అఫ్గాన్‌ను ప్రపంచం వదిలేసింది: భావోద్వేగంతో యువతి మాటలు

అఫ్గాన్‌ను ప్రపంచం వదిలేసింది: భావోద్వేగంతో యువతి మాటలు

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోయింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విదేశాలకు పారిపోయాడు. అధ్యక్ష భవనాన్ని తాలిబన్ ప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అఫ్గాన్‌ నుంచి విదేశాలకు వెళ్లేవాళ్లు వందల, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొందరు ఆ దేశం నుంచి బయటపడ్డారు. అలా ఢిల్లీకి వచ్చిన ఓ యువతి చాలా భావోద్వేగంతో మాట్లాడింది. ప్రపంచమంతా అఫ్గాన్‌ను ఇలా వదిలేస్తారని అనుకోలేదని కంటతడి పెట్టుకుంది.

‘‘అఫ్గాన్‌ను ప్రపంచమంతా ఏకాకిలా వదిలేయడాన్ని నేను నమ్మలేకపోతున్నా.. ఆ దేశంలో ఉండిపోయిన నా స్నేహితులు తాలిబన్ల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోతారన్న ఆలోచనను తట్టుకోలేకపోతున్నా.  అక్కడ ఉన్న మహిళలకు ఇకపై ఎలాంటి రక్షణ, హక్కులు ఉండబోవు” అని ఎంతో ఆవేదనతో ఆ యువతి మాట్లాడింది. కాబూల్‌ నుంచి ఆ యువతి ఈ రోజు తెల్లవారుజామున ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంది.