
బెంగళూరు: ఇండియా క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఐపీఎల్.. ఇప్పుడు క్రికెటర్ల తలరాతను కూడా మార్చేసింది. లక్షలు వస్తే చాలనుకున్న కుర్రాళ్లకు కోట్లు తెచ్చిపెట్టింది. శనివారం స్టార్టయిన మెగా ఆక్షన్ ఫస్ట్ డేలో.. ఇండియన్ యంగ్ క్రికెటర్ల కోసం పది ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. దీంతో, టీమిండియా, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. సింగిల్ డేలో మెగా కోటీశ్వరుడయ్యాడు. ఇషాన్ కోసం ముంబై ఇండియన్స్ రూ. 15 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసి రిటైన్ చేసుకుంది. బిడ్డింగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోటీకి వచ్చినా.. ముంబై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మొదట 10 మందితో కూడిన మార్కీ సెట్ను పిలిచారు. అందులో భాగంగా ఫస్ట్ శిఖర్ ధవన్ రేస్లోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ తనను రూ. 8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. శ్రేయస్ అయ్యర్ కోసం మూడు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే కోల్కతా నైట్రైడర్స్ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. శ్రేయస్ కెప్టెన్ మెటీరియల్ కావడం, ప్రజెంట్గా సారథి అవసరం ఉండటంతో నైట్రైడర్స్ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది. ఓవరాల్గా పది కోట్లకు పైగా దక్కిన పది మందిలో ఏడుగురు ఇండియన్స్ ఉండటం అతిపెద్ద విశేషం.
దీపక్.. అ‘ధర’హో
ప్రతి ఫ్రాంచైజీ కోర్ టీమ్ను రీబిల్డ్ చేసుకోవడంపై దృష్టి పెట్టడంతో అండర్–-30 ఏజ్ ప్లేయర్లకు డిమాండ్ బాగా పెరిగింది. కరెంట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. ఈసారి లీగ్ ఇండియాలోనే అని స్పష్టం కావడంతో ఇక్కడి పిచ్లపై బాగా రాణించే చాన్స్ ఉండి, గత ఐపీఎల్ పెర్ఫామెన్స్ బాగా ఉన్న వారికి బాగా రేట్ పెట్టారు. ఇందులో భాగంగా ఆల్రౌండర్ దీపక్ చహర్ కోసం చెన్నై రూ. 14 కోట్లు ఖర్చు చేసింది. తమ పాత ప్లేయర్లు డ్వేన్ బ్రావో (రూ. 4.40 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు)నూ రిటైన్ చేసుకుంది. సీమర్ హర్షల్ పటేల్ కోసం కూడా పోటీ ఎక్కువగానే నడిచింది. లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ కావడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ ఇతనిపై ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ బెంగళూరు రూ. 10.75 కోట్లు బిడ్ వేసి మళ్లీ తీసుకుంది. ఐపీఎల్ స్పెషలిస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కోసం ఢిల్లీ రూ. 10.75 కోట్లు కేటాయించింది. ఇండియా పేసర్లు ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణను వరుసగా లక్నో, రాజస్తాన్ చెరో రూ. 10 కోట్లకు దక్కించుకున్నాయి. ఐపీఎల్లో రెగ్యులర్గా ఆడుతున్న నితీశ్ రాణా కోసం కేకేఆర్ రూ. 8 కోట్లు వెచ్చించింది. సింగిల్ మ్యాచ్తో సూపర్ స్టార్ అయిన రాహుల్ తెవాటియాను గుజరాత్ టైటాన్స్ రూ. 9 కోట్లకు ఎగురేసుకుపోయింది. ఇండియా స్పిన్నర్ చహల్ను రాజస్తాన్ రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలతో వచ్చిన ఫినిషర్ షారుక్ ఖాన్ను పంజాబ్ రూ. 9 కోట్లకు దక్కించుకుంది.
ఫారిన్ బౌలర్లకు డిమాండ్..
