వరంగల్​లో టెన్షన్.. టెన్షన్... కాంగ్రెస్ నేతల అరెస్ట్

వరంగల్​లో టెన్షన్.. టెన్షన్... కాంగ్రెస్ నేతల అరెస్ట్
  • వరంగల్​లో టెన్షన్.. టెన్షన్
  • గ్రేటర్ ​వరంగల్​ మున్సిపల్ ​కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం
  • మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
  • ఇరువర్గాల మధ్య తోపులాట
  • పలువురి అరెస్ట్ 

వరంగల్/హనుమకొండ : వరంగల్ ​ఎంజీఎం సర్కిల్​ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు, నెరవేరని ఎన్నికల హామీలపై గ్రేటర్ వరంగల్ ​మున్సిపల్​ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన రహదారిపై బారికేడ్లను ఏర్పాటుచేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ధర్నాకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ఆఫీస్​వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్​కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. 

అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా నేతలు రోడ్డుపై బైఠాయించారు.  పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్​చేసి స్టేషన్​కు తరలించారు. అంతకుముందు వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్, ఎర్రబెల్లి స్వర్ణలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొండా మురళి, సురేఖ దంపతులను హౌస్​​అరెస్ట్​చేశారు. బీఆర్ఎస్​కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక తెలంగాణలో వారి ఆటలు సాగవు అని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ బీఆర్ఎస్​ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.