
యాదాద్రి, వెలుగు : గెట్టు పంచాయితీలో ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వడపర్తి గ్రామానికి చెందిన అన్నదమ్ములు మెడబోయిన వెంకయ్య, మెడబోయిన బాల్నర్సింహ మధ్య భూవివాదం నెలకొంది. ఈనెల 22న బావి వద్ద ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారు గొడవ పడ్డారు. దీంతో బాల్ నర్సింహా కుమారుడు మల్లేశ్ కోపంతో వెంకయ్య కుమారుడు భాను(30)తో గొడవకు దిగాడు. ఆవేశంలో తన తల్లి శంకరమ్మ చేతిలోని గొడ్డలిని మల్లేశ్ లాక్కుని భాను తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరగడంతో కిందపడిపోయాడు.
వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున భాను మృతి చెందాడు. మృతదేహాన్ని వడపర్తికి తీసుకొచ్చి న్యాయం చేయాలని డిమాండ్చేస్తూ కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడే పికెటింగ్ ఏర్పాటు చేశారు. భాను కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దాడి చేసిన మల్లేశ్తోపాటు అజయ్, శంకరమ్మను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.