- ఎమర్జెన్సీ పేషెంట్లను ముందే గుర్తిస్తది
- సరికొత్త సాఫ్ట్వేర్ సీఎస్ఎస్ను డెవలప్ చేశామన్న కేంద్రం
- సౌకర్యాల కొరత ఉన్న ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్లలో ఏర్పాటు
న్యూఢిల్లీ: వెంటిలేటర్ సపోర్ట్ అవసరమయ్యే కరోనా పేషెంట్లను ముందుగానే గుర్తించేందుకు సరికొత్త సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఎమర్జెన్సీ, ఇంటెన్సివ్ కేర్ ఎవరికి అవసరమో కూడా ఈ సాఫ్ట్వేర్ గుర్తిస్తుందని చెప్పింది. కోల్కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్(సీడ్) కలిసి తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్కు కొవిడ్ సెవెరిటీ స్కోర్(సీఎస్ఎస్) అని పేరు పెట్టినట్టు వెల్లడించింది. అత్యవసర చికిత్స అవసరమైన పేషెంట్లను గుర్తించేందుకు సాఫ్ట్వేర్ అల్గారిథమ్లో కొన్ని పారామీటర్లను సెట్ చేశామని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వివరించింది. పేషెంట్ లక్షణాలు, టెస్టు రిపోర్టులు, వేరే రోగాల ఆధారంగా సెవెరిటీ స్కోర్ను లెక్కిస్తారంది. ఈ సాఫ్ట్ వేర్ వల్ల అవసరమైన వాళ్లు మాత్రమే హాస్పిటళ్లలో చేరతారని, మిగిలిన బెడ్లు ఖాళీగా ఉంటాయని చెప్పింది. కోల్కతాలోని 3 కమ్యూనిటీ కొవిడ్ కేర్ సెంటర్లలో ఈ టెక్నాలజీని వాడామని తెలిపింది. ఇటీవల కరోనా టైమ్లో అకస్మాత్తుగా ఐసీయూ బెడ్ల అవసరం పెరిగి ఇబ్బంది ఎక్కువైందని, అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈ సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడుతుందని వివరించింది. సీడ్ ప్రాజెక్టులో భాగంగా అరకొర సౌకర్యాలున్న ప్రైమరీ కేర్ ఈ హెల్త్ సెంటర్లలో తొలుత ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంచనున్నారు. సాఫ్ట్వేర్ పారామీటర్లను ట్యాబ్లెట్ కంప్యూటర్లలో రికార్డ్ చేసేందుకు ఫ్రంట్లైన్ వర్కర్లకు ట్రైనింగ్ ఇస్తారు.