అడ్డుకోలేమా ఆస్తుల ధ్వంసాన్ని?

అడ్డుకోలేమా ఆస్తుల ధ్వంసాన్ని?
  • బస్సుల్ని తగలబెట్టేస్తారు!  రైలుపట్టాలు పీకేస్తారు!
  • పోలీస్​ స్టేషన్లకు నిప్పు పెట్టేస్తారు!
  • ఆఫీసుల్లోకి చొరబడి ఫర్నీచర్​ నాశనం చేస్తారు!

కారణాలేవైనా కావచ్చు, కానీ… నిరసన పేరుతో ఆందోళనకారులు కోపం చూపించేది మాత్రం బస్సులు, రైళ్ళు, సర్కారీ ఆఫీసులపైనే.ఇట్లా ఎన్నాళ్ళు?…. అందుకే 1984లో ఓ చట్టం వచ్చింది. జైలుశిక్షలకు, జరిమానాలకు అవకాశమిచ్చిన చట్టమది.కానీ, ఇంతవరకు సరిగా అమలుచేయలేకపోయారు. యూపీలో యోగి ఆదిత్యానాథ్ గవర్నమెంట్ మాత్రం ఆ చట్టాన్ని వాడుకుంటూ, జరిగిన డ్యామేజీకి పరిహారం చెల్లించాలంటూ…పట్టుబట్టి…వసూళ్ళు మొదలుపెట్టింది.

‘నిరసన’ ప్రజల హక్కు. శాంతియుతంగా జరిగితే ప్రభుత్వాలు అబ్జెక్షన్​ చెప్పవు. పెద్దగా అడ్డుకోవు. మహా అయితే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్​ చేసి కొద్దిసేపటి తర్వాత వదిలేస్తారంతే.  పెద్దఎత్తున అల్లర్లకు దిగి, ఆస్తులను ధ్వంసం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు.  ఈ నేపథ్యంలో… తాజాగా సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ), నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజెన్స్​ (ఎన్నార్సీ)ని వ్యతిరేకిస్తూ యూపీలో జరిగిన నిరసనల్లో 17 మంది చనిపోగా, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి  478 మందిని గుర్తించి, వాళ్లలో 372 మందికి యోగి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిపై బులంద్​షహర్​లోని ముస్లిం మతస్తుల కమిటీ స్పందించింది. తమ వంతుగా 6.27 లక్షల రూపాయలకు డీడీ తీసి ఉన్నతాధికారులకు అందజేసింది. అయితే యోగి నిర్ణయం లీగల్​ స్ర్కూటినీలో నిలుస్తుందో లేదో చూడాలంటున్నారు లీగల్​ ఎక్స్​పర్ట్​లు.

‘డేరా’పై హైకోర్టు ఆగ్రహం

2017 ఆగస్టులో హర్యానాలో పలు రేప్​ కేసుల్లో డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్​ను సీబీఐ స్పెషల్​ కోర్టు దోషిగా తేల్చినప్పుడు ఆయన భక్తులు హింసకు పాల్పడ్డారు. కేవలం పంచ్​కులా ప్రాంతంలోనే రూ.126 కోట్ల విలువైన ప్రైవేటు, పబ్లిక్​ ప్రాపర్టీ డ్యామేజ్​ అయింది. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. ఆ డబ్బు చెల్లించే వరకు డేరా సచ్ఛా సౌదా ఆస్తులను ఫ్రీజ్​ చేయాలని ఆర్డర్​ వేసింది. దేశ చరిత్రలో ఒక కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు రావటం అదే తొలిసారి.

‘జాట్’ ఇచ్చింది జీరో!

