న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా పుంజుకుంటున్న మన మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్కు కొవిడ్ దెబ్బ తగలనుంది. ఇండియాలో తయారయ్యే మొబైల్ ఫోన్లకు కాంపోనెంట్స్ (విడిభాగాలు) చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. కొవిడ్ ముప్పుతో చైనాలోని చాలా ఫ్యాక్టరీలను మూసేశారు. దీంతో మూడో క్వార్టర్ దాకా చైనా కాంపోనెంట్స్ సప్లై పుంజుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా జరగాల్సిన అనేక టెక్నాలజీ కాన్ఫరెన్సులు వాయిదాపడటంతోపాటు, టెక్ కంపెనీలు తమ ప్లాన్స్నూ మార్చుకోవల్సి వస్తోంది.
ఇండియాలోని మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు కాంపోనెంట్స్ కోసం ఇంకా చైనా మీదే ఆధారపడుతున్నాయి. జనవరి–మార్చి మధ్య కాలం (ఫస్ట్ క్వార్టర్)లో ఇండియాకు స్మార్ట్ఫోన్ షిప్మెంట్స్ కనీసం 15 శాతం తగ్గుతాయని కౌంటర్పాయింట్ రిసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరు దాకా ఇండియా చేరిన షిప్మెంట్స్ వరకూ పర్వాలేదు. కానీ, ఈ నెలలో సమస్య కొంత క్లిష్టంగా మారుతుందని చెప్పారు. కిందటి నెలలోనే చైనాలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లన్నీ మూతపడటమే కారణమని తెలిపారు. చైనాలో పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తూ, ఇండస్ట్రీ సిట్యుయేషన్ను వారానికోసారి అప్డేట్ చేస్తున్నట్లు పాఠక్ పేర్కొన్నారు.
చైనాలో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లున్న కంపెనీలకు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కొత్త మోడల్స్ తేవడమూ కష్టంగా మారనుంది. కాంపోనెంట్స్ సప్లైలోనూ ఇబ్బందులుంటాయని కౌంటర్పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ పీటర్ రిచర్డ్సన్ తెలిపారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో చైనాలో స్మార్ట్ఫోన్ సేల్స్ 30 శాతం తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. జూన్తో ముగిసే రెండో క్వార్టర్ దాకా సప్లై చెయిన్పై కొవిడ్ ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నిజాన్ని టెక్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోందని అన్నారు.
కొవిడ్ దేశం తర్వాత దేశానికి వ్యాపిస్తుండటంతో పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ తమ కాన్ఫరెన్స్లను పోస్ట్పోన్ చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా 57 దేశాలకు కొవిడ్ వ్యాపించింది. చాలా సిటీల్లో ఇప్పటికే ఎమర్జెన్సీని విధించారు కూడా. స్మార్ట్ఫోన్స్ నుంచి కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాన్యుఫాక్చరింగ్ దాకా వివిధ రంగాలు ఇబ్బందులకు గురవనున్నాయి. సప్లై చెయిన్ దెబ్బ తినడమే ఇందుకు కారణం. కొవిడ్ కేసులు పెరిగే కొద్దీ ఈ ఎఫెక్ట్ మరింత తీవ్రం కానుంది.
కొవిడ్ అసలు ప్రభావం అమెరికా, యూరప్లలో మార్చి మధ్య నాటికి బాగా తెలుస్తుందని, కొన్ని వేల అసెంబ్లీ, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు తాత్కాలికంగా ప్రొడక్షన్ నిలిపి వేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పేర్కొంది. కాంపోనెంట్స్, మెటీరియల్స్ కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గత నెల రోజులుగా చైనాలో మాన్యుఫాక్చరింగ్ నిలిచిపోయిందని, మరి కొన్ని నెలలపాటు తక్కువ స్థాయిలోనే కొనసాగుతుందని తన రివ్యూలో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పేర్కొంది.
చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో 2002లో సార్స్ వైరస్ మొదటిసారి గుర్తించారు. 2003 నాటికి 8 వేల కేసులకు చేరింది. ఆ ఏడాది గ్లోబల్ జీడీపీలో చైనా వాటా 4.31 శాతంగా నమోదైంది. అప్పటితోపోలిస్తే, కొవిడ్ ఇప్పటికే 80 వేల మందికి సోకగా, 3 వేల మంది చనిపోయారు. ఇప్పుడు గ్లోబల్ జీడీపీలో చైనా వాటా నాలుగు రెట్లు పెరిగి 16 శాతానికి చేరిందని ఆ రిపోర్టు తెలిపింది. కాంపోనెంట్స్, మెటీరియల్స్ సప్లైకి పట్టే టైం మీదా ప్రభావం వుంటుందని అభిప్రాయపడింది. సముద్ర మార్గంలో అమెరికా, యూరప్లకు వస్తువులు పంపడానికి సగటున్న 30 రోజులు పడుతుంది. చైనా కొత్త సంవత్సరమైన జనవరి 25 కి ముందే మాన్యుఫాక్చరింగ్ను చైనాలోని యూనిట్లు నిలిపి వేసి ఉంటే, వాటి చివరి షిప్మెంట్స్ యూఎస్, యూరప్లకు ఫిబ్రవరి ఆఖరి వారంలో చేరతాయని ఆ రిపోర్టు తెలిపింది. దీంతో అసెంబ్లీ, మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ మార్చి మధ్య నాటికి తాత్కాలికంగా మూతపడటం ఎక్కువవుతుందని పీరీ హారెన్, డేవిడ్ సిమ్చి లెవిలు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.