న్యూఢిల్లీ: దేశమంతటా టూ–వీలర్ల రిటైల్ సేల్స్ ఇప్పటికీ ఆశించినస్థాయిలో పెరగలేదు. అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే కంపెనీలు భారీగా డిస్కౌంట్లు, ఈఎంఐ స్కీములు, ఎక్స్చేంజ్ బోనస్లను ప్రకటించాయి. దాదాపు అన్ని కంపెనీలు తమ బైకులు, స్కూటర్లు మోపెడ్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. డిమాండ్ ను ప్రికొవిడ్ లెవెల్కు తీసుకురావడంతోపాటు పండగ సీజన్లో అమ్మకాలను భారీగా పెంచుకోవాలనే ఆలోచనే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికీ పాతస్టాకు భారీగానే ఉందని, దీనిని అమ్మేయాలంటే ఆఫర్లు ఇవ్వడం తప్పదని చెబుతున్నారు. వచ్చే నెల నుంచి పండుగలు మొదలవుతుండటంతో హీరో, హోండా, బజాజ్, టీవీఎస్, సుజుకి వెస్పా వంటి బ్రాండ్ల షోరూముల్లో సందడి కనిపిస్తోంది.
హీరో మోటోకార్ప్...
భారతదేశంలోనే అతి పెద్ద టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తమ వెహికల్ బుక్ చేసుకున్న వారికి రూ .10 కోట్ల విలువైన క్యాష్ బోనస్ అందజేస్తామని ప్రకటించింది. ప్రతి అడ్వాన్స్ బుకింగ్కు కచ్చితంగా క్యాష్ బోనస్ వస్తుందని హామీ ఇచ్చింది. అంతేగాక సున్నా శాతం వడ్డీ, తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులను ఆఫర్ చేస్తోంది. ఏ మోడల్ కొన్నా కనీసం రూ.6,500 విలువైన లాభాలు పొందవచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 5వేలు వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు.
హోండా మోటార్స్
హోండా నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో యాక్టివా 125 కొంటే 5 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు. దాదాపు రూ.3,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. హైపొథికేషన్, డాక్యుమెంటేషన్, డౌన్ పేమెంట్ వంటివి ఏమీ అడగబోమని కంపెనీ హామీ ఇచ్చింది. బజాజ్ తన పల్సర్ బ్రాండ్ 20వ బర్త్ డే సందర్భంగా అన్ని పల్సర్ మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. ఆర్ఎస్200 వేరియంట్పై రూ. 3 వేల వరకు ఆదా చేయవచ్చు. డామినార్ ధరలను రూ .15 వేలకుపైగా తగ్గించామని బజాజ్ ఇటీవలే ప్రకటించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే టీవీఎస్ మోటార్ డీలర్లు రూ .3 వేల ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు రూ .వెయ్యి నుండి రూ .నాలుగు వేల వరకు క్యాష్బ్యాక్ అందిస్తున్నారు. తక్కువ డౌన్ పేమెంట్ తీసుకుంటున్నామని, అన్ని మోడల్స్కూ ఫైనాన్స్ స్కీములు ఇస్తున్నామని ప్రకటించారు.
సుజుకీ, వెస్పా నుంచి కూడా ఆఫర్లు..
సుజుకీ మోటార్సైకిల్ ‘మాన్సూన్’ ఆఫర్ ప్రకటించింది. కార్పొరేట్ ఆఫర్ రూ .మూడు వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. ఐదువేలు, నో -కాస్ట్ ఈఎంఐ ప్రకటించింది. అయితే లోన్ను 12 నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.10,100 విలువైన ఇన్సూరెన్స్ను ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐలపై 5.99 శాతం వడ్డీ కడితే చాలని సుజుకీ తెలిపింది. ఇటాలియన్ ఆటో కంపెనీ వెస్పా ఫైనాన్స్ స్కీముల కోసం హెచ్డీఎఫ్సీతో చేతులు కలిపింది. రూ.1,999 డౌన్పేమెంట్తో లోన్ పొందవచ్చు. ఆన్రోడ్ రేటుకు సమాన మొత్తాన్ని లోన్గా ఇస్తుంది. ఉచిత రోడ్సైడ్ అసిస్టెన్స్, ఫస్ట్- ఇయర్ సర్వీస్ లేబర్, 5 సంవత్సరాల వారంటీ వంటి అదనపు ఆఫర్లూ ఉన్నాయి.
డిమాండ్ పెరగాలె..
ఈ విషయమై ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) మెంబర్ ఒకరు మాట్లాడుతూ ‘‘లాక్డౌన్లను ఎత్తేసినా టూవీలర్లకు ఆశించినంత డిమాండ్ పెరగలేదు. గత ఏడాది జూన్తో పోలిస్తే రిటైల్ అమ్మకాల పెరుగుదల తక్కువగానే ఉంది. ఇక నుంచి అమ్మకాలు పుంజుకుంటాయని అనుకుంటున్నాం’’ అని ఆయన వివరించారు.
ఓలా స్కూటర్ల హోం డెలివరీ
తమ ఎస్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దేశంలోని వెయ్యి సిటీల నుంచి బుకింగ్స్ వచ్చాయని ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. వెహికల్స్ నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ ఇస్తామని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ చెప్పారు. డెలివరీ వివరాలను ఈ నెల 15న ప్రకటిస్తామని చెప్పారు. ఓలా గత నెల బుకింగ్స్ మొదలుపెట్టగా, దాదాపు లక్ష ఆర్డర్లు వచ్చాయి. డెలివరీయేగాక సర్వీసింగ్ కూడా ఇంటి దగ్గరే చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్ ఈ–స్కూటర్ రేటు రూ.80 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటుందని తెలుస్తోంది.
ఎకానమీపై కరోనా ప్రభావం పూర్తిగా తొలగకపోవడంతో బండ్ల అమ్మకాలు ప్రికొవిడ్ లెవెల్కు ఇంకా చేరుకోలేదు. బిజినెస్ను పెంచుకోవడానికి టూవీలర్ కంపెనీలు ఆఫర్లను గుమ్మరిస్తున్నాయి. స్పెషల్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్లతోపాటు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్కార్డులతో కొంటే ధరలు ఇంకా తగ్గుతున్నాయి.