ఒక చేత పెన్నూ, మరో చేత గన్ను.. సుద్దాల హనుమంతు వర్ధంతి నేడు

ఒక చేత పెన్నూ,  మరో చేత గన్ను.. సుద్దాల హనుమంతు వర్ధంతి నేడు

సాయుధ పోరాటానికి ప్రచార సాధనమయ్యాడు సుద్దాల హనుమంతు  ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగులో పేద పద్మశాలి బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. అసలు ఇంటి పేరు గుర్రం. కానీ, ఆయన గుండాల మండలం, సుద్దాల గ్రామంలో నివసించడంతో ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. నిజాం వ్యతిరేకోద్యమంలో జీవితాంతం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే జీవితం అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి. హన్మంతు తండ్రి ఒక ఆయుర్వేద వైద్యుడు.  చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే హనుమంతుకు ఇష్టం. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. గొంతెత్తి పాడటం, చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయనకు హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచార సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన     బురక్రథ బలహీనుడిని కూడా యుద్ధానికి సిద్ధం చేసేదని బలమైన  ప్రచారం. హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడై, ఆ బృందంలో చేరారు.

పీడితులే ఆయన ఇతివృత్తం

హన్మంతు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరి ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశారు. తరువాత ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశారు. పెద్ద చదువులేదు. ఆరోజుల్లో అందుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌‌‌‌‌‌‌‌’, ‘బుడ బుక్కలు, ‘ఫకీరు వేషం’,‘సాధువు’ మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించారు.

అరెస్ట్​ వారెంట్​

కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వలంటీర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో ‘సంఘం’ స్థాపించారు. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతుపై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు. వెట్టిచాకిరీని, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ రాసిన  పాటలు వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజపేట మండలం రేణుకుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తుండగా సుద్దాలతో పాటు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరి అక్కడ ఉన్నారు. సభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్న సమాచారం అందడంతో జనం పారిపో తుండగా,  ఓ ముసలామె చేతిలో కర్రను సుద్దాల హన్మంతు లాక్కొని,  'వెయ్.. దెబ్బ దెబ్బకు దెబ్బ...' అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు. 

ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు.   ఆయన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ వ్యాధితో 1982, అక్టోబర్ 10న మరణించాడు. హనుమంతు పాటల్లో యతి ప్రాసలు బలంగా  పడేవి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సంస్థ‌‌‌‌‌‌‌‌  ప్రచురించింది. ప్రముఖ పాటల రచయిత, గాయకుడు అశోక్ తేజ ఈయన కుమారుడే. హనుమంతు లాంటి కవి, రచయిత తెలంగాణలో జన్మించడం ఈ ప్రాంతానికే గర్వంగా  భావించవచ్చు.  ఈ రోజు 41వ వర్ధంతిన ఆయన్ను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం.

- నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్