
పోయినేడాదే ప్రారంభించిన బాంబినేట్ టెక్నాలజీస్
‘కూ’కు మారినట్టు ఆ యాప్లోనే ప్రకటించిన పీయూష్ గోయల్
ప్రముఖులతో పాటు మైగవ్, ఇండియా పోస్ట్, నీతి ఆయోగ్ వంటి శాఖలకూ అకౌంట్స్
ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రపంచంలో అడ్డేలేకుండా దూసుకుపోతున్న ట్విట్టర్కు పోటీ ‘కూ’త మొదలైపోయింది. సోషల్ మీడియా లోకంలోకి లోకల్ యాప్ ‘కూ’ వచ్చేసింది. అది ఎంట్రీ ఇచ్చి ఏడాది అవుతున్నా.. ఇప్పుడే అందరి నోళ్లలో పడిపోయింది. పది లక్షల మంది మునివేళ్ల కిందకు వచ్చి చేరింది. పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్ వంటి కేంద్ర మంత్రులు, తేజస్వీ సూర్య వంటి యువ ఎంపీలు, మరికొందరు రాజకీయ నాయకులు, మైగవ్, నీతి ఆయోగ్, ఇండియాపోస్ట్ వంటి ప్రభుత్వ శాఖలు, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ వంటి ఫేమస్ క్రికెటర్లు, బాలీవుడ్ సింగర్లు, రచయితలు అకౌంట్లు తెరిచేశారు. కొద్ది రోజుల కిందట మన్ కీ బాత్ ప్రోగ్రామ్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా దాని గురించి ప్రస్తావించారు. ఈ యాప్కు బాంబినేట్ టెక్నాలజీస్ అనే సంస్థ రూపునిచ్చింది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వాత్కాలు ఓనర్లు.
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్.. ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్న నినాదం. గల్వాన్ గొడవ తర్వాత టిక్టాక్, పబ్జీ వంటి చైనా యాప్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మనమే వాటికి పోటీగా లోకల్ యాప్లు ఎందుకు తయారు చేయకూడదంటూ యువతలో స్ఫూర్తి రగిలించింది. పోటీలు కూడా పెట్టింది. ఆ క్రమంలోనే టిక్టాక్కు దేశీ వెర్షన్ ‘చింగారీ’, ‘జోహో’లు వచ్చాయి. ఇప్పుడు సోషల్మీడియాలో పెద్దన్న అయిన ట్విట్టర్కూ పోటీగా ‘కూ’త స్టార్ట్ అయిపోయింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదమే కావొచ్చు.. మన చట్టాలను ట్విట్టర్ పట్టించుకోకపోవడమూ అయి ఉండొచ్చు.. కారణాలేవైనా దేశంలో ఇప్పుడు హాట్ హాట్గా వినిపిస్తున్న యాప్ ‘కూ’!!
ఎవరు తయారు చేశారు?
ఈ యాప్ నిజానికి 2020 ప్రారంభంలోనే మొదలైంది. కానీ, అప్పటికి దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్తో దానికి మంచి పేరు వచ్చింది. ఓ సారి మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూ ‘కూ’ గురించి చెప్పుకొచ్చారు. ఈ యాప్ను అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వాత్కా అనే ఇద్దరు ఎంట్రప్రెన్యూర్లు కలిసి ‘కూ’ యాప్కు రూపమిచ్చారు. బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా యాప్ను నడిపిస్తున్నారు. కోరాకు ఇండియన్ వెర్షన్ అయిన ‘వోకల్’ కూడా బాంబినేట్ కంపెనీ నుంచే వచ్చింది. వీటి కన్నా ముందు యాప్ కో ఓనర్ రాధాకృష్ణ.. ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ అనే ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ను స్టార్ట్ చేశారు. తర్వాత దానిని ఓలా కొనేసింది.