టాప్–10లో ఏడుగురు ఇండియన్స్ ఉంటే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లకు ప్లేస్ దక్కింది. లంక స్పిన్ ఆల్రౌండర్ వానిందు హసరంగ కోసం ఆర్సీబీ రూ. 10.75 కోట్లు వెచ్చించింది. ఇక పూరన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 10.75 కోట్లు కేటాయించగా, లూకీ ఫెర్గుసన్కు గుజరాత్ టైటాన్స్ రూ. 10 కోట్లు పెట్టింది. అయితే కరీబియన్ హిట్టర్ హెట్మయర్ను రాజస్తాన్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. గతంలో ముంబైకి ఆడిన బౌల్ట్ను ఈసారి రాజస్తాన్ రూ. 8 కోట్లకు చేజిక్కించుకుంది. గతంలో 14 కోట్లకు అమ్ముడుపోయిన కమిన్స్ను కేకేఆర్ ఈసారి రూ. 7.25 కోట్లకే దక్కించుకుంది.
వార్నర్.. అగ్గువకే
అటు ఐపీఎల్కు, ఇటు హైదరాబాద్ ఫ్రాంచైజీకి పెద్ద దిక్కుగా ఉన్న డేవిడ్ వార్నర్కు ఈ వేలం అంతగా కలిసిరాలేదు. ఫారిన్ ప్లేయర్లలో భారీ మొత్తానికి అమ్ముడవుతాడనుకున్న ఈ ఆసీస్ హిట్టర్పై ఫ్రాంచైజీలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. టైటిల్ అందించిన హైదరాబాద్ కనీసం బిడ్ కూడా వేయలేదు. చివరకు ఢిల్లీ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేయడంతో ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజీకే వెళ్లాడు. ఇక కరీబియన్ ఆల్రౌండర్ పూరన్ కోసం హైదరాబాద్ భారీ మొత్తం ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంచైజీలతో పోటీని ఎదుర్కొంటూ రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. మొన్న ఇండియాతో సిరీస్లో భారీ స్కోర్లు చేయకపోయినా తనపై నమ్మకం ఉంచింది.
రైనా వద్దట..
ఈ వేలంలో అతి పెద్ద షాక్ సురేశ్ రైనాకు తగిలింది. ఒకప్పుడు ఐపీఎల్ను శాసించిన అతన్ని.. ఈసారి ఒక్క ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. రూ. 2 కోట్ల బిడ్తో ఆక్షన్లోకి వచ్చిన రైనా కోసం ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపలేదు. బేస్ప్రైస్ వద్దే రిటైన్ చేసుకునే చాన్స్ ఉన్నా.. చెన్నై పట్టించుకోలేదు. యూఏఈలో జరిగిన ఎడిషన్లో అర్ధాంతరంగా తిరిగి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో వచ్చిన స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, ఇమ్రాన్ తాహిర్, ఆదిల్ రషీద్, వేడ్, బిల్లింగ్స్, మహ్మద్ నబీ, డేవిడ్ మిల్లర్, సందీప్ లామిచానేను ఎవరూ పట్టించుకోలేదు. ఇండియా నుంచి ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, సాహాపై ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ పెట్టలేదు.
