World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ విజేత ఎవరో జోస్యం చెప్పిన సల్మాన్ ఖాన్

World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ విజేత ఎవరో జోస్యం చెప్పిన సల్మాన్ ఖాన్

ప్రపంచ కప్‌ ఫైనల్‌ పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం(నవంబర్ 19) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ కోసం  ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోస్యం చెప్పారు. 

ముంబైలో జరిగిన 'టైగర్ 3' ఈవెంట్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచకప్ టైటిల్ పోరులో టీమిండియా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

"వరల్డ్ కప్‌లో భారత జట్టు ఎలా ఆడుతున్నదో మనందరం చూశాం.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఛాంపియన్‌గా నిలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో ఇండియా విజయం సాధిస్తుంది(ఇన్సల్లాహ్, కల్ ఇండియా జీత్ జాయేగీ)." అని సల్మాన్ ఖాన్ భారత జట్టుపై తనకున్న ప్రేమను బయటపెట్టారు.

ఇక ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో టైగర్ 3తో ముందుకొచ్చామని తెలిపిన కండలవీరుడు.. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టిందని పేర్కొన్నారు. భారత్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గెలిచిన అనంతరం ప్రేక్షకులు మరోసారి థియేటర్‌లకు రావాలని చెప్పారు.

కాగా, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన యాక్షన్ మూవీ 'టైగర్ 3' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ కలెక్షన్లపై వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రభావం చూపుతున్నాయి. ప్రేక్షకులు టీవీలు అతుక్కుపోతుండడంతో వసూళ్లు పెద్దగా కనిపించడం లేదు. తొలి ఆరు రోజుల్లో రూ. 200.65 కోట్లు నెట్‌, రూ. 312 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.