ఆర్ఎస్ఎస్ లక్ష్యం..సంపూర్ణ సమాజం

ఆర్ఎస్ఎస్ లక్ష్యం..సంపూర్ణ సమాజం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రారంభించి ఈ విజయదశమి నాటికి 98 సంవత్సరాలు అవుతోంది. ఒక సంస్థ ఇంత సుదీర్ఘ కాలంగా మనగల్గుతున్నది అంటే గొప్ప విషయమే. 1925లో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్​ను ప్రారంభించారు. ఏదైనా ఒక సంస్థను ఎక్కువ రోజులు సమాజం ఆదరిస్తున్నది అంటే అది ఆ సమాజ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోంది అని అర్థం.  


అదేవిధంగా ఒక సంస్థ సుదీర్ఘకాలంగా నడుస్తోంది ఆంటే  ఆ సంస్థలో ఉండే ప్రతి చిన్న కేంద్రం బలంగా ఉండాలి. ఆ చిన్న కేంద్రం ఆ సంస్థ  సిద్ధాంతాన్నీ ప్రతిబింబించే విధంగా ఉండాలి. అది సమాజ వికాసానికి ఉపయోగపడగలగాలి. అప్పుడే ఆ సంస్థ ఎక్కువకాలం మనగల్గుతుంది.  ఆర్ఎస్ఎస్​కు అతి చిన్న కేంద్రం శాఖ. సంఘ శాఖల్లో బోధించే ముఖ్యమైన విషయమేమిటంటే.. భారతదేశం ఒక హిందూ రాష్ట్రం (దేశం). వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు, వారు ప్రవర్తించే తీరుతెన్నుల ద్వారా ప్రస్ఫుటమయ్యే ఐక్యత అనే బలమైన అవగాహనతో భారతదేశం పరిఢవిల్లింది. భారతదేశ సంస్కృతి, జ్ఞానాలను ఒక పరంపరగా తరతరాలకు అందించే సంప్రదాయమున్నది. అది హిందూ సంస్కృతిగా గుర్తింపబడుతున్నది. ఈ విలువలను, ప్రతీకలను రక్షించుకోవడం, పెంపు చేయడమే అత్యంత ప్రాధాన్యం వహించే కార్యం. భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం కలిగి ఉండడం, అది అనుసరణీయమైందనే భావనను వ్యాప్తి చేయడం, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక కాలానికి తగ్గట్టుగా మలచుకోవడం, దేశహితమే ప్రధానం అనే భావన అలవరుచుకోవటం కీలకం.  భారతదేశ ఐక్యత, సమగ్రత అనే శ్రేష్ట భావన దీన్నుంచే లభిస్తుంది. ఇదే అఖండ భారత్ లేదా జాతీయ సమగ్రతా భావ సందేశం. 

హిందూ సంస్కృతిలో వైవిధ్యం

సమాజంలో కులం, మతం, ధనం ఆధారంగా తారతమ్యాలు కానీ, పక్షపాతాలు కానీ ఉండకూడదని సంఘం విశ్వసిస్తుంది. హిందూ సంస్కృతిలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. అది ఒక గర్వకారణం కూడా. ఆ ప్రాతిపదికపైనే ప్రపంచ స్థాయిలో పరస్పర సహకారం, గౌరవం, శాంతి సాధించటం ముఖ్యమనే సందేశాన్నిస్తుంది ఆర్ఎస్ఎస్. ఈ మౌలిక సమన్వయ సూత్రాలే 'హిందూ రాష్ట్ర’ కు ఆధారం. ఇవన్నీ శాఖలో సులభంగా వివరించబడతాయి. భారతదేశ ఘనమైన వారసత్వం నుంచి, ప్రశస్తమైన శాస్త్రీయ అవగాహన నుంచి సంఘం స్ఫూర్తి పొందుతుంది. సమాజంలో వచ్చే మార్పులన్నింటినీ సందర్భోచితంగా అన్వయించుకునే శక్తి కలిగివుంది కాబట్టే ఆధునికంగా ఉండగలుగుతున్నది. తర్వాత తరాలతో కూడా సమస్యలు లేకుండా సంబంధాలు దృఢపరుచుకోగల్గుతున్నది. 

