- సిటీలో తనిఖీలు పెంచాలి.. జరిమానాలు విధించాలి
- గ్రేటర్ ట్రాఫిక్ పోలీసుల రివ్యూలో సీపీ తరుణ్జోషి
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో నంబర్ ప్లేట్ లేని వెహికల్స్కనిపిస్తే డైరెక్ట్ స్టేషన్ కు తరలిస్తున్నామని సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు. బుధవారం సిటీలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ లో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీ మధుసూదన్తో కలిసి ట్రైసిటీ ట్రాఫిక్ డిపార్టుమెంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. స్టేషన్ల వారిగా నమోదైన ట్రాఫిక్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. నంబర్ ప్లేట్ లేకున్నా.. వెహికల్ నంబర్ కనపడకుండా ట్యాంపరింగ్ చేసినా సీరియస్ యాక్షన్ తప్పదన్నారు. ఇలాంటి వాటిని డైరెక్ట్ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. ఇందుకోసంస్పెషల్ డ్రైవ్ లు కూడా నిర్వహించాలని సూచించారు.
సీటు బెల్టు తప్పనిసరి..
కారులో ప్రయాణించే క్రమంలో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణించేవారు సైతం సీటు బెల్ట్ పెట్టుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సీపీ ఆదేశించారు. అలాగే ప్రజలు ఎక్కువ ఉండే ప్రభుత్వ ఆఫీసులు, షాపింగ్ మాల్స్ వద్ద ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది నిరంతరం రోడ్లపై ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని చెప్పారు. ప్రధానంగా స్కూల్ పిల్లలు, ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు పోలీసులు తప్పక ఫీల్డ్ మీద డ్యూటీల్లో ఉండాలన్నారు. ఆఫీసర్లు ప్రతినెలా నైట్ డ్రైవ్స్ నిర్వహించాలని.. రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేందుకు స్టేషన్ల వారిగా బ్రీత్ అనలైజర్ మెషిన్లు అందించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాబులాల్, ఆర్ఐ సతీష్ పాల్గొన్నారు.
నిమజ్జనంలో రూల్స్ పాటించాలి
నర్మెట్ట, వెలుగు: గణపతి నిమజ్జనం చేసే సమయంలో రూల్స్ పాటించాలని జనగామ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాలకు చెందిన గణేశ్మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు. డీజేలకు అనుమతి లేదని, నిర్దేశించిన చెరువులు, కుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. సర్పంచులు లైట్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సీఐ నాగబాబు, ఎస్సైలు, సర్పంచులు పాల్గొన్నారు.