
ఫ్రిజ్లో ఉన్న ఐస్ ముక్కను పట్టుకోవాలంటేనే మనం ఏదో ఒక క్లాత్తో పట్టుకుంటాం. మరి 18 గంటల పాటు ఐస్ గడ్డల కింద ఉండటమంటే.. మామూలు విషయం కాదు. అవును.. పాకిస్తాన్కు చెందిన 12 ఏళ్ల సమినా బీబీ 18 గంటల పాటు మంచుగడ్డల కింద నరకం చూసి ప్రాణాలతో బయటపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం ప్రస్తుతం మంచుతో మునిగిపోయింది. అక్కడి నీలం లోయలో హిమపాతం వల్ల చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందల మంది తమ ప్రాణాలను కొల్పోయారు. నీలం లోయలో సమినా కుటుంబం ఓ మూడంతస్తుల ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. సోమవారం వారుంటున్న ఇంటి మీద మంచుగడ్డలు పడి ఆ ఇల్లు మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సమినా సొదరి మరియు సొదరుడు ప్రాణాలు కొల్పోయారు. సమినా తల్లి షహనాజ్ మరియు ఆమె సోదరుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమినా మాత్రం ఆ ఇంట్లోనే చిక్కుకుంది.
‘మంచుతో మునిగిన ఇంట్లో ఒక గదిలో చిక్కుకున్న నేను సహాయం కోసం ఎంతో అరిచాను. దాదాపు 18 గంటల తర్వాత అధికారులు నన్ను గుర్తించి బయటకు తీశారు. ఆ గదిలో చిక్కుకున్నప్పుడు నేను అసలు నిద్రపోలేదు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూస్తూనే ఉన్నాను’ అని సమినా తెలిపింది. ప్రస్తుతం సమినా ముజఫరాబాద్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో సమినా కాలు విరిగింది. అన్ని గంటలపాటు మంచులో ఉండటం వల్ల సమినా రక్తం కక్కుకుంది. ఇప్పుడు సమినా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమినా బతుకుతుందని తాము అసలు ఊహించలేదని సమినా తల్లి షహనాజ్ అన్నారు. హిమపాతం వల్ల తాము ఉంటున్న మూడంతస్తుల ఇల్లు మునిగిపోయిందని ఆమె తెలిపారు. ఆ ఇంట్లో తమతో పాటు తమ గ్రామానికి చెందిన ప్రజలు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు ఆమె తెలిపారు. వారిలో కనీసం 18 మంది చనిపోయినట్లు ఆమె తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా హిమపాతం వల్ల గత రెండు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పెరిగిందని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కాగా.. శుక్రవారం నుండి ఈ ప్రాంతంలో మరింత భారీ హిమపాతం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు.
For More News..