- రివర్ బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు
- ఆంధ్రా ఓకే.. తెలంగాణ డైలమా
- పర్మిషన్ లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలి
- కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్పై గెజిట్ విడుదల
- బిల్లుల కన్నా జాగ్రత్తగా రూపొందించామన్న కేంద్ర జలశక్తి శాఖ
- మేం స్వాగతిస్తున్నాం: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల జ్యూరిస్డిక్షన్ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా, దీనిపై ఎలా స్పందించాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బోర్డులు ఏర్పడిన ఏడేండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండింటి జ్యూరిస్డిక్షన్ ఖరారు చేసింది. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని కేంద్రం చెప్పింది. ప్రతిపదాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాతే నోటిఫై చేశామని స్పష్టతనిచ్చింది. ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఎం కేసీఆర్ బోర్డుల జ్యూరిస్డిక్షన్పై ఇరిగేషన్, న్యాయ శాఖల అధికారులతో సమాలోచనలు జరిపారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై చర్చించారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) జ్యూరిస్డిక్షన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని గురువారం రాత్రి విడుదల చేసిన గెజిట్లో కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ప్రాజెక్టుల అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, ఆపరేషన్, మెయింటనెన్స్ బాధ్యతలు బోర్డులు పర్యవేక్షిస్తాయి. రీ ఆర్గనైజేషన్ యాక్టులోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాలకు కరెంట్, సాగునీటి సరఫరాకు నీటి విడుదలను బోర్డులు నియంత్రిస్తాయి. పర్మిషన్ లేని ప్రాజెక్టులను జ్యూరిస్డిక్షన్లో చేర్చారు. వాటికి ఆరు నెలల్లోగా అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. గెజిట్ విడుదలైన 60 రోజుల్లో ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడివిడిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
టెక్నికల్ క్లియరెన్స్ రావాల్సిన ప్రాజెక్టులు
రెండు రాష్ట్రాలు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, పర్మిషన్ రావాల్సిన ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లో పొందుపరిచింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మున్నేరు లెఫ్ట్ కెనాల్, పాకాల లేక్, వైరా లేక్, ఊట్కూరు –- మార్పల్లి రిజర్వాయర్, అసిఫ్ నహర్, వీపనగండ్ల, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు, శామీర్పేట్ లేక్, సరలాసాగర్, లంకసాగర్, సింగోటం, జూట్పల్లి ప్రాజెక్టు, ఏపీ నిర్మిస్తున్న బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు, తొర్రిగడ్డ లిఫ్ట్, సీలేరు పవర్ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.
కష్టపడి రూపొందించినం: కేంద్ర జలశక్తి శాఖ
రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి, శ్రద్ధపెట్టి కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల జ్యూరిస్డిక్షన్ రూపొందించామని కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో సీడబ్ల్యూసీ చైర్మన్ హల్దార్, మెంబర్ పుష్పేంద్ర ఓహ్రాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఉన్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల కన్నా జాగ్రత్తగా జ్యూరిస్డిక్షన్ రూపొందించామన్నారు. ప్రతి పదం, వ్యాఖ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. 2020 అక్టోబర్ 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకే ఈ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఒకటి, రెండో షెడ్యూళ్లలోని ప్రాజెక్టులపై బోర్డులకు వంద శాతం నియంత్రణ ఉంటుందని, మూడో షెడ్యూల్లోని ప్రాజెక్టులు రాష్ట్రాల పరిధిలో ఉంటాయన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్టులోని సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి, వాటి ఉప నదుల ద్వారా అందే ఫలాలను న్యాయబద్ధంగా ఎలా పంపిణీ చేయాలో చెప్తున్నాయన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్టుకు లోబడే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఏర్పాటయ్యాయని, సెక్షన్ 87 ప్రకారం జ్యూరిస్డిక్షన్ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. 2016 సెప్టెంబర్లో నిర్వహించిన మొదటి, 2020 అక్టోబర్లో జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో బోర్డుల పరిధి నిర్ధారణ, కొత్త ప్రాజెక్టులకు అనుమతుల కోసం డీపీఆర్లు సమర్పించడం, కృష్ణా, గోదావరి నీళ్ల పంపిణీ కోసం వ్యవస్థ ఏర్పాటు, కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ఏపీకి తరలించడం అనే అంశాలపైనే విస్తృతంగా చర్చించామన్నారు. బాగా చర్చించాకే జ్యూరిస్డిక్షన్పై చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
న్యాయ శాఖ అభిప్రాయం కోరినం
కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా, ఇప్పుడున్న ట్రిబ్యునల్కే అప్పగించాలా అనేదానిపై న్యాయశాఖ అభిప్రాయం కోరామని సంజయ్ అవస్థీ అన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్లో కుదిరిన ఒప్పందం మేరకు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం జూన్ రెండో వారంలో తమకు లెటర్ రాసిందని వివరించారు. దీనిపై తాము న్యాయశాఖ అభిప్రాయం కోరామని, ఇది సంక్షిష్టమైన అంశం కాబట్టి కొంత టైం కావాలని అడిగారన్నారు. వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించామని, నిత్యం వాళ్లతో ఫాలో అప్లో ఉన్నామని సంజయ్ అవస్థి చెప్పారు. న్యాయశాఖ అభిప్రాయం మేరకే కొత్త ట్రిబ్యునల్పై నిర్ణయం ఉంటుందని రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పామన్నారు. న్యాయశాఖ నుంచి ఏ నిర్ణయం వచ్చినా అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నుంచి పర్మిషన్ లేని ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించామన్నారు. బోర్డుల జ్యూరిస్డిక్షన్పై 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ కొన్ని అభ్యంతరాలు తెలిపిందని, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏకాభిప్రాయం ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్లోని నిబంధనల ప్రకారం రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టులపై సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్టులోనే పొందు పర్చారని, దానికి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జ్యూరిస్డిక్షన్ పెద్ద ముందడుగు: సజ్జల
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ నిర్ధారిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పెద్ద ముందడుగు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వెలగపూడిలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా రైతులకు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తాము నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల నిర్మించిందని చెప్పారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల లెవల్ నుంచి తెలంగాణ నీళ్లు తీసుకునే ప్రాజెక్టు చేపట్టినా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా సమస్య పరిష్కారించాలని ఏపీ సీఎం జగన్ రెండుసార్లు ప్రధానికి లెటర్లు రాశారని ఆయన చెప్పారు.
పర్మిషన్ లేని ప్రాజెక్టులివే..
తెలంగాణ: ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి (నక్కలగండి) లిఫ్ట్, కల్వకుర్తి విస్తరణ, ఏఎమ్మార్పీ, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, నెట్టెంపాడు విస్తరణ, సీతారామ ఎత్తిపోతల, మున్నేరు ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని డబ్బవాగు, మైలవరం రిజర్వాయర్, కంతనపల్లి, తుపాకులగూడెం బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్ టీఎంసీ, రామప్ప నుంచి పాకాల లేక్ డైవర్షన్ స్కీం, మొండికుంటవాగు, ప్రాణహిత-–చేవెళ్ల, గూడెం లిఫ్ట్, ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం) లిఫ్ట్.
ఆంధ్రప్రదేశ్: గాలేరు– నగరి, వెలిగొండ ప్రాజెక్టు, నల్లమల సాగర్, ముచ్చుమర్రి, సిద్ధాపురం లిఫ్ట్, గురురాఘవేంద్ర, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి, వెంకటనగరం లిఫ్టులు, వేంపాడు ప్రాజెక్టు, విభజన చట్టంలో చేర్చిన తెలుగుగంగ, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్.