2024 లోక్సభ ఎన్నికల్లో మరోసారి తన కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుస్తానని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రెజ్లర్లచే లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సింగ్, ప్రధాని మోడీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గోండాలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
శరణ్ సింగ్ తన ప్రసంగంలో రెజ్లర్ల నిరసనను, తనపై లేవనెత్తిన ఆరోపణలను సింగ్ పై ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. 2014, 2019లో పార్టీ సాధించిన భారీ విజయాలను గుర్తు చేసుకుంటూ 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వ పనితీరును కొనియాడిన శరణ్ సింగ్ గత తొమ్మిదేళ్లలో సాధించిన విజయాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా కాశ్మీర్లో జరిగిన పనులను, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కృషిని శరణ్ సింగ్ ప్రశంసించారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు శరణ్ సింగ్. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో పాకిస్తాన్, చైనాలు భారత్ నుంచి వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించాయని ఆయన ఆరోపించారు.