- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ నజర్
- సెంట్రల్ ఫోర్సెస్తో సెక్యూరిటీ ఏర్పాట్లు
- సిటీలో పర్యటించిన సీపీ సందీప్ శాండిల్యా
హైదరాబాద్, వెలుగు : సిటీలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారాలు, పోలింగ్ సమయాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్తో కలిసి సీపీ సందీప్ శాండిల్యా శుక్రవారం సిటీలో పర్యటించారు.ఈ క్రమంలోనే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరించారు. గత అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన ఆందోళనలు, గొడవలు జరిగిన నియోజక వర్గాలు, డివిజన్లు, పోలింగ్కేంద్రాల డేటాను కలెక్ట్ చేశారు.
ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన బందోబస్తుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి వరుస భేటీలు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా మరో రెండ్రోజుల్లో కేంద్ర బలగాలు సిటీకి రానున్నాయి. స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెహికల్ చెకింగ్స్తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించనున్నారు.ఈ క్రమంలోనే స్థానిక డీసీపీలకు కొన్ని సీపీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను అప్పగించనున్నారు. నోడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో సంబంధిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. పోలింగ్కు ఒకరోజు ముందు నుంచే పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
ఈసీ అనుమతులు ఉన్న వారిని మినహా ఇతరులను 100 మీటర్ల దూరంలోనే అడ్డుకోనున్నారు. ఓటర్లలో అవగాహన, భద్రతపై భరోసా కలిగించే విధంగా సెంట్రల్ ఫోర్సెస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నాయి. పాతబస్తీ సహా సిటీలోని సమస్యాత్మక నియోజక వర్గాల్లో పర్యటించనున్నాయి. పోలింగ్ స్టేషన్స్, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత ఉండనుంది. ఇందులో లోకల్ పోలీసులను పోలింగ్ కేంద్రాలకు వెలుపల, ఆ తర్వాత రెండంచెల్లో సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీపీ సందీప్ శాండిల్యా సమీక్షిస్తున్నారు. దసరా తర్వాత వరుస భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు.