మూడేండ్ల తర్వాత పోలీసులకు దొరికిన నిందితుడు
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఘటన
నోయిడా:ప్రియురాలితో సెటిలయ్యేందుకు ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. అంతటితో ఆగకుండా లవర్తో కలిసి మరో వ్యక్తిని హత్య చేశాడు. తల లేకుండా చేసి తన బట్టలు వేసి, అక్కడే ఐడీ కార్డు పడేసి తాను కూడా చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు. వేర్వేరు పేర్లతో రాష్ట్రాలు తిరిగి ఎట్టకేలకు మూడేండ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్నోయిడాకు చెందిన రాకేశ్(34)కు రత్నేశ్(27) అనే మహిళతో 2012లో వివాహం జరిగింది. వీరికి రెండు, మూడేండ్ల వయసు గల ఇద్దరు పిల్లలున్నారు. 2018లో రాకేశ్గ్రేటర్నోయిడాలోని ఓ ప్రైవేటు ల్యాబ్లో పాథాలజిస్టుగా పని చేస్తున్నప్పుడు యూపీకి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్పరిచయమైంది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రియురాలితో సెటిలయ్యేందుకు ఎలాగైనా భార్య, పిల్లలను వదిలించు
కోవాలనుకున్నాడు.
ఇంట్లోనే పాతి పెట్టి..
2018 ఫిబ్రవరి 14న భార్యను పిల్లలను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. తర్వాత తన భార్య, పిల్లలు కనిపించడంలేదంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అల్లుడిపై అనుమానంతో రత్నేశ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు చోట్లా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా రాకేశ్ ప్రియురాలితో కలిసి కస్గంజ్లోని మరొకరిని హత్య చేశాడు. తల, చేతులు వేరు చేసి ఆ రెండింటినీ తగుల బెట్టాడు. తర్వాత శవానికి తన బట్టలు తొడిగాడు. అందరూ దాన్ని రాకేశ్ డెడ్బాడీ అని అనుకోవాలని ఐడెంటి కార్డును కూడా అక్కడే వదిలేశాడు. ఆ డెడ్బాడీకి పోలీసులు డీఎన్ఏ పరీక్ష చేయించగా.. అది రాకేశ్ది కాదని తేలింది. దీంతో రాకేశ్ కోసం గాలింపు చేపట్టారు. కాగా, రాకేశ్ పోలికలతో దిలీప్ శర్మ అనే పేరుతో ఓ వ్యక్తి హర్యానాలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా జంట హత్యల విషయం బయటపడింది. రాకేశ్ ఇంట్లో బుధవారం తవ్వకాలు జరపగా రత్నేశ్, పిల్లల ఎముకలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.