బీజింగ్: షాంఘై ఎయిర్పోర్టులో కరోనా రూల్స్ను చైనా ప్రభుత్వం సడెన్గా మార్చింది. దీంతో ఆ ఎయిర్పోర్టులో దిగాల్సిన అమెరికా విమానం వెనక్కి వెళ్లింది. విమానం మార్గమధ్యలో ఉండగా రూల్స్ మార్చేయడంతో వాటిని అమలు చేయడం సాధ్యం కాదని ఫ్లైట్ వాపస్ తీసుకురావాల్సి వచ్చిందని డెల్టా ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇటీవల జరిగిన ఈ ఘటన డెల్టా ఎయిర్లైన్స్ స్టేట్మెంట్తో సోమవారం వెలుగులోకి వచ్చింది.
షాంఘై వెళ్లాల్సిన ఫ్లైట్ సియాటిల్ నుంచి షెడ్యూల్ ప్రకారమే గాల్లోకి లేచిందని, దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించిన తర్వాత కరోనా రూల్స్మార్చినట్లు సమాచారం అందిందని డెల్టా ఎయిర్లైన్స్ తెలిపింది. సియాటిల్ నుంచి షాంఘైకి 11 గంటల ప్రయాణం కాగా.. అప్పటికే 6 గంటల ప్రయాణం పూర్తిచేసుకున్న ఫ్లైట్మరో దారిలేక గాల్లోనే వెనక్కి తిరిగిందని చెప్పింది. అయితే మారిన రూల్స్ ఏమిటనేది స్పష్టంగా చెప్పలేదు. వచ్చే ఆరు వారాల్లో బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో రూల్స్ను ఆ దేశం మరింత కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. బీజింగ్కు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జియాన్ సిటీలో వీకెండ్ టైమ్లో 300 కంటే ఎక్కువ కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో 13 లక్షల మంది ఉంటున్న ఆ సిటీలో పూర్తిగా లాక్డౌన్ పెట్టారు. కాగా, డెల్టా ఎయిర్లైన్స్ నిర్ణయంపై శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా ఎంబసీ అభ్యంతరం తెలిపింది. ఎయిర్లైన్స్ తీరుపై నిరసన వ్యక్తం చేసింది.