
ఇప్పుడైతే కూర్చున్న చోటికే మనకు కావాల్సిన పార్సిల్స్ వచ్చేస్తున్నాయ్. దానికోసం ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. పోస్టాఫీస్లు, ఎ.ఎన్.ఎల్, అమెజాన్, ఫ్లిఫ్కార్ట్... ఇలాంటివే. కానీ, వందేండ్ల కిందట ఇలాంటి సర్వీస్ ఇచ్చే కంపెనీలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ‘యునైటెడ్ పార్సిల్ సర్వీస్’ అలాంటిదే. దాదాపు 120 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ పార్సిల్స్ డెలివరీలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని పార్సిల్ డెలివరీ కంపెనీల్లో ఇది నెం.1 అనొచ్చు. అలాంటి ఈ కంపెనీని పెట్టింది ‘జిమ్ కేసీ’. ఆయన కష్టాలు, శ్రమ, పట్టుదల, పోరాటాలే ఈ స్టోరీ.
అమెరికాలోని కాండ్లేరియాలో మార్చి 29, 1888లో పుట్టాడు జేమ్స్ ఎమ్మెట్ కేసీ(జిమ్ కేసీ). తల్లిదండ్రులు యానీ సీహాన్, హెన్రీ కేసీ. వీళ్లు ఐర్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చినవాళ్లు. సెలూన్ నడుపుతూ బతికేవాళ్లు. వీళ్లకు జిమ్ తర్వాత మరో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు పుట్టారు.
పదకొండేండ్లకే పనిలోకి..
సెలూన్ వల్ల వచ్చే సంపాదన చాలకపోవడంతో దగ్గరలోని గనుల్లో పనికి వెళ్లేవాడు హెన్రీ. అయినా డబ్బు సరిపోయేది కాదు. దాంతో1897లో సీటెల్ సిటీకి కుటుంబాన్ని మార్చాడు. అదే టైంలో కెనడాలోని క్లోండికె ప్రాంతంలో బంగారు గనులు బయటపడ్డాయి. ఆ బంగారం కోసం వేలాది మంది బయల్దేరారు. వాళ్లలో హెన్రీ కూడా ఉన్నాడు. అయితే, వీళ్లు వెళ్తున్న ఓడ ప్రమాదంలో దెబ్బతింది. హెన్రీ ఆరోగ్యం పాడైంది. తిరిగి ఇంటికి ఎలాగోలా చేరుకున్నా అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యాడు. అప్పటికి జిమ్కు పదకొండేండ్లు. కుటుంబం పరిస్థితి బాగలేకపోవడంతో స్కూలు మానేశాడు జిమ్. సీటెల్లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో డెలివరీ డ్రైవర్కు అసిస్టెంట్గా చేరాడు. అక్కడ వారానికి 2.50 డాలర్లు ఇచ్చేవాళ్లు. రోజూ డెలివరీకి తిరగడం వల్ల జిమ్కు సిటీపై పూర్తి పట్టు వచ్చింది. సందుగొందులన్నీ తెలిశాయి. మరోవైపు జిమ్తోపాటు ఇద్దరు తమ్ముళ్లు కూడా పనికి వెళ్లడం మొదలుపెట్టారు.
మెసెంజర్ బాయ్గా...
1901లో ఒక టీ స్టోర్లో వారానికి ఐదు డాలర్ల జీతానికి చేరాడు జిమ్. అక్కడ కొన్ని రోజులు పనిచేశాక, తిరిగి స్కూల్కు వెళ్లాలనుకున్నాడు. టీ స్టోర్లో జాబ్ వదిలేసి, అమెరికన్ డిస్ట్రిక్ టెలిగ్రాఫ్(ఏడీటీ) కంపెనీలో ‘మెసెంజర్ బాయ్’గా నైట్ డ్యూటీకి చేరాడు. పగలు స్కూల్కు వెళ్తూ, రాత్రిళ్లు జాబ్ చేసేవాడు. అక్కడే అతనికి క్లాడ్ రియాన్ ఫ్రెండ్ అయ్యాడు. అత్యవసరంగా రిపేర్ చేయాల్సిన రోడ్ల గురించి సమాచారం అందించడం, పేరెంట్స్ సినిమాకు వెళ్తే వాళ్ల పిల్లలను ఆడించడం, నిందితుల కోసం వచ్చే బెయిల్ ఆర్డర్స్ పంపిణీ చేయడం, మద్యం, డ్రగ్స్, ఓపియం సరఫరా చేయడం వంటి పనులు చేసేవాళ్లు జిమ్, క్లాడీ. అయితే, మంచాన ఉన్న తండ్రి చనిపోవడం, ఖర్చులు పెరగడం, కంపెనీలో పని ఎక్కువ కావడంతో మళ్లీ స్కూల్ మానేశాడు జిమ్.
