లండన్: కరోనా వైరస్ వ్యాప్తి సీరియస్గా ఉన్న సమయంలో భారత్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న యూకే ఇప్పుడు మన వ్యాక్సిన్ను గుర్తించకుండా మొండికేస్తోంది. మన దగ్గర నుంచి తీసుకున్న అదే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు ఆ దేశంలోకి వెళ్లాలంటే క్వారంటైన్ తప్పదంటూ వింత వాదన వినిపిస్తోంది. పైగా ఆ వ్యాక్సిన్ డెవలప్ అయింది కూడా యూకేలోనే అయినప్పటికీ గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది. యూకే అవలంబిస్తున్న ఈ విధానంపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది వివక్ష పూరిత పాలసీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే భారత్ కూడా యూకే నుంచి వచ్చే వాళ్ల విషయంలో అదే తరహా చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదీ ఆ పాలసీ..
బ్రిటన్లో కొత్త ట్రావెల్ రూల్స్ వల్ల రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే.. ఇండియన్స్ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, ఇండియా, టర్కీ, జోర్డన్, థాయ్లాండ్, రష్యాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లను వ్యాక్సిన్ వేసుకోని వాళ్లుగానే పరిగణించాలని యూకే సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో రెండు డోసులు తీసుకుని ఆ దేశం వెళ్లిన మన వాళ్లను వ్యాక్సిన్ వేసుకోని వాళ్లుగానే గుర్తిస్తూ 10 రోజులు క్వారంటైన్లో ఉండాలంటున్నారు.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
భారత్ వ్యాక్సిన్లపై యూకే వివక్ష పూరిత విధానాలను అవలంబిస్తోందని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొవిషీల్డ్ వ్యాక్సిన్ డెవలప్ అయింది యూకేలోనే అన్న విషయాన్ని గుర్తించాలి. యూకే విజ్ఞప్తి చేయడంతో 50 లక్షల వ్యాక్సిన్ డోసులను ఆ దేశానికి భారత ప్రభుత్వం అందజేసింది. వాటిని యూకే ప్రజలకు ఇచ్చారు. అలాంటి ఆ వ్యాక్సిన్ను యూకే ప్రభుత్వం గుర్తించకపోవడం వివక్షపూరితం” అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ అంశాన్ని మంగళవారం యూకే విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి కేంద్ర మంత్రి జైశంకర్ తీసుకెళ్లారని, వీలైనంత తర్వగా ఈ సమస్యను పరిష్కరించేందుకు యూకే హామీ ఇచ్చిందని వెల్లడించింది. సానుకూలంగా చర్యలు తీసుకోకుంటే, భారత్ కూడా యూకే నుంచి వచ్చే వాళ్ల విషయంలో అటువంటి నిబంధనలే విధించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు పేర్కొంది.