కొన్ని పెద్ద పెద్ద కంపెనీల సీఈవోల ఏడాది శాలరీ కన్నా ఒక యూట్యూబర్ ఏడాదిలో సంపాదించేది చాలా ఎక్కువ. ఆ యూట్యూబర్ పేరు అజయ్ నగార్. యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన వయసు పదేళ్లు. ఇప్పుడు దేశంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్తో టాప్ పొజిషన్లో ఉన్న యూట్యూబర్. ప్రయత్నమే పెట్టుబడిగా మొదలుపెట్టిన ఆయన ఛానెల్ ‘క్యారీమినాటి’కి ప్రస్తుతం 33.6 మిలియన్ల సబ్స్క్రయిబర్స్ ఉన్నారు.
క్యారీమినాటి ఛానెల్తో ఫేమస్ అయిన యూట్యూబర్ అజెయ్ నగార్ది ఫరీదాబాద్. కాకపోతే పెరిగిందంతా ఢిల్లీలోనే. 12 జూన్ 1999లో పుట్టాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి చదువంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించేవాడు. ఏదైనా కని పెట్టాలని ఆరాటపడుతుండేవాడు. పదేళ్ల వయసులో తన ఫ్రెండ్స్ మొబైల్స్లోనూ, సైబర్ కేఫ్లోనూ గేమ్స్ ఆడడం, యూట్యూబ్లో వీడియోలు చూడడం మొదలుపెట్టాడు. అంతేకాదు అదే వయసులో యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనను తాను యూట్యూబ్కు పరిచయం చేసుకున్నాడు. చాలా తక్కువ టైంలోనే అతన్ని ప్రజలకు పరిచయం చేసింది యూట్యూబ్. 2008–-2009 మధ్యలో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఎక్కువగా కామెడీ స్కిట్స్, రోస్ట్- సెంట్రిక్, డిస్ ట్రాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. అజయ్కి లైవ్ గేమింగ్ ఛానెల్ కూడా ఉంది. డిస్స్ వీడియోలు, సాంగ్స్కి పేరడీలు, సెటైరికల్ కామెడీ వీడియోలు ఎక్కువగా చేస్తాడు. మొదటగా ‘అడిక్టెడ్ ఏ1’ పేరుతో చానెల్ పెట్టాడు. అందులో గేమింగ్ వీడియోలను షేర్ చేసేవాడు. వీడియోలు చేయడమే కాకుండా అతడిలో మరో టాలెంట్ కూడా ఉంది. అదే మిమిక్రీ. కొన్నాళ్ల తర్వాత ఛానెల్ పేరును ‘క్యారీ డియోల్’గా మార్చాడు. ఆ తర్వాత ‘క్యారీమినాటి’గా మార్చాడు. 2017లో అతను ‘క్యారీఈస్లైవ్’ పేరుతో మరో ఛానెల్ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.
చిన్నప్పుడే
అజయ్కు పదమూడేళ్ల వయసులోనే యూట్యూబ్ కెరీర్పై పూర్తి నమ్మకం కలిగింది. అప్పటినుంచి ఏదో ఒక విధంగా సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. అప్పట్లో డిజిటల్ మీడియా పెద్దగా డెవలప్ కాలేదు. యూట్యూబ్ చూసేవాళ్లు కూడా తక్కువే. అయినా.. యూట్యూబ్నే కెరీర్గా ఎంచుకుని ముందుకు అడుగేశాడు. ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతనిలో ఉన్న ఆసక్తి, చేసిన ప్రయత్నాలే ఛానెల్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. కంటెంట్తో చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్కు దగ్గరయ్యేలా చేసింది.
గొడవ
2020 సంవత్సరంలో టిక్టాకర్ ‘అమీర్ సిద్ధిఖీ’పై రోస్ట్ వీడియో చేశాడు. అది చాలా పెద్ద గొడవకి దారితీసింది. ఆ వీడియోను 70 మిలియన్ల కంటే ఎక్కువమంది చూశారు. అప్పట్లో అది యూట్యూబ్లో ఫేమస్ వీడియో. ఎక్కువమంది చూసిన నాన్ మ్యూజికల్ వీడియో కూడా అదే. అయితే.. ఈ వీడియోను చాలామంది టిక్ టాకర్స్ అపోజ్ చేశారు. దాంతో యూట్యూబ్ ఆ వీడియోను డిలిట్ చేసింది. అప్పట్లో టాప్ యాప్గా కొనసాగుతున్న టిక్టాక్పై కూడా క్యారీమినాటి ఎఫెక్ట్ పడింది. ప్లేస్టోర్లో టిక్టాక్ యాప్ రేటింగ్ వరుసగా తగ్గుతూ వచ్చింది. క్యారీమినాటికి మద్దతుగా సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ కూడా జరిగింది. సెలబ్రిటీలు కూడా క్యారీ మినాటిని సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేశారు.
కోట్లలో సంపాదన
అజెయ్ నగర్ చిన్న వయసులోనే చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పటివరకు దాదాపు 32 కోట్ల రూపాయలకుపైగా సంపాదించాడు. ప్రస్తుతం నెలకు 25 లక్షల కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే ఇంత సక్సెస్ సాధించాడు కాబట్టే.. 2019లో టైమ్ మ్యాగజైన్ అజెయ్ నగర్ను ‘నెక్స్ట్ జనరేషన్ లీడర్’ అని చెప్పింది. అంతేకాదు క్యారీమినాటి 2 గోల్డ్ ప్లే బటన్లు, రెండు వెండి, ఒక డైమండ్ ప్లే బటన్ను అందుకుంది.
క్యారీమినాటి అంటే..
చాలామంది యూట్యూబ్ ఛానెల్ పేరు క్యారీ మినాటి పేరుతోనే అతన్ని పిలుస్తారు. వాస్తవానికి ఆ పేరులో క్యారీని ఒక వీడియోగేమ్ నుంచి తీసుకున్నాడు. కౌంటర్ స్రైక్ గేమ్లో ‘క్యారీ’ అంటే జట్టును నడిపించే ఆటగాడు. అతనే మొత్తం సైన్యాన్ని నడిపిస్తాడు. అందుకే కొందరు వీడియో గేమ్స్ ఆడేవాళ్లు తమ పేరుకు ముందు ‘క్యారీ’ అని పెట్టుకుంటారు. ‘మినాటి’ అనే పదం ‘ఇల్యూమినాటి’ అనే పదం నుండి వచ్చింది. ‘ఇల్యూమినాటి’ అంటే.. ‘ప్రకాశించడం’ అని అర్థం. రోజులో 10 గంటలు కంటెంట్ క్రియేషన్ కోసం పనిచేస్తాడు. మిగిలిన టైంలో యాక్టింగ్, మ్యూజిక్లాంటివి నేర్చుకుంటాడు.
రోజుకు పదివేల మంది
క్యారీమినాటి ఛానెల్ను ప్రతిరోజూ సగటున దాదాపు 10,000 మంది కొత్తగా సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నారు. అంతేకాదు వీడియోలకు రోజుకు సగటున 1.5 నుంచి 2.5 మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అజయ్ రెండో ఛానెల్కు ప్రతిరోజూ 5,000 మంది సబ్స్క్రయిబర్లు చేరుతున్నారు. ఈ ఛానెల్ వీడియోలకు రోజుకు 1.6 నుంచి 2.1 మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.