సామాన్య ప్రజల సంస్థ

సమాజసేవకు 'శాఖా పద్ధతి' ఒక జగన్నాథ రథం వంటిది. అందరూ కలిసి లాగటం ప్రారంభించిన తర్వాత ఎవరూ దీనిని ఆపలేరు. అయితే, తన ఆలోచనలతో, విధానాలతో సమాజంపై ఆధిపత్యం చలాయించాలనే కోరిక సంఘానికి ఎన్నడూ లేదు. సమాజపు అవసరాలను గుర్తించటమే కాక స్పందించే గుణాన్ని కలిగివుంది.  వ్యక్తితో వ్యక్తి పరిచయం ద్వారా మాత్రమే సంఘాన్ని నిర్మించడం, సమాజంతో కలపడం అనే ప్రక్రియ అద్భుతం. ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు నివ్వడమే కాకుండా ప్రతి వ్యక్తినీ కలుపుకొని పోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతాయి. ఈ స్పష్టమైన విధానమే అన్ని వర్గాలవారు సంఘంతో కలిసి పోవడానికి బలమైన కారణమవుతున్నది. ఎలాగైతే వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నవారు వారి  గమ్యాలకు చేరేలా ట్రాఫిక్ రూల్స్ ఉపయోగపడతాయో, అలాగే సంఘ క్రమశిక్షణ కూడా విభిన్న వర్గాలవారు కలిసి పనిచేసేలా, కలిసి ముందుకుసాగేలా చేస్తుంది. అందుచేతనే ఆర్ఎస్ఎస్​ సామాన్య ప్రజల సంస్థగా తయారుకాగలిగింది. ఒకరి నుంచి మరొకరికి దేశంలో చాలా సహజంగా  వేగంగా విస్తరించింది. సంస్థ ఆలోచన ధోరణి  సామాన్య ప్రజల సాధారణ, నిరాడంబరతకు దగ్గరగా ఉంటుంది. దేశంలో, సమాజంలో మార్పు రావాలంటే సామాన్య ప్రజల ద్వారానే సాధ్యం అని సంఘం ప్రగాఢ నమ్మకం. సాధారణ ప్రజలకు అర్థమయ్యే సామాన్య అంశాలు, అవసరమైన విలువల గురించే సంఘం ఆలోచిస్తుంది. అందుకే ఒకసారి సంఘంలో చేరిన వ్యక్తి తన జీవితాంతం స్వయంసేవక్ గా మిగిలిపోవాలని  కోరుకుంటాడు.   

సంఘం ఆలోచన సరళం, స్పష్టం

మంచిగా ఉండు. ఇతరులకు మంచిచేసే చర్యల ద్వారా ఆ మంచిని సమాజం అంతటికీ పంచు.. అందుకే ఈ ఆధునిక కాలంలో కూడా జీవితపు విలువలు నేర్చుకోవడం కోసం తమ పిల్లలు ఆర్ఎస్ఎస్​శాఖకు హాజరవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. స్వయంగా అనేకమంది తల్లితండ్రులు తమ పిల్లలను శాఖకు తీసుకువచ్చి వదిలి వెళ్తున్నారు. శాఖకు వెళ్తున్న తమ పిల్లలు వారి నిజ జీవితంలో ఆచరించే మంచి నడవడిక,  దేశభక్తి చూసి వాళ్ల హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. .  కుల, వర్గ, ప్రాంత  రాజకీయ పరిధులను అతిక్రమించి సంఘాన్ని ప్రారంభించిన  డాక్టర్​జీ పనితీరు ఎంతో అద్భుతం. అన్ని దృక్పథాలకు చెందిన జాతీయ నాయకులకు సంఘాన్ని పరిచయం చేయడానికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. నాగ్​పూర్ లో  మొట్టమొదటి శాఖ ప్రారంభమైన మొహితేవాడ మైదానంలోని శాఖకు నాటి అసెంబ్లీ స్పీకరు శ్రీ విఠల్ భాయ్ పటేల్ సందర్శించి ‘ఇంతవరకు ఎక్కడ చూసినా చైతన్యం లేని సంస్థలే నాకు కనిపించాయి. కానీ, ఇక్కడ మాత్రం దేశభక్తి ప్రపూరితులు, సహనశీలురైన ధీరులను మొదటిసారిగా చూస్తున్నాను’ అని ప్రశంసించారు. 

