కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు
  • శనివారం విచారణకు హాజరైన మిశ్రా
  • ఉదయం నుంచి 12 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు 

లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్​ హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కొడుకు ఆశీష్​ను యూపీ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. విచారణకు సహకరించలేదని, సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. కేసు విచారణలో భాగంగా శనివారం ఉదయం ఆశీష్​ పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయనను సిట్​ బృందం దాదాపు 12 గంటల పాటు విచారించింది. రైతుల పైనుంచి వాహనం దూసుకెళ్లిన సంఘటనపై అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ప్రమాదానికి కారణమైన కారులో తాను లేనని ఆశీష్​ చెప్పడంతో ఆ సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. అయితే, దీనికి ఆశీష్ పొంతనలేని సమాధానాలు 
చెప్పినట్లు సమాచారం.

కుట్ర ప్రకారమే దాడి: రైతులు

లఖీంపూర్​లో ఆందోళన చేస్తున్న రైతులపైకి ముందస్తు కుట్ర ప్రకారమే వాహనాన్ని ఎక్కించారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన కేంద్ర సహాయక మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా లీడర్ యోగేంద్ర యాదవ్  డిమాండ్​ చేశారు. నిందితులను రక్షించేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

డీఐజీ ఆధ్వర్యంలోని సిట్​ విచారణ

ఆశిష్ మిశ్రాను డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారించింది. ఇదే సమయంలో స్థానిక బీజేపీ ఆఫీసులో లాయర్లతో కలిసి అజయ్ మిశ్రా వెయిట్ చేశారు. విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆశిష్​ మిశ్రాకు పోలీసులు గురువారమే నోటీసులివ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో శుక్రవారం మరోసారి ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. శనివారం జరిగే విచారణకు కచ్చితంగా హాజరుకావాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

పోడు భూముల సమస్యలపై 2 వారాల్లో కార్యాచరణ

 

మరో రెండ్రోజులు వర్షాలు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్

నిజామాబాద్‌ షాపింగ్‌ మాల్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్