పెట్టుబడులూ బాగానే వచ్చినయ్
‘కూ’ యాప్ కోసం 2018 నుంచే నిధుల సమీకరణ చేపట్టింది బాంబినేట్. చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. బ్లూమ్ వెంచర్స్, కళారీ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ ఇండియా వంటి సంస్థలు డబ్బు సమకూర్చాయి. ఈ నెలలోనూ మరికొన్ని కంపెనీలు ఫండింగ్ చేశాయి. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో టీవీ మోహన్దాస్కు చెందిన 3వన్4 క్యాపిటల్ కూడా పెట్టుబడులు పెట్టింది.
వేగంగా వృద్ధి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇటు ప్రజల్లోకి, అటు ఎంట్రప్రెన్యూర్స్మెదళ్లలో బాగానే నాటుకుపోయింది. ఇప్పటికే 30 లక్షల మందికిపైగా కూ యాప్ను డౌన్లోడ్చేసుకున్నట్టు యాప్ కో ఫౌండర్ మయాంక్ బిద్వాత్కా చెప్పారు. ఆరు నెలల్లోనే 4 రెట్ల మేర వృద్ధి సాధించిందన్నారు. నెలకు సగటున 10 లక్షల మంది యూజర్లు కూలో యాక్టివ్గా ఉంటున్నారన్నారు. ఇక నుంచి ఆ వృద్ధి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. స్థానికులతో రాజకీయ నాయకులుగానీ, స్పోర్ట్స్పర్సన్గానీ ఈజీగా మమేకమయ్యేందుకు స్థానిక భాషలనూ యాప్లో అందుబాటులో ఉంచామన్నారు. యూజర్లు తమకు నచ్చిన లోకల్ లాంగ్వేజ్లో పోస్ట్లు పెట్టొచ్చని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ వంటి భాషలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరిన్ని భాషల్లో త్వరలోనే ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ట్విట్టర్తో గొడవ వల్లేనా?
నిజానికి డేటా ప్రైవసీ, కొన్ని ట్వీట్ల విషయంలో ట్విట్టర్తో కేంద్రానికి కొద్ది రోజులుగా పడట్లేదు. ఈ మధ్య కొందరు ప్రధాని మోడీ పేరిట ‘రైతు హత్యలకు కుట్ర’ అంటూ హాష్ట్యాగ్లు క్రియేట్ చేశారు. ఆ అకౌంట్లతో పాటు ఖలిస్థానీ గ్రూపులతో సంబంధాలున్న వెయ్యికి పైగా అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ట్విట్టర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు.. దేశ చట్టాలతో సంబంధం లేకుండా ఉన్నాయంటూ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పీయూష్ గోయల్ తాను ‘కూ’కు మారినట్టు వెల్లడించారు. నెటిజన్లకూ దానిని రిఫర్ చేశారు.
మంత్రులు, ఎంపీలు, సింగర్లు, క్రికెటర్లకు అకౌంట్లు
కూ యాప్లో ఇప్పుడు పెద్ద పెద్దోళ్లు చేరుతున్నారు. రాజకీయ నాయ కులు, క్రీడాకారులు, బాలీవుడ్ సింగ ర్లు కూకు యూజర్లు అయిపోయారు. ముఖ్యంగా ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఎంపీలు తేజస్వీ సూర్య, శోభా కరాంద్లాజే, కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఇషా ఫౌండేషన్ యోగి జగ్గీ వాసుదేవ్, ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, రెజ్లర్ పవన్ కుమార్ బాలీవుడ్ యాక్టర్ అశుతోష్ రాణా, సింగర్లు జస్వీందర్ సింగ్, రచయిత అమీశ్ త్రిపాఠీ, కాలమిస్ట్ సుహేల్ సేఠ్ వంటి ప్రముఖులు అందులో చేరారు. ఈమధ్య పీయూష్ గోయల్ స్వయంగా కూ యాప్కు మారినట్టు ఆ యాప్లోనే ఓ మెసేజ్నూ పోస్ట్ చేయడం విశేషం.
ప్రభుత్వ శాఖలు కూడా..
సెలబ్రిటీలే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ ఇప్పుడు ‘కూ’లో అకౌంట్లున్నాయి. మైగవ్, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియా పోస్ట్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, డిజిటల్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్వంటి పెద్ద పెద్ద శాఖలు కూలో ఖాతాలను కలిగి ఉన్నాయి.