ఫస్ట్ కంపెనీ
అప్పట్లో సీటెల్లో కేవలం కొన్ని ఇండ్లలో మాత్రమే టెలిఫోన్లు ఉండేవి. అందువల్ల ఎవరికైనా సమాచారం పంపాలంటే ఇబ్బంది పడేవాళ్లు. దీన్ని గమనించాడు జిమ్. దాంతో మెసెంజర్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. జాబ్కు వెళ్తూ సంపాదించిన 30 డాలర్లు జిమ్ దగ్గర ఉండేవి. మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడు కావడంతో 1903లో ‘సిటీ మెసెంజర్ సర్వీస్’ కంపెనీ పెట్టాడు. ఇందులో రెండు టెలిఫోన్లు ఉండేవి. వీటి ద్వారా సిటీలో ఎవరికైనా ఏదైనా మెసేజ్వస్తే దాన్ని డెలివరీ చేసేవాళ్లు. అలాగే వాళ్లు అడిగిన పని చేసిపెట్టేవాళ్లు. అయితే, కంపెనీ సక్సెస్ కాలేదు. దాంతో రెండేండ్లకే దాన్ని అమ్మేశారు. ఆ టైంలో తండ్రి లాగా మైనింగ్ చేయాలని అనుకున్నాడు జిమ్. ఫ్రెండ్స్లో ఒకరు సరే అనడంతో నెవడాలోని బంగారు గనులకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ గని మూతపడింది. చేసేది లేక అక్కడే పరిచయమైన జాన్ మోరిట్జ్తో కలిసి మళ్లీ మెసెంజర్ సర్వీస్ మొదలుపెట్టాడు. ముగ్గురూ కలసి లోకల్ టెలిఫోన్, టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి వచ్చే మెసేజ్లను డెలివరీ చేస్తూ నెలకు 50 డాలర్ల చొప్పున సంపాదించేవాళ్లు. ఈ బిజినెస్ సక్సెస్ అయింది. కానీ, డబ్బు కోసం జాన్ హౌరిట్జ్ను ఒక దొంగ కాల్చి చంపడంతో కంపెనీ మూసేసి ఫ్రెండ్తో కలిసి తిరిగి సీటెల్ చేరుకున్నాడు.
అమెరికన్ మెసెంజర్
సీటెల్కు వచ్చాక పాత ఫ్రెండ్ క్లాడ్ రియాన్ను కలిశాడు. ఇద్దరూ కలిసి మళ్లీ మెసెంజర్ కంపెనీ పెట్టాలనుకున్నారు. కానీ, అవసరమైన డబ్బు వాళ్ల దగ్గర లేదు. ఎవరిని అడిగినా అప్పు పుట్టలేదు. ఆ టైంలో రియాన్ మేనమామ వాళ్లకు అండగా నిలిచాడు. వంద డాలర్లు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆగస్ట్ 28, 1907లో ‘అమెరికన్ మెసెంజర్ కంపెనీ’ పెట్టారు జిమ్, క్లాడీ. అప్పటికి జిమ్కు 19 ఏండ్లు. కంపెనీ కోసం రెండు టెలిఫోన్లు, రెండు సైకిళ్లు కొన్నారు. అలాగే ఆరుగురు డెలివరీ బాయ్స్ను చేర్చుకున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో మెసేజ్కు 15 నుంచి 65 సెంట్లు తీసుకునేవాళ్లు. తక్కువ డబ్బు తీసుకోవడం, చెప్పిన టైంకు మెసేజ్ డెలివరీ చేయడం జనాల్ని ఆకట్టుకుంది. కంపెనీ 24 గంటల సర్వీస్ అందించేది. వీకెండ్ సెలవు కూడా ఉండేది కాదు. జిమ్, క్లాడీ ఒక్కోసారి ఆఫీస్లోనే నిద్రపోయేవాళ్లు. అంత పని ఉండేది వాళ్లకు.
మర్చంట్స్ పార్సిల్ డెలివరీ
అమెరికన్ మెసెంజర్ కంపెనీ సూపర్ సక్సెస్ కావడంతో సీటెల్లోనే మరో బ్రాంచ్ పెట్టారు. జిమ్ తమ్ముడు జార్జ్ కూడా కంపెనీలో జాయిన్ అయ్యాడు. అయితే, క్రమంగా టెలిఫోన్, పోస్టాఫీస్ల సంఖ్య పెరగడంతో ఆర్డర్స్ తగ్గడం మొదలైంది. దాంతో డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి నేరుగా కస్టమర్స్కు ప్రొడక్ట్స్ డెలివరీ చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. కంపెనీ తిరిగి నిలదొక్కుకుంది. ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అదే టైంలో ‘మెకాబే మోటార్ సైకిల్ డెలివరీ కంపెనీ’తో కంపెనీని మెర్జ్ చేశారు. కంపెనీ పేరును ‘మర్చంట్స్ డెలివరీ పార్సిల్ సర్వీస్’గా మార్చారు. డెలివరీల కోసం ఆరు మోటార్సైకిల్స్, ఒక కారు తీసుకున్నారు. ఈ కారుకు వెనక భాగాన్ని కొద్దిగా మార్చి వ్యాన్లా చేశారు. 1915 కల్లా సీటెల్లో అతిపెద్ద డెలివరీ సర్వీస్ కంపెనీగా మారింది.