సర్వత్రా ప్రశంసలు

2016 జనవరి 3న పుణేలో ‘శివశక్తి సంఘం’ పేరుతో సంఘం ఒక పెద్ద  కార్యక్రమాన్ని నిర్వహించింది. సమాజంలో వివిధ వర్గాలకు చెందిన అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  వీరితోపాటు 80,554 మంది గణవేషధారులైన స్వయంసేవకులు కూడా పాల్గొని సంఘ సర్ సంఘచాలక్  మోహన్ జీ భగవత్  ప్రసంగం విన్నారు. కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన స్త్రీలు, పురుషులు కలిపి  1,58,772 మంది పాల్గొన్న అతి పెద్ద సభ ఇది. ఈ సభలో విభిన్న సంప్రదాయాలకు చెందిన ప్రముఖులు సైతం పాల్గొన్నారు. పుణేలోని మహారాష్ట్ర కాస్మోపాలిటన్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి లతీఫ్ మగ్దుం, పూర్వ వైస్ చాన్సలర్ డా. ఎస్ఎన్ పఠాన్, ఇస్లామిక్ రచయిత అనీష్ చిస్తే, ముంబైలోని విల్సన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. అన్నా ప్రతిమా జి. నికెల్దే లాంటి విద్యావేత్తలు, పండితులు హాజరయ్యారు. అదేవిధంగా కాలేవాడి మదర్సా ట్రస్టీ  గుల్జార్ షేక్, పుణే దపోడికి చెందిన మౌలానా షకీయుద్దీన్, పుణె రవివార్పేట్ మౌలానా షౌకత్, ఫాదర్ ఫ్రాన్సిస్ డెబ్రిటో సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతీరావు పూలే కుటుంబ నాలుగోతరం  వారసుడు 43 ఏండ్ల స్వయంసేవక్ నితిన్రాంచంద్ర పూలే లాంటి గొప్పవాళ్లు అందరూ హాజరయ్యారు.  
అతిథులందరూ ఆర్ఎస్ఎస్​ చేస్తున్న కార్యక్రమాలపై ఎన్నో ప్రశంసలు కురిపించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో సంఘం నిరంతరం మంచి సంబంధాలు కలిగి ఉంటుంది.  

సంఘంలో అనేక అనుబంధ సంస్థలు

సంఘంలో వేదికలు చాలా ఉన్నాయి. తమ వృత్తిని, తాము ఉంటున్న ప్రదేశాలను వదలకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమాజ కార్యం చేయవచ్చు. సమాజంలో స్పష్టమైన, అర్థవంతమైన మార్పు రావాలనే తపనతో పని చేసేవారికి సంఘం ఒక మంచి కార్యరంగం. సంఘ కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో చూపుతున్న ప్రభావాన్ని బట్టి మనల్ని, మన కుటుంబాలను, దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆనందమయంగా మార్చగలిగేది సంఘ శాఖ అని రుజువవుతోంది. ప్రస్తుత కాలపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పవిత్ర, ఉన్నత కార్యంలో మనందరి భాగస్వామ్యం పెరగాలి.

‘హిందూ’ మతం కాదు

సంఘ ఆలోచన ప్రకారం ‘హిందూ’ అనే శబ్దం ఏ మతానికీ సంబంధించింది కాదు. అది భారత జాతీయతకు సంబంధించినది. అది అందరినీ కలుపుకుని పోయేది. అన్నివర్గాల వారిని, అన్ని విశ్వాసాల వారిని ఒక ఆత్మీయ ఆలింగనంలో కలిపివుంచే ఒక మహత్తర శబ్దం. ఆర్ఎస్ఎస్​ దృష్టిలో సామాజిక మార్పు అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. అది సమాజ సంసిద్ధత. సమాజ వాస్తవిక అంచనా ఆధారంగా జరగాలి. అప్పుడే మార్పు స్థిరంగా ఉంటుంది. అందుకే ఆకస్మిక, యాదృచ్ఛిక మార్పులను సంఘం  విశ్వసించదు. సంఘ కార్యకలాపాలన్నీ ప్రణాళికాబద్దంగా, అనుభవంతో కూడిన మార్గదర్శనంతో, విశ్వాసంతో, వాస్తవిక ఆచరణాత్మక విధానంతో కూడి ఉంటాయి.

- త్రిలోక్