
- అందుబాటులో గోల్డ్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, బాండ్లు..
- ఫ్యూచర్ జనరేషన్ కోసం సిప్ చేయొచ్చు
- దీపావళి టైమ్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎనలిస్టుల సలహా
బిజినెస్ డెస్క్, వెలుగు: చాలా మంది ఇన్వెస్టర్లకు ఎందులో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఒకే సెక్టార్ షేర్లలో లేదా ఒకే కంపెనీలో డబ్బులు మొత్తం పెట్టేస్తుంటారు. లేదా సరిగ్గా విశ్లేషించకుండా క్వాలిటీ లేని షేర్లను కొంటారు, నష్టపోతుంటారు. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి గోల్డ్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ అసెట్ క్లాస్లు అందుబాటులో ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ఫోకస్..
ఇన్వెస్ట్ చేసే ముందు మొదట మాక్రో ఎకానమీ ఎలా ఉందో విశ్లేషించాలి. ఏఏ సెక్టార్లు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయో చూడాలి. గ్లోబల్ ఎకానమీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా యూఎస్ ఎకానమీ ఏ స్థితిలో ఉంది? వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో ఆర్బీఐతో పాటు చాలా సెంట్రల్ బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచాయి. ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచదనే అంచనాలు ఉన్నాయని ఎల్జీటీ వెల్త్ ఇండియా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాజేష్ చెరువు అన్నారు.
గోల్డ్..
ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్కు మొదట గుర్తొచ్చేది గోల్డ్ అని రాజేష్ పేర్కొన్నారు. గోల్డ్లో డబ్బులు పెట్టేవారికి అనేక ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. హోల్డింగ్ , రవాణా ఖర్చులు వంటివి ఉండడంతో ఫిజికల్ గోల్డ్ మంచి ఛాయిస్ కాకపోవచ్చన్నారు. ఫిజికల్ గోల్డ్ తో పాటు గోల్డ్ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటివి కూడా ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ చూస్తే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదిగా అనిపిస్తోంది. బంగారాన్ని సేఫ్ హెవెన్గా ఇన్వెస్టర్లు చూస్తారు. ఇన్ఫ్లేషన్ను ఎదుర్కోవడానికి కూడా గోల్డ్లో డబ్బులు పెడతారు’ అని రాజేష్ వివరించారు.
షేర్లు..
దీపావళి టైమ్లో గోల్డ్తో పాటు షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. తమకు నచ్చిన షేర్లను షార్ట్, లాంగ్టెర్మ్ కోసం ఎంచుకుంటారు. దీపావళి టైమ్లో ఇన్వెస్ట్ చేసేవారు సాధారణంగా షార్ట్ టెర్మ్ కోసమే చూస్తారని, అందుకే కంపెనీల వాల్యుయేషన్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలని రాజేష్ సలహా ఇచ్చారు. పండుగ టైమ్లో కన్జంప్షన్ (వినియోగం) రిలేటెడ్ షేర్లలో డబ్బులు పెట్టాలని అన్నారు. ‘ సరిపడినంత వర్షాలు పడనప్పటికీ, ఈసారి పంటల విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. కన్జంప్షన్ రిలేటెడ్ కంపెనీలు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, పెయింట్స్, వైట్ గూడ్స్ (ఫ్రిడ్జ్, ఏసీ..), జ్యువెలరీ వంటి సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నాను’ అని వివరించారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతోందని, ఈ సెక్టార్లకు చెందిన కంపెనీల సేల్స్ పుంజుకుంటాయని చెప్పారు.
లార్జ్ క్యాప్స్
ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్ పెట్టింది. పీఎల్ఐ, గతి శక్తి వంటి ఇనీషియేటివ్లతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో బిల్టింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లలోని కంపెనీలు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయని రాజేష్ అంచనా వేశారు. తాజాగా మార్కెట్ పడడంతో చాలా కంపెనీల వాల్యుయేషన్స్ దిగొచ్చాయని, ఫండమెంటల్స్ బాగున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అన్నారు.
ALSO READ : రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.87 శాతం
సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్..
రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి ఎఫ్డీలు, బాండ్లు వంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మంచి రిటర్న్ ఇస్తున్నాయి. గ్లోబల్గా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపును ఆపాయి. కానీ, ఇప్పటిలో తగ్గించే ఆలోచనలో లేవు. అందువలన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే అసెట్ క్లాస్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని రాజేష్ సలహా ఇచ్చారు. భారత్ బాండ్ ఈటీఎఫ్ వంటి అసెట్ క్లాస్ల వైపు ఇన్వెస్టర్లు ఓ లుక్ వేయాలని అన్నారు.