హై టెన్షన్ వైర్లు తగిలి టిప్పర్ దగ్ధం..డ్రైవర్ సజీవ దహనం.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

హై టెన్షన్  వైర్లు తగిలి టిప్పర్  దగ్ధం..డ్రైవర్  సజీవ దహనం..  సంగారెడ్డి జిల్లాలో ఘటన

జిన్నారం, వెలుగు: హై టెన్షన్  వైర్లు తగిలి టిప్పర్  దగ్ధమై డ్రైవర్  సజీవ దహనమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని  బిల్వాని స్టోన్  క్రషర్ లో శనివారం తెల్లవారుజామున కంకర అన్​లోడ్  చేసేందుకు హైడ్రాలిక్  జాకీ పైకి ఎత్తగా పైన ఉన్న హై టెన్షన్  విద్యుత్​ వైర్లకు తగిలి మంటలు చెలరేగాయి. 

టిప్పర్ కు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోగా, మధ్యప్రదేశ్ కు చెందిన డ్రైవర్  రామ్  సుజలాని(38) సజీవ దహనమయ్యాడు. విద్యుత్  వైర్లు గమనించకుండా హైడ్రాలిక్  జాకీ ఎత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్  రెడ్డి తెలిపారు.