జీఎస్టీలో మోసాలకు చెక్!
బయో అథంటికేషన్ తీసుకొస్తామంటున్న ట్యాక్స్ అధికారులు
పాన్, ఆధార్ కార్డులు తప్పుగా వాడారా? అని తెలుసుకునేందుకే..
అనుమానిస్తున్న కంపెనీలకే బయో అథంటికేషన్ తప్పనిసరి
జీఎస్టీ రిటర్న్ల ఫైలింగ్లోనూ కొన్ని మార్పులు
న్యూఢిల్లీ : పాన్, ఆధార్ కార్డులను తప్పుగా వాడుతూ జీఎస్టీని ఎగవేస్తున్న కంపెనీలను గుర్తించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. రిస్క్ ఎక్కువగా ఉన్న కంపెనీలు, వ్యాపారాల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్ సేకరించాలనే ఆలోచనలో ఉంది. దీంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ను ఇతర వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులతో చేశారా? లేదా? అనే విషయం తెలుస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చీఫ్ వివేక్ జోహ్రీ అన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ని క్లయిమ్ చేసుకోవడాన్ని తగ్గించేందుకు జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ సిస్టమ్లో మార్పులు తేవాలని కూడా ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లయిమ్ చేసుకోవడానికి మాత్రమే కంపెనీలను పెట్టారని ట్యాక్స్ అధికారులు అనుమానిస్తే అటువంటి కంపెనీల ప్రతినిధులు లేదా డైరెక్టర్లు లేదా పార్టనర్ల నుంచి బయోమెట్రిక్ అథంటికేషన్ను తీసుకుంటామని వివేక్ అన్నారు. కొత్తగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అయ్యే కంపెనీలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలకు ఇది వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్టీ రిజిస్ట్రేషన్ టైమ్లో ఇచ్చిన అడ్రస్ కరెక్టా? కాదా? అని నిర్ధారించుకోవడానికి అన్ని సంస్థలకు జియో ట్యాగింగ్ చేస్తామని అన్నారు.
బయోమెట్రిక్ అథంటికేషన్, జియోట్యాగింగ్ రెండింటిని పైలెట్ ప్రాజెక్ట్గా కొన్ని రాష్ట్రాల్లో నడుపుతున్నామని సీబీఐసీ ప్రకటించింది. ఈ పైలెట్ రిజల్ట్స్ను బట్టి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో చూసుకొని దేశం మొత్తం మీద ఈ సర్వీస్లను తీసుకొస్తామని వెల్లడించింది. ‘జీఎస్టీ సిస్టమ్ను ఇంకా ఎంత మేర మెరుగుపరచగలమో చూస్తున్నాం. ఓటీపీ బేస్డ్ అథంటికేషన్ వాడుతున్నాం. తాజాగా బయోమెట్రిక్ అథంటికేషన్ను వాడడం ప్రారంభించాం. దీన్ని అనుమానం ఉన్న సందర్భాల్లోనే వాడతాం. వ్యక్తులను ఆధార్ సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ను వెరిఫై చేసుకోవాలని చెబుతాం’ అని వివేక్ పేర్కొన్నారు.
12,500 డొల్ల కంపెనీలు..
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందేందుకు ఏర్పాటు చేసిన 12,500 డొల్ల కంపెనీలను గుర్తించామని వివేక్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో డొల్ల కంపెనీల బెడద ఎక్కువగా ఉందని వివరించారు. గుజరాత్, నోయిడా, కోల్కతా, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రాల్లోనూ ఫేక్ బిజినెస్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. మెటల్ లేదా ప్లాస్టిక్ స్క్రాప్, వేస్ట్ పేపర్ సెగ్మెంట్లలో ఫేక్ కంపెనీల రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. ‘సర్వీసెస్ సెక్టార్లలోనూ ఫేక్ కంపెనీలను గుర్తిస్తున్నాం.
మ్యాన్పవర్ సర్వీసెస్, అడ్వర్టయిజింగ్ సర్వీసెస్ కంపెనీల దగ్గర వెంటనే ఫేక్ బిల్లింగ్స్ ఉంటున్నాయి’ అని వెల్లడించారు. ఫేక్ ఐటీసీ క్లయిమ్స్ను అరికట్టేందుకు అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని, అయినప్పటికీ జీఎస్టీఆర్–2ఏ లో ఎంత మేర ఐటీసీ పొందాలో ఎడిట్ చేసుకోవడానికి ట్యాక్స్పేయర్లకు వీలుందని వివేక్ పేర్కొన్నారు.
సప్లయర్లు ఇన్వాయిస్లను టైమ్కి అప్లోడ్ చేయడంలేదని ట్రేడర్లు తమ సమస్యలను లేవనెత్తుతున్నారని, అలానే ఇప్పటికే పేమెంట్స్ చేసిన వాటికి ఇన్వాయిస్లు ఉన్నా, అప్లోడ్ చేయకపోవడం వలన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేకపోతున్నామనే సమస్యలను రైజ్ చేస్తున్నారని వివరించారు. ఐటీసీ క్లయిమ్స్ చేసుకోవడంలో కొన్ని ఎడిటింగ్ ఫెసిలిటీస్ను అందుబాటులో తెచ్చామని వివేక్ అన్నారు. కొన్ని రకాల ఐటీసీ క్లయిమ్లను తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.