డేరా బాబా ఎపిసోడ్​ కన్నా ఏడాది ముందు అదే హర్యానాలో జాట్​ సామాజిక వర్గం కోటా కోసం కొట్లాటకు దిగింది. 2016 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున జరిగిన గొడ వల్లో 30 మంది చనిపోయారు. రూ.1,800–2,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అసోచాం అంచనా వేసింది. ఆ రాష్ట్రంలో అప్పట్లో కూడా అధికారంలో ఉన్న బీజేపీ… పబ్లిక్​ ప్రాపర్టీ డ్యామేజీకి కారణమైనవారి నుంచి సొమ్ము వసూలు చేస్తామని పంజాబ్​, హర్యానా హైకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ.. ఇంతవరకూ నయా పైసా రాబట్టలేదు.

పటీదార్​లపై పిల్​ వాపస్​

గుజరాత్​లో 2015 ఆగస్టులో​ పటేల్​ కమ్యూనిటీ కోటా మూవ్​మెంట్ సందర్భంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. 660 గవర్నమెంట్​ వెహికిల్స్​కి; 1,822 ప్రభుత్వ భవనాలకు నిప్పు          పెట్టారు. ఈ రణరంగం పూర్తైన వారం రోజుల తర్వాత గుజరాత్​ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్​) దాఖలైంది. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన డ్యామేజీ అంచనాకు ఎంక్వైరీ కమిషన్​ వేయాలని ఆ పిల్​లో కోరారు. అయితే, దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకముందే పిటిషన్​ విత్​డ్రా చేసుకున్నారు. ఎందువల్ల పిల్​ వెనక్కి తీసుకున్నారో సరైన కారణాలు తెలియదు.

రైల్వేకి రూ.80 కోట్లు లాస్

సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్​లో చోటుచేసుకున్న నిరసనలు రైల్వే ఆస్తుల విధ్వంసానికి, దహనానికి దారి తీశాయి. కేవలం నాలుగు రోజుల్లోనే జరిగిన ఈ ఘటనల్లో రూ.80 కోట్ల విలువైన ప్రాపర్టీకి నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రైల్వే 64 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయగా, 931 మంది నిందితులను అరెస్ట్​ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధ్యుల్ని గుర్తించాలని కోరుతూ కల​కత్తా హైకోర్టులో దాఖలైన 6 పిల్స్​పై విచారణ జరుగుతోంది.

పూరీలో హింసతో తెరపైకి ‘పూచీకత్తు

పూరీ శ్రీమందిర్​లో అమల్లోకి తెచ్చిన క్యూ పద్ధతిని నిరసిస్తూ ‘జగన్నాథ్​ సేన’ బంద్​ పాటించింది. స్థానికులకు క్యూ పద్ధతి వద్దంటూ కిందటేడాది అక్టోబర్​లో నిర్వహించిన ఈ బంద్​ హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్లలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ‘పూచీకత్తు’ అనే కొత్త రూలు​ పెట్టారు. ర్యాలీలు చేపట్టాలనుకునేవారు ఎవరైనా జరగబోయే నష్టానికి పరిహారం చెల్లిస్తామని బాండ్​ పేపర్​ రాసిస్తేనే అనుమతిస్తామని లింక్​ పెట్టారు.

కర్ణాటకలో గప్​చుప్​

ఈపీఎఫ్​ చట్టాన్ని సవరించాలనే కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ బెంగళూరులోని గార్మెంట్స్​ ఫ్యాక్టరీ వర్కర్లు 2016 ఏప్రిల్​లో ఆందోళనకు దిగారు. పోలీస్​ వ్యాన్లు, బస్సులు సహా సుమారు 15 వాహనాలకు నిప్పు పెట్టారు. సెప్టెంబర్​లో చోటు చేసుకున్న కావేరీ అల్లర్లలోనూ పబ్లిక్​ ప్రాపర్టీకి డ్యామేజీ జరిగింది. 30కిపైగా బస్సులు కాలి బూడిదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ బాధ్యుల నుంచి మూల్యం రాబట్టే ప్రయత్నాన్ని  ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.

