న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సహకారంతో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ తయారు చేసిన రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 12 నుంచి 16 మధ్యలో చేపట్టబోయే ఈ ప్రయోగంతో స్కైరూట్ కంపెనీ చరిత్ర సృష్టించనుంది. వాణిజ్య అవసరాలు తీర్చేలా విక్రమ్’స్ రాకెట్ ను తయారుచేసినట్లు స్కైరూట్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్స్ట్రేషన్ మాత్రమేనని, ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నామని కంపెనీకి చెందిన శిరీష్ పల్లికొండ వివరించారు. కంపెనీ నుంచి పంపించే తొలి రాకెట్ కావడంతో ఈ ఆపరేషన్ను ‘ప్రారంభ్ మిషన్’ గా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాకెట్ లాంచింగ్ కు సంబంధించి ఫైనల్ డేట్గురించి ఇంకా తమకు సమాచారం అందలేదని శిరీష్ చెప్పారు.
మూడు రకాల రాకెట్లు..
విక్రమ్ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నట్లు స్కైరూట్ కంపెనీ వెల్లడించింది.
విక్రమ్ 1: పేలోడ్ బరువు 480 కిలోలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి మోసుకెళుతుంది.
విక్రమ్ 2: ఇందులో 595 కిలోల పేలోడ్ ను అంతరిక్షంలోకి తీసుకెళుతుంది.
విక్రమ్ 3: భూమి పైనుంచి 815 కిలోల పేలోడ్ను స్పేస్లోకి 500 కి.మి. వరకు తీసుకెళుతుంది.
చాల థ్రిల్లింగ్గా ఉంది.. పవన్ చందన
శ్రీహరికోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి విక్రమ్1 రాకెట్ స్పేస్ లోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం థ్రిల్లింగ్ ఉందని స్కైరూట్ సహ వ్యవస్థకుడు పవన్ చందన ట్వీట్ చేశారు. మన దేశంతో పాటు వివిధ దేశాల స్టూడెంట్లు తయారుచేసిన శాటిలైట్లను ఈ రాకెట్లో పంపిస్తున్నట్లు వివరించారు.