న్యూఢిల్లీ: ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ పేమెంట్స్ కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తాజాగా వాట్సాప్పై యాంటి ట్రస్ట్ ఆరోపణలు వచ్చాయి. మెసేజింగ్లో తనకున్న ఆధిపత్యాన్ని పేమెంట్ సర్వీస్లో ఎంట్రీకి వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఈ కంపెనీపై సీసీఐకి ఫిర్యాదులు అందాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ యాప్కు మన దేశంలో సుమారు 40 కోట్ల మంది యూజర్లుంటారు. వాట్సాప్కున్న ఈ పొజిషన్ను పేమెంట్ సెక్టార్లో ఎదిగేందుకు కంపెనీ వాడుతోందని ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతానికి వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ఇంకా ఇండియా మొత్తం అందుబాటులోకి రాలేదు. రెగ్యులేటరీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడంతో ఈ సర్వీసెస్ను కంపెనీ ఇంకా విస్తరించలేదు. మెసేజింగ్ యాప్లోనే పేమెంట్ ఫీచర్ను కూడా యాడ్ చేసి, ప్రస్తుతం ఉన్న యూజర్లకు బలవంతంగా పేమెంట్ సర్వీస్లను వాట్సాప్ అందిస్తోందని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు(సీసీఐ) కి ఫిర్యాదు అందింది. సీసీఐ ఈ ఫిర్యాదును పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫిర్యాదుకు సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్ స్పందించలేదు. ఒక లాయర్ ఈ ఫిర్యాదు చేశారని ఈ వర్గాలు చెప్పాయి.
రెండేళ్లుగా టెస్టింగ్
వాట్సాప్ తన పేమెంట్ సర్వీసెస్ను 2018 నుంచి ఇండియాలో టెస్ట్ చేస్తోంది. కేవలం10 లక్షల మంది యూజర్లపై ఈ టెస్టింగ్ జరుపుతోంది. ఈ ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు చేయొచ్చు లేదా దీని వలన ఎటువంటి ఉపయోగం లేదనుకుంటే కొట్టేయొచ్చని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ కేసు స్టార్టింగ్ స్టేజ్లో ఉందని, సీసీఐ సీనియర్ మెంబర్లు దీనిని పరిశీలిస్తున్నారని అన్నాయి. ఇంకా సీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి. మెసెంజర్, పేమెంట్ సర్వీస్లను వాట్సాప్ కలిపి అందివ్వడం కాంపిటిషన్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, ఇండియాలోని యాంటి ట్రస్ట్ చట్టానికి ఇది వ్యతిరేకమని పేర్కొన్నాయి. వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ విస్తరిస్తే, ఇప్పటికే ఉన్న గూగుల్ పే, పేటీఎం వంటి కంపెనీలకు పోటీగా మారుతుంది. ఈ సర్వీస్లను ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయలేదు కాబట్టి కంపెనీ యాంటిట్రస్ట్ దర్యాప్తుల నుంచి తప్పించుకోవచ్చని ఈ వర్గాలు తెలిపాయి. వాట్సాప్ పేమెంట్ సర్వీస్ను విస్తరిస్తే డేటా స్టోరేజి రూల్స్ను అతిక్రమించినట్లవుతుందని కొంత మంది లాయర్లు గతంలోనూ సుప్రీం కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. ఇండియాలోని నిబంధనలకు అనుగుణంగానే ముందుకెళ్తామని అప్పట్లో కంపెనీ కోర్టుకు స్పష్టం చేసింది.