యూపీఎస్
1917లో కంపెనీని క్లాడీ వదిలిపెట్టాడు. తన వాటా తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత జిమ్, అతని తమ్ముడు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యోగుల సంఖ్య పెంచారు. పార్సిళ్లకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా, టైంకు డెలివరీ చేయడంలో కంపెనీని తీర్చిదిద్దారు. అలాగే నెమ్మదిగా కంపెనీ బ్రాంచ్లను ఇతర నగరాల్లో కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కోలో కంపెనీని పెట్టినప్పుడు పేరుతో సమస్య వచ్చింది. అక్కడ ‘మర్చంట్స్ పార్సిల్స్’తో మరో కంపెనీ ఉంది. దాంతో జిమ్ తన కంపెనీ పేరును 1919లో ‘యునైటెడ్ పార్సిల్ సర్వీస్(యూపీఎస్)’గా మార్చాడు. బిజినెస్ డెవలప్ కావడంతో అమెరికాలోని అన్ని నగరాల్లోనూ బ్రాంచ్లు తెరిచాడు. అలాగే పార్సిల్స్ డెలివరీ కోసం విమానాలు కొన్నాడు. వాటికోసం ఏకంగా కెంటకీలో అతిపెద్ద విమానాశ్రయం కూడా కట్టాడు. ఈ విమానాల ద్వారా విదేశాలకు కూడా పార్సిల్స్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. కంపెనీ అవసరాలను బట్టి హెడ్డాఫీస్ను 1920లో లాస్ఏంజిలెస్కు,1930లో న్యూయార్క్కు,1975లో కనెక్టికట్కు మార్చాడు. కంపెనీని బిలియన్ డాలర్ల బ్రాండ్గా మార్చిన జిమ్ కేసీ 1983లో చనిపోయాడు. ఇప్పుడు యుపిఎస్లో సుమారు 5లక్షల 34వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ బ్రాండ్ విలువ 13.3 బిలియన్ డాలర్లు. యూపీఎస్ హెడ్డాఫీస్ ఇప్పుడు అట్లాంటాలో ఉంది.
లోగో కథ ఇదీ
యుపిఎస్ మొదటి లోగో 1916లో వచ్చింది. ఇందులో బంగారు అంచు ఉన్న బ్రాంజ్ షీల్డ్పై అమెరికా జాతీయ పక్షి అయిన ‘బాల్డ్ ఈగిల్’ మాదిరి గద్ద ఉండేది. ఈ గద్ద కాళ్లకు పార్సిల్ చేసిన ప్యాకేజీ ఉండేది. ఈ లోగోకు ఎలాంటి స్లోగన్ లేదు. అయితే, ‘సేఫ్(రక్షణ), స్విఫ్ట్(వేగం), ష్యూర్(కచ్చితం)’ అనేది బ్రాండ్ స్లోగన్గా ప్రచారమైంది. 1937లో రెండో లోగో వచ్చింది. ఇందులో గోల్డ్, బ్రౌన్ కలర్తో షీల్డ్ ఉండేది. అలాగే గద్దకు బదులు ‘యుపిఎస్’, పైభాగంలో ‘ది డెలివరీ సిస్టమ్ ఫర్ స్టోర్స్ ఆఫ్ క్వాలిటీ’, కింది భాగంలో ‘సిన్స్ 1902’ అని రాశారు. 1961లో మూడో లోగో వచ్చింది. ఇందులో షీల్డ్ రెండు భాగాలుగా కనిపిస్తుంది. పై భాగాన్ని ప్యాక్ చేసిన పార్సిల్లా మార్చారు. కింది భాగంలో ‘యుపిఎస్’ అక్షరాలు ఉంచారు. మిగతావి తీసేశారు. గోల్డ్, బ్రౌన్ కలర్ కూడా లేవు. మనం ఇప్పుడు చూస్తున్న లోగో 2003లో వచ్చింది. ఇందులో షీల్డ్కు మళ్లీ గోల్డ్, బ్రౌన్ కలర్ అద్దారు. మధ్యలో ‘యుపిఎస్’ అక్షరాలు ఉంచారు.