బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో అమ్ముడవుతున్న పాసింజర్ కార్లలో హై ఎండ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)ల వాటా ఎక్కువవుతోంది. మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. 2022–23 లో దేశంలో పాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 27 శాతం పెరిగి 38.9 లక్షల యూనిట్లకు చేరాయి. కానీ, ఇదే సమయంలో ఎంట్రీ లెవెల్ కార్ల వాటా కేవలం 6.5 శాతానికి పరిమితమైంది. 2022–23లో 2.52 లక్షల ఎంట్రీ లెవెల్ కార్లు అమ్ముడయ్యాయి. 2016–17లో మొత్తం పాసింజర్ కార్ల అమ్మకాలలో చూస్తే ఎంట్రీ లెవల్ కార్ల వాటా 57 శాతంగా ఉండేది. దీనికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
సొంత కారు సమకూర్చుకునే ఆదాయ స్థాయిని ఎక్కువ మంది పొందలేకపోతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు చిప్ షార్టేజ్ వల్ల కార్ల తయారీదారులు కూడా ఎక్కువ మార్జిన్లు ఉండే ఎస్యూవీల తయారీకి పెద్ద పీట వేస్తున్నారు. అంటే ఎంట్రీ లెవెల్ కార్ల తయారీని పెద్దగా పట్టించుకోవడం లేదన్నమాట. ఫలితంగా ఎంట్రీ లెవెల్ కార్ల వాటా తగ్గుతోంది.
ఫైనాన్స్ వల్లే....
ఫైనాన్సింగ్ ఆప్షన్స్లో మార్పు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ పెరిగిన నేపథ్యంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచింది. ఫలితంగా, కార్పొరేట్లు లోన్ల కోసం ఆసక్తి చూపించకపోవడంతో రిటెయిల్ లోన్లపైనే బ్యాంకులు ఫోకస్ పెట్టాయి. కొంచెం ఎక్కువ రిస్క్తో కూడిన ప్రొఫైల్స్ అయినా లోన్లను ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడటం లేదు. అంటే ఆటోమొబైల్ లోన్లు దొరకడం కొంత ఈజీగా మారింది. దీంతో మొదటిసారి కారు కొనేవారు ఎంట్రీ లెవెల్ కారు కంటే ఎస్యూవీ బెటరని, దానివైపు మొగ్గుచూపుతున్నారు.
ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ కార్లతో పోలిస్తే కొంత మెరుగయిన ఫీచర్లతో ఎస్యూవీలను కార్ల తయారీదారులు 2020–21 నుంచీ మార్కెట్లోకి తేవడం మొదలెట్టారు. దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా వంటి కంపెనీలు ఎంట్రీ లెవెల్ కార్లవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఉబరైతే ఎంట్రీ లెవెల్ కార్లనే ఇష్టపడుతోంది. కారు కొనుక్కోలేని డ్రైవర్లకు తానే ఎంట్రీ లెవెల్ కార్లు కొని ఇస్తోంది ఉబర్. అయినా కూడా ఎంట్రీ లెవెల్ కార్ల సేల్స్ జోరందుకోవడం లేదు. దేశంలో మధ్య తరగతి– దిగువ మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పెరిగితే తప్ప మళ్లీ ఎంట్రీ లెవెల్కార్ల అమ్మకాలు జోరందుకోవని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.