వరకు 20% , రూ. 4 లక్షల వరకు 30% బ్యాలెన్స్అమౌంట్ను మాత్రమే లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతపై ఆర్థిక భారం లేకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది.
5 లక్షల మందికి లబ్ధి..
‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నది. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించింది. స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం.. ఐదేండ్ల వ్యవధిలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి. పట్టణాల్లో రూ. 2 లక్షలు, పల్లెల్లో రూ. 1.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలే ఈ స్కీమ్కు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఒకవేళ రేషన్కార్డు లేకపోతే ఇన్కం సర్టిఫికెట్ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు (సదరం సర్టిఫికెట్ తప్పనిసరి) 5% రిజర్వేషన్ అమలవుతుంది. దీనికి తోడు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలకు, స్వయం ఉపాధిలో స్కిల్స్ ఉన్న యువతకు ప్రాధాన్యత ఉంటుందని గైడ్లైన్స్లో స్పష్టంచేశారు.
దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని, అధికారిక పోర్టల్లో (tgobmms.cgg.gov.in) అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను మండల, జిల్లాస్థాయి కమిటీలు పరిశీలించి మార్గదర్శకాలకు తగ్గట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని వెల్లడించారు. కాగా, మండల స్థాయిలో ఎంపీడీవో/మున్సిపల్/జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీలు,. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయి.
అప్లికేషన్కు జత చేయాల్సినవి ఇవే
ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలనుకుంటే రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనగా ప్రభుత్వం పేర్కొన్నా, అవి లేనివారు వార్షికాదాయాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ను జతపర్చాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే), కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన), పట్టాదారు పాస్బుక్ (వ్యవసాయ అవసరాలకు దరఖాస్తు చేసుకుంటే), ‘సదరం’ సర్టిఫికెట్ (దివ్యాంగ దరఖాస్తుదారులకు), పాస్పోర్ట్సైజ్ ఫొటో అప్లికేషన్తో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత.. దాన్ని డౌన్లోడ్ చేసుకుని సమీపంలోని ఎంపీడీవో (గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు) లేదా మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషనర్కు ఫిజికల్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో ప్రజాపాలన కేంద్రాల్లో ఈ స్కీమ్పై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్టు సర్కారు తెలిపింది.