ఎన్ఎస్ఈ కేసులో సీబీఐపై కోర్టు ఫైర్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) కోలొకేషన్ కేసులో సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీ కోర్టు మండిపడింది. ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా నడుస్తున్నదంటూ ఆఫీసర్లను మందలించింది. ‘‘ రూ.వెయ్యి కోట్ల స్కామ్ ఇది! ఇంతకంటే ఎక్కువ మొత్తం కూడా కావొచ్చు. మనదేశ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది. ఎందరో విదేశీయులు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఎస్ఈలో అంతా బాగానే ఉందని అనుకుంటారు. మోసాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎవరు డబ్బు పెడతారు ? ఇన్వెస్టిగేషన్ను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు”అని స్పెషల్ జడ్జి సంజీవ్ అగర్వాల్విమర్శించారు. ఇంకెన్నాళ్లు ఇన్వెస్టిగేషన్ చేస్తారని ప్రశ్నించారు. ఇండియా మీద నమ్మకం పోతుందని, ఇన్వెస్టర్లు చైనా వెళ్లిపోతారని అన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఎన్ఎస్ఈ ఆఫీసర్ను ఇన్వెస్టిగేషన్సమయంలో ఎటైనా తీసుకెళ్లారా ? అని అడగ్గా ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రతో కలసి ప్రశ్నించామని సీబీఐ తెలిపింది. అయినప్పటికీ పెద్దగా సమాచారం దొరకలేదని పేర్కొంది. ‘‘మరి అతణ్ని నేరం జరిగిన చోటుకు ఎందుకు తీసుకెళ్లలేదు ? మీరు సీబీఐ ఆఫీసులో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతున్నారు. అసలు ఇందులో సెబీ పాత్ర ఏంటి ? క్యాపిటల్ మార్కెట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. కేవలం అరవడమే కాదు కరవాలి”అని అన్నారు. ఆనంద్, చిత్రలను కలిపి ప్రశ్నించామన్న విషయాన్ని కూడా రాతపూర్వకంగా తెలియజేయలేదని అగర్వాల్ మండిపడ్డారు.