
దాడి జరిగిందనే ప్రచారం అబద్ధం: పాక్
ఇస్లామాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీ: లాహోర్లోని గురుద్వారా నాన్కానా సాహెబ్పై దాడి జరిగిందనే వార్తల్లో నిజంలేదని పాక్ ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. గురుద్వారాను ఎవరూ టచ్ చేయలేదని, దానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. రెండు గ్రూపుల మధ్య చిన్న తగాదా చోటుచేసుకోవడంతో అధికారులు వెంటనే రియాక్ట్ అయి వారిని అదుపులోకి తీసుకున్నారని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన రిలీజ్చేసింది. ఈ గొడవకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈమేరకు గురుద్వారాపై దాడి జరిగిందంటూ శనివారం మన మీడియాలో వార్తలు రావడంతో పాక్ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మైనారిటీల సెక్యూరిటీకి వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది. మైనారిటీల రక్షణకు పాక్ సర్కారు కట్టుబడి ఉందని, కర్తార్పూర్ కారిడార్ ఏర్పాటే దీనికి నిదర్శనమని వివరించింది.
తీవ్రంగా ఖండించిన మన విదేశాంగ శాఖ
సిక్కుల పవిత్ర స్థలాల్లో ఒకటైన నాన్కానా సాహెబ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మన విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. గురుద్వారా వద్ద శాంతిభద్రతలు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. గురుద్వారాతో పాటు దేశంలోని సిక్కులకు తగిన సెక్యూరిటీ కల్పించాలని పాక్ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది. నాన్కానా సాహెబ్పై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది. గురుద్వారాపై దాడి ఘటనను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఖండించారు. నాన్కానా సాహెబ్లో చిక్కుకుపోయిన భక్తులను మూకదాడి నుంచి రక్షించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను కోరారు. ఈ ఇష్యూను పాక్ ప్రధాని ఇమ్రాన్తో చర్చించాలంటూ శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
సిక్కులపై మూకదాడి విచారకరమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్ జీపీసీ) పేర్కొంది. దాడి నేపథ్యంలో నాన్కానా సాహెబ్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పాకిస్తాన్కు పంపించనున్నట్లు ప్రకటించింది. దాడి ఘటనపై ఈ టీమ్ పంజాబ్(పాక్) గవర్నర్తో పాటు సీఎంతో సమావేశమై చర్చిస్తుందని తెలిపింది. నాన్కానా సాహెబ్ మేనేజ్మెంట్ కమిటీతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడామని, ప్రస్తుతం పరిస్థితులు నార్మల్గానే ఉన్నాయని వారు చెప్పారని వివరించింది. ఈ దాడికి నిరసనగా ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు యూత్ కాంగ్రెస్ ఆందోళన చేసింది. పాక్ సర్కారుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు కూడా పాక్ ఎంబసీ ముందు ఆందోళనలు చేశారు.
అసలేం జరిగింది?
పాక్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. జగ్జీత్ కౌర్ అనే సిక్కు యువతి, మహ్మద్ హుస్సేన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తమ కుమార్తెను బలవంతంగా ఎత్తుకెళ్లి, మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. హుస్సేన్ కుటుంబం మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. జగ్జీత్ కౌర్ ఇష్టపూర్వకంగా, తనే మతం మార్చుకుని తమ కొడుకును పెళ్లి చేసుకుందని చెబుతోంది. దీనిపై జగ్జీత్ కౌర్ పేరెంట్స్పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ హుస్సేన్పై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు హుస్సేన్ను అరెస్ట్ చేశారు. పోలీసుల రాకతో హుస్సేన్ తల్లిదండ్రులు మండిపడ్డారు. కొంతమంది బంధువులతో కలిసి నాన్కానా సాహెబ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గురుద్వారాకు వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏమిటీ నాన్కానా సాహెబ్..
సిక్కుల తొలి గురువు గురు నానక్ పుట్టిన స్థలమే ఈ గురుద్వారా నాన్కానా సాహెబ్. దీనినే గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని కూడా పిలుస్తారు. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో ఇదొకటి.
ఇంతకన్నా ఇంకేం కావాలి
పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితికి నాన్కానా సాహెబ్పై దాడి ఘటనే నిదర్శనమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని
కోరారు.
పాక్ నిజస్వరూపం బయటపడింది
ఈ ఘటనతో పాక్ నిజస్వరూపం బయటపడింది. ముందేమో సిక్కు యువతిని కిడ్నాప్ చేశారు. తర్వాత ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇదంతా చాలదన్నట్లు పవిత్రమైన గురుద్వారా ముందే ఆ యువతి కుటుంబంపై దాడి జరిగింది. పాక్ సర్కారు ఈ దారుణాలను ఆపేసేలా, అక్కడి సిక్కులకు భద్రత కల్పించేలా ఒత్తిడి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్లను కోరుతున్నా.
– ట్విట్టర్లో హరిసిమ్రత్ కౌర్ బాదల్,
కేంద్ర మంత్రి