
- హౌరా నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం
- చక్రధర్పూర్ రైల్వే డివిజన్లో ఘటన
- కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గూడ్స్ రైలు
రాంచీ: జార్ఖండ్లో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో సెరైకెలా – ఖర్సవాన్ జిల్లాల మధ్య ఈ ఘటన జరిగింది. హౌరా నుంచి ముంబై వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో 18 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
వీటిలో 16 బోగీలు ప్రయాణికులవి అని, ఒకటి ప్యాంట్రీ కార్, మరొకటి పవర్ కార్ కోచ్లు అని రైల్వే అధికారులు ప్రకటించారు. చక్రధర్పూర్ డివిజన్లోని బరంబంబూ వద్ద ట్రైన్ పట్టాలు తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించామన్నారు. ప్రమాదానికి గురైన ట్రైన్లోని ప్రయాణికులను బస్సుల్లో చక్రధర్పూర్ రైల్వే స్టేషన్కు తరలించామని చెప్పారు. కాగా, ఘటనా స్థలానికి కొంతదూరంలో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. రైలు ప్రమాదం హౌరా–టిట్లాగఢ్ –కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్ ప్రెస్ , హౌరా–బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అదేవిధంగా, పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది.
మృతుల కుటుంబాలకురూ.10లక్షల ఎక్స్గ్రేషియా
రైల్వే అధికారులతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి గురైన ట్రైన్లోని ప్రయాణికుల కోసం చక్రధర్పూర్ స్టేషన్ నుంచి స్పెషల్ రైలు ఏర్పాటు చేసి ముంబైకి పంపించామని వివరించింది.