ఫైన్​ కడితేనే బెయిల్​

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొనేవారు… అంచనా మొత్తాన్ని డిపాజిట్​ చేస్తేనే బెయిల్​ ఇస్తామని కేరళ హైకోర్టు 2011లో కండిషన్​ పెట్టింది. అయితే ఇంతవరకు అమల్లోకి రాలేదు. శబరిమల గుడిలోకి ఆడవాళ్లను పోనివ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆందోళనలు జరిగాయి. ఆ నిరసనల్లో 49 కేరళ ఆర్టీసీ బస్​లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రివెన్షన్​ ఆఫ్​ డ్యామేజ్​ టు పబ్లిక్​ ప్రాపర్టీ యాక్ట్​–1984 కింద చాలామందిని అరెస్టు చేసినా జరిమానాలు వసూలు చేయలేదు.

లీగల్​ యాక్షన్​కు రెడీ!

‘యాంటీ–సిటిజెన్​షిప్ లా’ని వ్యతిరేకిస్తూ అస్సాంలో అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్​లో గువాహటి, దిబ్రూఘర్​లలో జరిగిన అల్లర్లలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో సర్వానందా సోనోవాల్​ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. ఈ వయొలెన్స్​ వెనకున్న వ్యక్తులపై లీగల్​ యాక్షన్​ తీసుకోవటానికి ప్లాన్​ రెడీ చేస్తోంది. ఈ అల్లర్లకు సంబంధించి సీసీ ఫుటేజీలతో ​మరింత ఎవిడెన్స్​ సేకరించాక రంగంలోకి దిగనుంది.

డ్యామేజీ లెక్క కూడా తేల్చలే

2019 ఫిబ్రవరిలో గుజ్జర్​ కమ్యూనిటీ కోటా ఉద్యమ కాలంలోనూ, 2017 నవంబర్​లో ‘పద్మావత్​’ సినిమా వివాదం తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దహనం వంటివి ఎన్నోసార్లు జరిగాయి. అయినా.. కనీసం ప్రభుత్వ ఆస్తులకు ఎంత నష్టం జరిగిందనే లెక్కలు కూడా చేయటానికి ప్రభుత్వం ముందుకు రాలేదు.

భీమ్​ ఆర్మీ బీభత్సం.. చర్యలు శూన్యం

రవిదాస్​ టెంపుల్​ కూల్చివేతను నిరసిస్తూ గతేడాది ఆగస్టు 22న ఢిల్లీలో జరిపిన ప్రదర్శన చివరికి హింసాత్మకం​గా మారింది. గోవింద్​పురి ప్రాంతంలో 14 కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఆందోళన భీమ్​ ఆర్మీ చీఫ్​ చంద్రశేఖర్​ ఆజాద్​ నాయకత్వంలో జరిగింది. పోయినేడాది నవంబర్​లోనే తీస్​ హజారీ కోర్టులో పార్కింగ్​ ఇష్యూపై పోలీసులు, లాయర్ల మధ్య గొడవలు జరిగాయి. అడ్వకేట్​లు 13 పోలీస్​ వ్యాన్​ల్ని, ప్రైవేటు వ్యక్తుల బైక్​ల్ని తగలెట్టారు. సాకేత్​ ప్రాంతంలోనూ వయొలెన్స్​ చోటుచేసుకున్నా ఎవరినీ కనీసం అరెస్ట్​ చేసిన పాపాన పోలేదు. రీసెంట్​గా డిసెంబర్​ 15న యాంటీ–సీఏఏ ఆందోళనల్లో భాగంగా జామియా నగర్​, మథురా రోడ్డులో ఇళ్లు దహనం చేసిన సంఘటనలపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నష్టాన్ని అంచనా వేయటానికి క్లెయిమ్స్​ కమిషనర్​ను నియమించాలని, బాధ్యుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయటానికి అనుమతించాలని కోరారు.

చట్టాలు, కోర్టులు ఏం చెబుతున్నాయంటే..

అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తులను డ్యామేజీ చేసేవారిని ఏ విధంగా కంట్రోల్​ చేయాలి, ఎలాంటి శిక్షలు విధించాలి అనే అంశంపై చాలా చర్చ సాగింది. ఎన్నో ఏళ్లుగా ఇది కోర్టుల్లో నలుగుతూనే ఉంది. 1984 నాటి ప్రభుత్వ ఆస్తుల డ్యామేజీ నివారణ చట్టంలోని సెక్షన్​–3 ప్రకారం… పబ్లిక్​ ప్రాపర్టీని ధ్వంసం చేసినవాళ్లకు కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా అయిదేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, లేదా రెండింటినీ విధించాలి. ఈ నేరాల్ని ఇండియన్​ పీనల్​ కోడ్​ కింద నమోదు చేయాలి. అయితే, సుప్రీం కోర్టు ఈ చట్టంలో చాలా లొసుగులున్నాయని 2007లో రిటైర్డ్​ సుప్రీం జడ్జి కె.టి.థామస్​, సీనియర్​ అడ్వకేట్​ జనరల్​ ఫాలి నారిమన్​లతో రెండు కమిటీల్ని వేసింది. ఈ ఎక్స్​పర్ట్​ కమిటీల సిఫార్సుల మేరకు 2009నాటి డిపీపీపీ వర్సెస్​ ఏపీ స్టేట్​ అండ్​ అదర్స్​ కేసులో సుప్రీం కోర్టు గైడ్​లైన్స్​ జారీ చేసింది.

జస్టిస్​ థామస్​ కమిటీ… ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసింది నిరసనకారులేనని ప్రాసిక్యూషన్​ ఆరోపించినప్పుడు, ఆ పని చేసింది తాము కాదని నిరూపించుకునే బాధ్యత (reversing the burden of proof )ను నిందితులపై వేయాలని సూచించింది. ఏదైనా ఒక సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన నిరసన ఉద్యమంలో పబ్లిక్​ ప్రాపర్టీ ధ్వంసమైందని, నిందితులు ఇటువంటి చర్యల్లో స్వయంగా పాల్గొన్నారని ప్రాసిక్యూషన్​ ఆరోపిస్తుంది. తన అమాయకత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితులదే అవుతుంది. నిరూపించుకోలేని పక్షంలో కోర్టు విధించే శిక్షను అనుభవించక తప్పదు. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఎందుకంటే, సాధారణంగా నిందితులెవరైనాగానీ ప్రాసిక్యూషన్​ నిరూపించేవరకు అమాయకులేనని న్యాయశాస్త్రం చెబుతోంది.

నారిమన్​ కమిటీ… ఆస్తుల డ్యామేజీకి పాల్పడ్డవాళ్ల నుంచే పరిహారాన్ని వసూలు చేయాలని సూచించింది. డ్యామేజీకి గురైన పబ్లిక్​ ప్రాపర్టీని మరలా బాగు చేయడానికి తగిన పరిహారాన్ని ఆందోళనకారుల నుంచే రాబట్టాలని పేర్కొంది.

ఈ రెండు కమిటీల సూచనలను సుప్రీం కోర్టు ఆమోదించింది. ఏదైనా నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి ప్రైవేటు లేదా పబ్లిక్​ ప్రాపర్టీ విధ్వంసమైతే అందుకు కారకులైనవాళ్ల నుంచే పరిహారం రాబట్టాలి. ఈ ప్రదర్శనకు పిలుపునిచ్చిన సంస్థ లేదా నిరసనకారులు, లేదా డ్యామేజీలో పాల్గొన్న వ్యక్తులే కచ్చితంగా బాధ్యులవుతారు. ఆర్డినరీ కోర్టులుగానీ, ప్రత్యేక కోర్టులుగానీ నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తన ఆదేశాలలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్​కి హైకోర్టులు సూమోటో (తమంతట తాముగా)చర్యలు తీసుకోవాలనికూడా పేర్కొంది.