
జిన్నారం, వెలుగు: హై టెన్షన్ వైర్లు తగిలి టిప్పర్ దగ్ధమై డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని బిల్వాని స్టోన్ క్రషర్ లో శనివారం తెల్లవారుజామున కంకర అన్లోడ్ చేసేందుకు హైడ్రాలిక్ జాకీ పైకి ఎత్తగా పైన ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి మంటలు చెలరేగాయి.
టిప్పర్ కు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోగా, మధ్యప్రదేశ్ కు చెందిన డ్రైవర్ రామ్ సుజలాని(38) సజీవ దహనమయ్యాడు. విద్యుత్ వైర్లు గమనించకుండా హైడ్రాలిక్ జాకీ ఎత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.