- పలు జిల్లాల్లో లక్షలాది టన్నులు పెండింగ్
- ధాన్యం సేకరణ నిలిపేస్తూ సివిల్ సప్లయ్స్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నిరుడు వానాకాలం, యాసంగి ధాన్యానికి కేంద్రం విధించిన మిల్లింగ్ గడువు జనవరి 31తో ముగిసింది. లక్షలాది టన్నుల సీఎంఆర్(మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందకుండా నిలిచిపోయింది. కేంద్రం సీఎంఆర్ గడువు పెంచడంపై స్పందించక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మేనేజర్లు సీఎంఆర్ సేకరణ నిలిపివేయాలని సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. జనవరి 31 తరువాత సదరు పెండింగ్ సీఎంఆర్ విషయంలో ఆదేశాలను ఉల్లంఘించి సేకరిస్తే దాన్ని సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించినట్లు సమాచారం.
డైలమాలో సివిల్ సప్లయ్స్..
నిరుడు వానాకాలం, యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగియడంతో మిగిలిన ధాన్యం ఏం చేయాలని సివిల్సప్లయ్స్, సర్కారు యోచిస్తున్నాయి. ఇప్పటికే కొందరు మిల్లర్లు సేకరించిన వడ్లను మిల్లింగ్ చేసి దొడ్డి దారిన అమ్ముకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సర్కారులో అంతర్గతంగా తర్జన భర్జన జరుగుతున్నది. అయితే తాజాగా నిరుడు యాసంగిలో సేకరించిన వడ్లలో 35 లక్షల టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ టెండర్ల గడువు ఈనెల 19వ తేదీ వరకు ఉంది. తాజాగా పిలిచిన టెండర్లలో బిడ్డింగ్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బిడ్డింగ్లో వచ్చిన గరిష్ఠ ధరను అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల నుంచి వసూలు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సారి సీఎంఆర్ సేకరణ స్పీడప్ చేయాలి
ఈ వానాకాలం 2023–24 కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణ స్పీడప్ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మిల్లర్ల నుంచి ఈయేడు వానాకాలం సీఎంఆర్ సేకరణలో ఎలాంటి సమస్యలున్నా హెడ్ ఆఫీస్కు సమాచారం అందించాలని సూచించారు. సమస్యలను ఎఫ్సీఐ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.