- ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో మండల బాధ్యత
- కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్న ప్రజాప్రతినిధులు
యాదాద్రి, వెలుగు : ఈ నెల 12న భువనగిరిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్తో పాటు, కలెక్టరేట్ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం భువనగిరి శివారులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 2018 ఎన్నికల తర్వాత జిల్లాలో నిర్వహించే ఫస్ట్ మీటింగ్ కావడంతో టీఆర్ఎస్ లీడర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వివిధ మండలాల నుంచి సుమారు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో మండల బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లాకు చెందిన రవీందర్నాయక్, శానంపూడి సైదిరెడ్డి, భాస్కర్రావు, భూపాల్రెడ్డి, నోముల భగత్, బొల్లం మల్లయ్యయాదవ్ తమకు కేటాయించిన మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో మీటింగ్లు పెడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగిందని, అందుకే కేసీఆర్ మీటింగ్కు ప్రతి ఇంటి నుంచి ఒకరిని తీసుకురావాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఈ సభకు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి 40 వేల మంది చొప్పున, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి 20 వేల మంది తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, వెహికల్స్, వసతులు, భోజనాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పగించారు. ఏర్పాట్లను మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య పర్యవేక్షిస్తున్నారు.
సభను అడ్డుకునేందుకు బీజేపీ ప్లాన్ ?
సీఎం నిర్వహించే బహిరంగ సభను అడ్డుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. కొత్త రాజ్యాంగం కావాలంటూ కేసీఆర్ చేసిన కామెంట్లపై ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు, బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలు పూర్తి కాకపోవడం, బస్వాపురం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం, గంధమల్ల రిజర్వాయర్ సందిగ్ధంలో పడడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సీఎం మీటింగ్ను అడ్డుకోవాలని చూస్తున్నారని సమాచారం.