
- 121 మంది టాపర్లలో.. 70 మందిని విచారించిన సిట్
- గతంలో పోటీ పరీక్షల్లో సాధించిన మార్కుల సమాచారాన్ని సేకరించి విశ్లేషణ
- ఎఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా క్లీన్ చిట్
- మీడియేటర్ తిరుపతయ్య అరెస్ట్, రిమాండ్
- 15కు చేరిన పేపర్ లీక్ కేసు నిందితుల సంఖ్య
- సిట్ అదుపులో మరో ముగ్గురు ఏఈ అభ్యర్థులు
- ప్రశాంత్రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు వచ్చిన దాదాపు 121 మంది అభ్యర్థుల్లో 70 మంది విచారణ పూర్తయింది. కొందరు అభ్యర్థులు ఫోన్లోనే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. గతంలో వారు రాసిన యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాల వివరాలను కూడా సిట్ అధికారులు సేకరించి పరిశీలించారు. ఈ అభ్యర్థులంతా ఏండ్లుగా పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఎఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా వారికి పేపర్ లీకేజీతో సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చారు. దీంతో100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది.
ధాక్యానాయక్, తిరుపతయ్య ఇచ్చిన సమాచారంతో..
సిట్అధికారులు గ్రూప్1 అభ్యర్థులను విచారిస్తూనే.. ఏఈ పేపర్ లీక్ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ధాక్యా నాయక్కు, అభ్యర్థులకు మీడియేటర్గా వ్యవహరించిన తిరుపతయ్యను సోమవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత అతడిని రిమాండ్ కోసం చంచల్గూడ జైలుకు తరలించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య15కు చేరింది. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్పేటకు చెందిన తిరుపతయ్య.. షాద్నగర్ నేరెళ్ల చెరువుకు చెందిన రాజేంద్ర కుమార్కు ఏఈ పేపర్ సేల్ చేసినట్టు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. పేపర్ కోసం రాజేంద్రకుమార్ రూ.5 లక్షలు ధాక్యానాయక్కు ఇచ్చాడు. దీంతో తిరుపతయ్యను కూడా కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురిని విచారిస్తున్నారు.
దిల్ సుఖ్నగర్లోని కోచింగ్ సెంటర్..
రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, ధాక్యానాయక్, రాజేశ్వర్లను సోమవారం విచారించారు. నేటితో వీరందరి కస్టడీ ముగియనుంది. దీంతో సిట్ ఆధీనంలో ఉన్న తిరుపతయ్యతో ధాక్యానాయక్, రాజేశ్వర్లను కలిపి ప్రశ్నించారు. ఈ ముగ్గురి ద్వారా రాజేంద్రకుమార్ ఏఈ పరీక్ష రాసినట్లు గుర్తించారు.దీంతో వీరందరి కాంటాక్ట్స్పై ఫోకస్ పెట్టారు. కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా కాంటాక్ట్స్ మ్యాపింగ్ చేస్తున్నారు. రాజేంద్రకుమార్ కోచింగ్ తీసుకున్న దిల్సుఖ్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అభ్యర్థుల వివరాలనూ సేకరించారు. వీరిలో ఎవరైనా గ్రూప్1, ఏఈ పరీక్షలు రాశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
ఇయ్యాల గ్రూప్1 నిందితుల కస్టడీపై విచారణ
పేపర్ లీక్ ఘటనలో రెండో నిందితుడైన రాజశేఖర్రెడ్డి బావ ప్రశాంత్రెడ్డిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్రెడ్డికి రాజశేఖర్ పేపర్ పంపినట్టు వెల్లడైంది. ప్రశాంత్రెడ్డికి గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100కు పైగా మార్కులు వచ్చాయి. విచారణకు సహకరించకపోవడంతో ప్రశాంత్పై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే చంచల్గూడ జైలులో ఉన్న షమీమ్, దామెర రమేశ్, సురేశ్లను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఇందుకోసం ఈ ముగ్గురిని 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం వాదనలు జరిగాయి. మంగళవారం విచారణ అనంతరం దీనిపై కోర్టు ఆదేశాలను ఇవ్వనుంది.