అయ్యో ఎడ్మీడెస్
ప్లేయర్ ఆక్షన్ ఫస్ట్ డేలో అనుకోని సంఘటనచోటు చేసుకుంది. ఆక్షన్ నిర్వహిస్తున్న వెటరన్ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడెస్ సొమ్మసిల్లి పడిపోయాడు. శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగ కోసం బిడ్డింగ్ జరుగుతుండగా ఎడ్మీడెస్ ఒక్కసారిగా కిందపడటంతో అంతా షాక్కు గురయ్యారు. అతడిని స్ట్రెచర్పై బయటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. బీపీ సడన్గా డౌన్ అవడంతోనే ఎడ్మీడ్స్ సొమ్మసిల్లాడని, ట్రీట్మెంట్ తర్వాత అతని హెల్త్ నిలకడగా ఉందని ఐపీఎల్ ప్రకటించింది. ఎడ్మీడెస్ ప్లేస్లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ చారు శర్మ ఆక్షనీర్గా రావడంతో మధ్యాహ్నం 3.30 తర్వాత ఆక్షన్ రీస్టార్ట్ అయింది. గతంలో ఆక్షన్ నిర్వహించిన అనుభవం లేకపోయినప్పటికీ.. సంప్రదించిన గంటలోపే శర్మ దీనికి ఒప్పుకున్నాడు. ప్రిపరేషన్ లేకున్నా ఆక్షన్ను పర్ఫెక్ట్గా నిర్వహించాడు. ఎడ్మీడెస్ ఎపిసోడ్ కారణంగా ఫస్ట్ డే కేవలం 97 మందినే పిలిచారు. ఆదివారం ఫ్రాంచైజీలు కోరిన ప్లేయర్లను ముందుగా పిలిచి ఆక్షన్ను స్పీడప్ చేస్తారు.
ఫ్రాంచైజీల లెక్క తప్పిందా.!
ఈ సీజన్ ఆక్షన్లో ఫ్రాంచైజీల లెక్కలు తప్పినట్టు తెలుస్తోంది. పది టీమ్స్ పోటీలో ఉండటం, నాణ్యమైన ప్లేయర్లు పరిమిత సంఖ్యలో ఉండటంతో కొంత మంది కోసమే ఫ్రాంచైజీలు అనుకున్నదానికంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చింది. సగటున ముగ్గురికి ఆరు కోట్ల కంటే ఎక్కువే ఖర్చు పెట్టాయి. చాలా టీమ్స్ తాము టార్గెట్ చేసిన ప్లేయర్లను కొనలేకపోయాయి. గుజరాత్ టీమ్లో ఇప్పటికీ ఒక్క కీపర్ కూడా లేకపోవడం అందుకు ఉదాహరణ. కేకేఆర్లో ఇప్పటికి ఐదుగురిని కొంటే నలుగురి కోసమే 34.75 కోట్లు ఖర్చు చేసింది. ఆ టీమ్లో క్యాప్డ్ కీపర్ లేడు. ఆ టీమ్లో ఇంకా 16 ఖాళీలు ఉండగా.. కేవలం 12.65 కోట్లే మిగిలున్నాయి.మరోవైపు ఫస్ట్ డే ముంబై నలుగురినే కొన్నది. అందులో పేరున్నది ఇషాన్ ఒక్కడే. ఆ టీమ్లో రిటైన్ చేసుకున్న రోహిత్, బుమ్రా, పొలార్డ్, సూర్యకుమార్, ఇషాన్ (ఆక్షన్లో) తప్పితే నమ్మకం ఉంచే ప్లేయర్ లేడు. రూల్ ప్రకారం ఆ టీమ్ కనీసం మరో పది మందిని కొనాలి. 27.85 కోట్లు మిగిలుండగా.. సెకండ్ డే ఎలా వస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరికొన్ని ఫ్రాంచైజీల పరిస్థితి ఇలానే ఉంది. ఇక, ఈ సీజన్ ఆక్షన్లో హయ్యెస్ట్ రేటు 20 కోట్ల మార్కు అందుకొని.. గత రికార్డులు బ్రేక్ అవుతాయన్న ప్రచారం జరిగింది. కానీ, ఫస్డ్ డే తర్వాత పరిస్థితి చూస్తే ఈసారి ఇషాన్ కిషనే టాపర్గా నిలిచే చాన్సుంది. ఎందుకంటే పంజాబ్ (28.65 కోట్లు), ముంబై (27.85 కోట్లు), చెన్నై (20.45), సన్రైజర్స్ (20.15 కోట్లు) దగ్గర మాత్రమే 20 కోట్లు కంటే ఎక్కువ డబ్బుంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లంతా ఏదో ఒక టీమ్లోకి వచ్చారు. కాబట్టి ఆదివారం అద్భుతం జరిగితే తప్ప ఇషాన్ రేటు దాటకపోవచ్చు.
మరిన్ని వార్తల కోసం