- లిక్కర్ రేట్లు తగ్గిచ్చిన్రు.. మరి పెట్రోల్, డీజిల్ మాటేంది?
- సేల్స్ పెంచుడే టార్గెట్గా మందు ధరలు దించిన రాష్ట్ర సర్కారు
- పెట్రోల్, డీజిల్పై కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్ డ్యూటీని, ఇతర స్టేట్స్ వ్యాట్ను తగ్గించినా మన దగ్గర తగ్గిస్తలే
- అధిక పెట్రోల్, డీజిల్ ధరల్లో తెలంగాణే సెకండ్.. వ్యాట్లో ఫస్ట్
- పెట్రోల్పై 35.2%.. డీజిల్పై 27% చొప్పున వ్యాట్ వసూలు
- వాటి ధరలు తగ్గిస్తేనే నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గేది
హైదరాబాద్, వెలుగు: కోటర్ సీసా మీద 10, హాఫ్ మీద 20, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు.. ఇట్లా లిక్కర్ రేట్లు తగ్గించిన రాష్ట్ర సర్కారు.. పప్పు, ఉప్పు, పాలు, కూరగాయలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి నిత్యావసరాలపై ప్రభావం చూపే, జనానికి అత్యవసరమైన పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం తగ్గిస్తలేదు. మందు అమ్మకాలు తగ్గినయని, ఇంకింత తాగించాలన్న లక్ష్యంతో లిక్కర్ రేట్లను తక్కువ చేసింది. సేల్స్ను 10 శాతం ఎక్కువ చేయాలని ఆఫీసర్లకు టార్గెట్లు కూడా పెట్టింది. మందు రేట్లు తగ్గించుడు సరే.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.పెట్రో రేట్లపై గతంలో అనేకసార్లు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్కు ప్రజలు రిక్వెస్ట్లు పెట్టినా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా.. తమకేమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఏమన్నా అంటే.. ‘‘మేమేమీ పెంచనప్పుడు మేమెందుకు తగ్గించాలె?’’ అంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. మరి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని జనం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. రాష్ట్రాలను కూడా తగ్గించాలని కోరడంతో.. అనేక రాష్ట్రాలు ఆ మేరకు తమ వ్యాట్ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్పై సగటున రూ.10 తగ్గింది. ఫలితంగా అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలోనే రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ అత్యధికంగా తెలంగాణలోనే ఉంది. పెట్రోల్పై 35.2 శాతం, డీజిల్పై 27 శాతం చొప్పున వ్యాట్ను రాష్ట్ర సర్కారు వేస్తున్నది.
స్పందించలే.. తగ్గించలే..!
పెట్రోల్, డీజిల్ ధరల్లో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉండగా.. ఆ తర్వాత తెలంగాణలోనే రూ.109.66గా ఉంది. డీజిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.98.27గా ఉండగా.. మన రాష్ట్రంలో రూ.97.82గా ఉంది. డీజిల్ ధరలు అతితక్కువగా హిమాచల్ప్రదేశ్లో ఉన్నాయి. అక్కడ లీటర్ డీజిల్ కేవలం రూ.83.36. పెట్రోల్ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్.. అక్కడ రూ.95.28కే లీటర్ పెట్రోల్ దొరుకుతున్నది. కేంద్రం పిలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలూ పెట్రోల్, డీజిల్ రేట్లను గతంలో తగ్గించాయి. తొలుత 2021 నవంబర్ 3న దీపావళి సందర్భంగా లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10ను కేంద్రం తగ్గించింది. ఆ తర్వాత మరోసారి 2022 మే 21న లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 తగ్గించింది. ఆ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తాను వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. వ్యాట్ను రాష్ట్రాలు తగ్గించాలని కేంద్రం కోరింది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తగ్గించలేదు.
వ్యాట్ దంచుడు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విషయంలోనైతే దేశంలోనే తెలంగాణ టాప్. ఏ రాష్ట్రమూ వసూలు చేయనంతగా పన్నును వసూలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ ప్రకారం.. అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. 35.2 శాతం వ్యాట్ను బీఆర్ఎస్ సర్కారు రాబడుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ కన్నా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాటే అధికం. లీటర్ పెట్రోల్పై కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ రూ.19.90. రాష్ట్ర సర్కారు లీటర్ పెట్రోల్పై వసూలు చేస్తున్న వ్యాట్ రూ.28.59. అంటే కేంద్రం వసూలు చేస్తున్న దాని కన్నా రాష్ట్ర సర్కారు రూ.8.69 ఎక్కువగా రాబడుతున్నది. ఇక డీజిల్పైనా ఎక్కువ వ్యాట్ వేస్తున్న రాష్ట్ర సర్కారు మనదే. 27 శాతం వ్యాట్తో టాప్లో ఉంది. పెట్రోల్పై అతి తక్కువగా వ్యాట్ విధిస్తున్న రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. అక్కడ కేవలం 13.5 శాతం వ్యాట్ వేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలనూ లెక్కలోకి తీసుకుంటే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కేవలం ఒక్క శాతం వ్యాట్ విధిస్తున్నారు. డీజిల్పై అతి తక్కువగా వ్యాట్ వేస్తున్న రాష్ట్రం మిజోరం. అక్కడ 5.23శాతం వేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలనూ లెక్కలోకి తీసుకుంటే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఒక్క శాతం విధిస్తున్నారు. కాగా, కొన్ని రాష్ట్రాలు వ్యాట్తో పాటు రోడ్ డెవలప్మెంట్ సెస్, యాంబియెన్స్ చార్జెస్, ఎడ్యుకేషన్సెస్, ఎంప్లాయీమెంట్సెస్, సోషల్ సెక్యూరిటీ సెస్ వంటి వాటిని విధిస్తున్నాయి. అయితే, అవి కూడా రూపాయి నుంచి రూ.5 లోపే ఉన్నాయి. పలు రాష్ట్రాలైతే వ్యాట్ రూ.12ను మించకుండా పన్నును విధిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. అక్కడ వ్యాట్ తెలంగాణలో కన్నా తక్కువగా ఉంది. కానీ, ఏపీలో రోడ్ డెవలప్మెంట్ సెస్ వంటివి యాడ్ చేస్తున్నారు.
20 జిల్లాల్లో రూ.110కుపైగానే పెట్రోల్ ధర
రాష్ట్రంలో 20 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110కిపైగానే ఉంది. పది జిల్లాల్లో రూ.111గా ఉంది. అత్యధికంగా ఆసిఫాబాద్లో రూ.111.87 పెడితేగానీ లీటర్ పెట్రోల్ దొరకడం లేదు. డీజిల్ ధర రెండు జిల్లాల్లో వంద టచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. డీజిల్ ధరలోనూ ఆసిఫాబాదే టాప్లో ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82గా ఉంది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరగవట్టె
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తే జనానికి ఎంతో అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలూ కాస్తంత తగ్గుముఖం పట్టే చాన్స్ ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఉప్పుపప్పుల ధరలు పెట్రోల్, డీజిల్ రేట్లపైనే ఆధారపడి ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గి.. నిత్యావసర వస్తువులు జనానికి అందుబాటు ధరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా ఉండడం వల్లే ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉండేందుకు కారణమైందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి ఆర్బీఐ నివేదికలో వరుసగా మూడు నెలల పాటు ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్లో ఉంది.